ఇల్లంతకుంట, మే 26: రాష్ట్రంలోని సబ్బండవర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం తొలిపొద్దులో భాగంగా ఇల్లంతకుంట మండలం రేపాక, సోమారంపేట, వెంకట్రావుపల్లె, గొల్లపెల్లి, తిప్పాపూర్, అనంతగిరి, ఇల్లంతకుంట, పత్తికుంటపల్లె, తాళ్లపెల్లి, గాలిపెల్లి, నర్సక్కపేట, జవారిపేట గ్రామాల్లో కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వివిధ కారణాలతో పలువురు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మండల ప్రజాపరిషత్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా నిర్వహించే దశాబ్ధి ఉత్సవాలు, వడ్ల కొనుగోలుపై సమీక్షించారు. అనంతరం ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధునిక పనిముట్ల అద్దె కేంద్రానిన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో సాయం చేస్తున్నారన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఒటుకూరి వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, డైరెక్టర్ రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో మీర్జా, ఏపీఎం వాణిశ్రీ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.