పెద్దపల్లి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి ప్రాంతవాసులు జిల్లా కావాలని అడగకున్నా.. పాలనాదక్షుడు సీఎం కేసీఆర్ బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్న రామగుండం, మంథనిని కలిపి ముందుచూపుతో 2017లో పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీగా ఉన్న పెద్దపల్లిని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో దాదాపు రూ.వెయ్యి కోట్లతో ఎన్నో పనులు చేశారు.
రూ.12 కోట్లతో మానేరు, హుస్సేన్మియా వాగుపై 17 చెక్ డ్యాంలు, రూ.150 కోట్లతో గల్లీల్లో సీసీ రోడ్లు నిర్మించారు. రూ.120 కోట్ల డీఎంఎఫ్టీ ఫండ్స్తో పనులు చేపట్టారు. రూ.11 కోట్లతో 27 గోదాంలు అందుబాటులోకి తెచ్చారు. నియోజకవర్గ కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు డబుల్లేన్ రహదారులు, లింక్ రోడ్లు నిర్మించారు. సీహెచ్సీని జిల్లా దవాఖానగా అభివృద్ధి చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రధాన రోడ్లు విస్తరించి ట్రాఫిక్ ఇక్కట్లను దూరం చేశారు,
ఎల్లమ్మ గుండమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దారు. ఇక్కడ ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. ప్యాసింజర్, స్పీడ్, పైడల్ బోట్లను అందుబాటులోకి తెచ్చారు. వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసి మినీ ట్యాంక్ బండ్పై ఎల్ఈడీ లైట్లను అమర్చారు. రాత్రి వేళల్లో ఎల్లమ్మగుండమ్మ చెరువు అందాలు ప్రజలను కనువిందు చేస్తున్నాయి. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ప్రధాన కూడళ్లలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రం సిద్ధించిన తర్వాత పెద్దపల్లి, సుల్తానాబాద్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. జిల్లా కే్రందంలో రూ.47 కోట్లతో సమీకృత కలెక్టరేట్ను నిర్మించారు. మూడేండ్లలోనే సుమారు రూ.2 కోట్లతో పనులు చేపట్టారు. ప్రస్తుతం మరో రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. మరో రూ. 20 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయి.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ దవాఖానలను అధునీకరించారు. మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో కొత్తగా పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ఏరియా దవాఖానను జిల్లా దవాఖానగా అప్గ్రేడ్ చేశారు. ఇందులో అధునాతన సౌకర్యాలు కల్పించారు. రూ. 17 కోట్లతో మతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ఆరోగ్య మహిళా కేంద్రంలో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో తెచ్చారు. ఓదెల మండలంలో 6 పల్లె దవాఖానలు ఏర్పాటు చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం, సుల్తానాబాద్ మండలం కనుకులతో పీహెచ్సీలో ఏర్పాటు చేశారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 18, పట్టణ ప్రాంతాల్లో 6 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 104 సబ్ సెంటర్లు, 3సీహెచ్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో అవసరమున్న వారి రక్త నమూనాలను సేకరించి జిల్లా కేంద్రంలోని టీహబ్ డయోగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తున్నారు. డయోగ్నోస్టిక్ సెంటర్లో 134 రకాల పరీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు ఖర్చుతో కూడుకున్న సిటీస్కాన్, 2డీ ఎకో, అల్ట్రా సౌండ్, మ్యామొగ్రఫీ లాంటి స్కానింగ్ పరీక్షలు పేదలకు అందుబాటులోకి వచ్చాయి.
జిల్లా దవాఖానలో ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇటు పెద్దపల్లి, జిల్లాలోని ఇతర ప్రాంతాల కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్కు వెళ్లాల్సిన బాధలు తప్పాయి. ఇక్కడే రోజుకు 20మంది కిడ్నీ బాధితులకు 24 గంటల పాటు సేవలు అందిస్తున్నారు.
జిల్లాల పునర్విభజన తర్వాత మేజర్ పంచాయతీగా ఉన్న పెద్దపల్లిని మున్సిపాలిటీగా ప్రకటించారు. 36 మంది కౌన్సిలర్లతో పాలకవర్గం కొలువు తీరింది. పట్టణ అభివృద్ధికి రూ.వందల కోట్లు మంజూరు చేశారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. అయ్యప్ప టెంపుల్ చౌరస్తా, జెండా చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ను అమర్చారు. ప్రధాన రహదారులపై డివైడర్లను నిర్మించడంతో పాటు సెంట్రల్ లైటింగ్ను అందుబాటులోకి తెచ్చారు. కూరగాయల మారెట్ను అప్గ్రేడ్ చేశారు. వ్యవసాయ మారెట్ ఆవరణలో ఫిష్, చికెన్, మటన్, కూరగాయల మారెట్లను ఒకే దగ్గర నిర్మించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు.
రాష్ట్రంలోనే తొలి స్వచ్ఛ నియోజక వర్గం పెద్దపల్లి. 6 మండలాల్లో 15, 000 వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించారు. మరుగుదొడ్లతో పాటు స్నానాల గది నిర్మించిన మొదటి నియోజకవర్గం పెద్దపల్లే. పల్లె, పట్టణాల్లో మౌళిక వసతుల కల్పనకు పల్లె పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయి. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలకు కొత్త శోభ వచ్చింది. ఊరూరా ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడాప్రాంగణాలు, శ్మశాన వాటికలు, నర్సరీలు, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్, హరిత మిత్ర అవార్డులు పెద్దపల్లి నియోజక వర్గాన్ని వరించాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా హరిత మిత్ర అవార్డు పొందిన ఎమ్మెల్యేగా దాసరి మనోహర్రెడ్డి నిలిచారు.
పెద్దపల్లి వ్యవసాయాధారిత జిల్లా. రెండు పంటలు పండే సారవంతమైన నేలలున్న ప్రాంతం. తెలంగాణ రాక ముందు సాగు నీటి రంగాన్ని సమైక్య పాలకులు నిర్లక్ష్యం చేశారు. దీంతో నెర్రలుబారిన నేలలు, చివరి ఆయకట్టుకు సాగు నీరు అందని దయనీయ పరిస్థితులు ఉండేవి. రైతాంగం అందోళలు, రాస్తారోకోలు , ఎండిన పొలాలను తగలబెట్టిన ఘటనలు కోకోల్లలు. కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లోని చివరి ఆయ కట్టుకు నీరందేదికాదు. నియోజకవర్గానికి డీ-83, డీ-86 ప్రధాన ఎస్సారెస్సీ కాలువలతో పాటు ఉపకాలువల ద్వారా సాగు నీరందించాలి. కానీ అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో వానకాలం పంట మాత్రమే పండేది. కానీ ఇప్పుడు నెర్రలు బారిన నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్తో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కలంగా సాగునీరందడంతో బంగారు పంటలు పండుతున్నాయి.
మిషన్ కాకతీయ కింద నియోజకవర్గంలోని 355 చెరువులకు రూ.11. 83 కోట్లతో 351 పునరుద్ధరించారు. పూడిక తీసి, తూములు, కట్టలు మరమ్మత్తు చేశారు. ఇప్పుడు ఎండకాలంలో చెరువుల్లో నిండుగా కళకళలాడుతున్నాయి. రెండు పంటలు పండుతున్నాయి.
కాల్వశ్రీరాంపూర్ మండలం రాయపేటలో రూ.22.18 కోట్లతో నిర్మించిన రాయపేట రిజర్వాయర్తో మండలంలోని సుమారు 18కుంటలకు జలకళ వచ్చింది. హుస్సేన్ మియా వాగు నుంచి పైపులైన్లను వేసి రాయపేటలో రెండు గుట్టల మధ్య రిజర్వాయర్ నిర్మించారు. 4వేల ఎకరాల వరకూ సాగునీరందుతున్నది.
మన ఊరు – మన బడి ద్వారా ఓదెల మండలం 12 పాఠశాలలు ఎంపిక చేశారు. అధునీకరణ పనులు సాగుతున్నాయి. కాల్వ శ్రీరాంపూర్లో 16 స్కూల్స్ ఎంపిక చేయగా, రూ. 36 లక్షలు వ్యయంతో రెండు పాఠశాలల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల పనులు ప్రగతిలో ఉన్నాయి. సుల్తానాబాద్యలో 12 స్కూల్స్ ఎంపిక కాగా, కదంబపూర్, గర్రెపల్లి పాఠశాలలో రూ. 29 లక్షలతో ఆధునీకరించారు. రూ. 40 లక్షల అంచనావ్యయంతో చేపట్టిన గర్రెపల్లి స్కూల్ ప్రహరీని నిర్మిస్తున్నారు. జూలపల్లి మండలంలో 13 స్కూల్ ఎంపిక చేశారు. ప్రస్తుతం రూ. 2 కోట్ల నిధులతో అధునీకరణ పనులు, పెద్దపల్లి మండలం రాఘవాపూర్ స్కూల్ను ఆధునీకరించారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల కేంద్రాలను కలుపుతూ డబుల్ రోడ్డు నిర్మించారు. ఓదెల మండలంలో రూ.6 కోట్లతో మడక-గుంపుల డబుల్ రోడ్డు పనులు పురోగతిలోఉన్నాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతిపెల్లి ఇదులాపూర్ మీదుగా మండల కేంద్రం వరకు 10 కిలో మేర బీటీ రోడ్డు నిర్మించారు.
కాల్వశ్రీరాంపూర్ వెన్నపల్లి మీదుగా పెద్దపల్లి దాకా డబుల్రోడ్డు నిర్మించారు. కాల్వశ్రీరాంపూర్ నుంచి మల్యాల మీదగా గుంపుల వరకు డబుల్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. పెద్దపల్లి కరీంగనర్ జిల్లాల వారధిగా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల -వెగురుపల్లి మధ్య రూ. 47 కోట్లు ఖర్చుతో నిర్మించారు. జూలపల్లి మండలంలో వడ్కాపూర్ -కాచాపూర్ మధ్య, జూలపల్లి – కుమ్మరికుంట మధ్య రూ.కోటితో వంతెనలు నిర్మించారు. జూలపల్లిలో రూ. 50 లక్షలతో తహసీల్దార్ భవనాన్ని నిర్మించారు. జూలపల్లి మండలం కుమ్మరికుంటలో రూ. 8 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఎలిగేడు నుంచి పెద్దాపూర్ బీటీ రోడ్డు పనులు, పెద్దపల్లిలో రూ. 119 కోట్లతో నిర్మిస్తున్న కూనారం ఆర్వోబీ పనులు వేగంగా సాగుతున్నాయి.
పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లన్న ఆలయానికి దేవాదాయశాఖ రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసింది. ఆలయ అధునీకరణ, బంగారు పోచమ్మ, మదన పోచమ్మ ఆలయ పునరుద్దరణ చేపట్టి పూర్తి చేశారు. పెద్దపల్లి మండలం రాగినేడులో శివాలయాన్ని నిర్మించారు.