వైద్య రంగంలో నయా విప్లవం మొదలుకాబోతున్నది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్, జగిత్యాలలో మొదలు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య కళాశాల రెడీ అయింది. సిరిసిల్ల రెండో బైపాస్రోడ్డులోని పెద్దూరు శివారులో అప్పారెల్ పార్కు సమీపంలో 166కోట్లతో 35 ఎకరాల స్థలంలో విశాల భవన సముదాయం పూర్తయింది. 100 సీట్లకుగానూ ఇప్పటికే 90 అడ్మిషన్లు రాగా, ఈ నెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కార్మిక క్షేత్రంలో వైద్య, విద్య అందుబాటులోకి వస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కార్మిక, ధార్మిక క్షేత్ర ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే నిమ్స్, గాంధీ దవాఖానకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో ఖరీదైన వైద్యాన్ని అందించేలా కృషి చేశారు. 100 పడకల దవాఖానను 300 పడకలకు పెంచడమే కాకుండా జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయించారు. మే 11న నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా, 166కోట్లతో 35 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల భవన నిర్మాణం చేపట్టారు. పనులు శరవేగంగా సాగి తుది దశకు చేరగా, ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేశారు.
మూడంతస్తుల్లో నిర్మాణం
సిరిసిల్ల రెండో బైపాస్రోడ్డులోని పెద్దూరు శివారు అప్పారెల్ పార్కు సమీపంలో 35 ఎకరాల స్థలంలో వైద్య కళాశాల నిర్మాణం చేపట్టారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అత్యాధునిక హంగులతో మూడు అంతస్థుల్లో భవన సముదాయం నిర్మించారు. వంద సీట్లతో ప్రారంభం కాబోతున్న ఈ కాలేజీ భవనంలో మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఆధునిక హంగులతో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యార్థుల కోసం గ్రంథాలయం, పరిశోధన గదులు, పరికరాలు సిద్ధం చేశారు. బోధనా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు, ప్రినిపాల్ చాంబర్లు సిద్ధం చేశారు. కావాల్సిన పరికరాలు హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పర్చువల్ పద్ధతిలో భవనాన్ని ప్రారంభించనున్నారు. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాలకు రంగులు వేయిస్తున్నారు. కళాశాల చుట్టూ బీటీ రోడ్డు వేస్తున్నారు.
విద్యార్థులు, బోధనా సిబ్బందికి సౌకర్యాలు
వైద్య కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. వంద సీట్లున్న కాలేజీలో ఇప్పటికే 90 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. అందులో 89 మంది ఇప్పటికే జాయిన్ అయ్యారు. మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం బయోకెమిస్ట్రీ, అనాటమీ, ఫిజియోలాజీ తరగతులు నిర్వహిస్తారు. మూడు విభాగాల కోసం క్లినికల్ లెక్చర్ గ్యాలరీ, పరిశోధన కేంద్రాలు, గ్రంథాలయం ఏర్పాటు చేశారు. విద్యార్థుల వసతి గృహాలను సమీపంలోని సర్దాపూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో తాత్కాలికంగా వంద మందికి సరిపడేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు కళాశాల నుంచి వసతి గృహం, ఏరియా దవాఖానకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. డైరెక్టర్ ఆఫ్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, కావాల్సిన సౌకర్యాలు దశల వారీగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 60 మంది ప్రొఫెసర్లు అవసరం కాగా, ఇప్పటికే 30 మంది నియమితులయ్యారు. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు, మిగిలిన వారందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.
నిబంధనల ప్రకారం ఏర్పాట్లు
జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం సిరిసిల్ల మెడికల్ కళాశాలలో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. ఆధునాతన హంగులతో నిర్మించిన భవన సముదాయంలో ప్రొఫెసర్, ప్రిన్సిపాల్ గదులు ఏర్పాటు చేశాం. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో కళాశాలలో నైపుణ్య బోధన విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. వంద సీట్లకు గాను ఇప్పటికే 90 మంది అడ్మిషన్ తీసుకున్నారు. 89 మంది జాయిన్ అయ్యారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నది మంత్రి సంకల్పం. ఆయన కృషితోనే ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల వచ్చింది.
– చంద్రశేఖర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ (రాజన్న సిరిసిల్ల)