గులాబీ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు పెద్దపల్లి జిల్లాలో సర్వం సిద్ధమైంది. ఆధునిక వసతులు, సకలహంగులతో పెద్దబొంకూరు శివారులోని కల్వల క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, గౌరెడ్డిపేటలో టీఆర్ఎస్ జిల్లా ఆఫీసును సీఎం ప్రారంభించి, తర్వాత పెద్దకల్వలలో లక్ష మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పాలనా సౌధాన్ని, పార్టీ కార్యాలయాన్ని ముస్తాబు చేయడంతోపాటు 50ఎకరాల్లో సభాస్థలిని తీర్చిదిద్దింది. వాహనాల పార్కింగ్కు మరో 130 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, సీఎం టూర్ నేపథ్యంలో కరీంనగర్ నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రం ప్రధాన రహదారి గులాబీమయమైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసుశాఖ మూడు వేల మంది, ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టబోతున్నది.
పెద్దపల్లి, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): సీఎం పర్యటనకు జిల్లాలో సర్వం సిద్ధమైంది. యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పెద్దబొంకూరు శివారులో కల్వల క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, గౌరెడ్డిపేట శివారు నిర్మించిన పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి అందంగా ముస్తాబు చేసింది. పెద్దకల్వలలోని 50ఎకరాల మైదానంలో లక్ష మంది జన సమీకరణతో నిర్వహించే బహిరంగ సభాస్థలాన్ని తీర్చిదిద్దింది. వేదికపై మంత్రులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 200 మంది దాకా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ – పెద్దపల్లి దారి గులాబీమయం..
కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో కరీంనగర్ – పెద్దపల్లి ప్రధాన దారులన్నీ గులాబీమయమయ్యాయి. సీఎం కాన్వాయ్ కరీంనగర్ నుంచి రోడ్డు మార్గంలో జిల్లా సరిహద్దు సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుంచి భూపతిపూర్, ఐతరాజ్పల్లి, గర్రెపల్లి, నర్సయ్యపల్లి, కాట్నపల్లి, సుగ్లాంపల్లి, చిన్నకల్వల మీదుగా జిల్లా కేంద్రానికి రానుండగా, దారులన్నీ గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, స్వాగతతోరణాలతో నిండిపోయాయి. ముఖ్యమంత్రికి అడుగడుగునా స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్శ్రేణులు, అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
3వేల మందితో బందోబస్తు..
సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐజీ నాగిరెడ్డి, రామగుండం ఇన్చార్జి సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 3వేల మందితో పోలీసుశాఖ బందోబస్తు చేపడుతున్నది. ఒక డీఐజీ, నలుగురు డీసీపీలు, 20మంది ఏసీపీలు, 8మంది ఎస్పీలు, ఐదుగురు అడిషనల్ ఎస్పీలు, ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా ఒక ఎస్పీ, 20 స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభ నిర్వహణ సందర్భంగా రామగిరి, చెన్నూరు, గడ్చిరోలి జిల్లాల సరిహద్దుల్లో సైతం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వారం రోజులుగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కేంద్రంలో వన్వేను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ డైవర్షన్స్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేయనున్నారు.
సీఎం పర్యటన ఇలా..
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన వస్తున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం జిల్లాకు చేరుకుంటారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దాసరి నివాసానికి వెళ్లి భోజనం చేసిన అనంతరం, నేరుగా గౌరెడ్డిపేటకు వెళ్లి టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత పెద్ద బొంకూరులో జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా పెద్దకల్వలలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పర్యటన ముగించుకొని రోడ్డు మార్గంలోనే హైదరాబాద్కు తిరుగుపయనం కానున్నారు.
లక్షమందితో సభ
పెద్దకల్వల శివారులో లక్ష మంది జనసమీకరణతో నిర్వహించే సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. 50 ఎకరాల్లో సభాస్థలిని ముస్తాబు చేశారు. సభకు హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కోసం మరో 130ఎకరాల్లో ఐదు బ్లాకులు కేటాయించారు. సభకు జిల్లా నలుమూలల నుంచే గాక కరీంనగర్, మంచిర్యాల జిల్లాల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు తరలిరానున్నారు.
పర్యవేక్షించిన మంత్రులు, ఎమ్మెల్యేలు..
కాగా, సభా ఏర్పాట్లను ఆదివారం మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీలు టీ. భానుప్రసాదరావు, ఎల్.రమణ పరిశీలించారు. వారి వెంట కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చైర్మన్ బాలమల్లు, టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, ఐజీ నాగిరెడ్డి, రామగుండం ఇన్చార్జి సీపీ సత్యనారాయణ, డీసీపీలు రూపేష్, అఖిల్మహాజన్, ఏసీపీలు సారంగపాణి ఉన్నారు.
వెలుగుజిలుగుల్లో సమీకృత కలెక్టరేట్..
జిల్లా సమీకృత కలెక్టరేట్ జిగేల్మంటున్నది. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభంకాబోతుండగా, విద్యుద్దీప కాంతులతో భవనం మెరిసిపోతున్నది. మువ్వన్నెలు మురిసేలా మూడు రంగులతో ప్రత్యేకంగా భవనాన్ని అలంకరించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారంతో పాటుగా భవనంలోని అన్ని కార్యాలయాలను ప్రారంభానికి అందంగా ముస్తాబు చేశారు.
టీఆర్ఎస్ జిల్లా భవన్ ముస్తాబు..
జిల్లా కేంద్రంలోని గౌరెడ్డిపేటలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ముస్తాబైంది. ఈ ఆఫీసును నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటుగా జిల్లా స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా గౌరెడ్డిపేట శివారులో ఎకరం విస్తీర్ణంలో మీటింగ్ హాల్, పార్టీ కార్యాలయం, శిక్షణ హాల్, సెక్యూరిటీ గదిని నిర్మించారు. దాదాపుగా 2వేల మందితో సభలు, సమావేశాలు నిర్వహించుకునే విధంగా కార్యాలయాన్ని నిర్మించారు.