మళ్లీ మనమే గెలుస్తున్నామని, మీ ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఈ రోజు చల్లగా బతికేటట్లు చేసిన మంత్రి కేటీఆర్ను మరోసారి మంచి మెజార్టీతో దీవించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆగం జేసేవాళ్లు.. అబద్ధాలు చెప్పేవాళ్లు మీ ముందుకు వస్తున్నారని, వాళ్ల మాటలు విని మోసపోవద్దని సూచించారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా గోసపడే ప్రమాదమున్నదని హెచ్చరించారు. మంగళవారం సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరై, దాదాపు 20 నిమిషాలపాటు ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో కరువు పరిస్థితులు, నేతన్నల ఆత్మహత్యలను ప్రస్తావించారు. ఆనాడు ఎండిపోయిన ఎగువమానేరు, చుక్కనీరులేని మానేరును గుర్తు చేస్తూనే.. ప్రస్తుతం సజీవ జలధారగా మారడంపై సంతోషం వ్యక్తం చేశారు. నాటి కాంగ్రెస్ పాలనను ఎండగడుతూనే.. మళ్లీ కష్టాలు కొని తెచ్చకుందామా..? అంటూ ప్రశ్నించారు. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. మంత్రి కేటీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. మీ నాయకుడికి మంచి భవిష్యత్ ఉందంటూ ఆశీర్వదించారు. సిరిసిల్ల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. నాటికి నేటికీ ఎలా మారిందో ఒక్కసారి పోల్చి చూడాలని ప్రజలకు సూచించారు.
కరీంనగర్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిరిసిల్ల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ మనమే గెలుస్తామని, ఇంకా అభివృద్ధి చేసుకుందామని, అందులో ఎవరికి ఎటువంటి అనుమానమూ లేదని చెప్పారు. మీ నాయకుడు రామారావుకు మంచి భవిష్యత్ ఉన్నదని, మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. మోసపూరిత పార్టీల మాటలువిని ఆగం కావద్దని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల నాటికి నేటికి ఎలా మారిందో ఒక్కసారి పోల్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఇప్పుడు మండుటెండల్లోనూ ఎగువమానేరు మత్తడి దుంకుతున్న తీరు చూసి తనకు సంతోషంగా ఉన్నదని, ఎగువమానేరు నుంచి మధ్యమానేరు వరకు మానేరు నది సజీవధారను తలపిస్తున్నదని, భూములన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో ఇంత సాధించామంటే.. భవిష్యత్లో ఇంకా ఎంత సాధిస్తామో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మొదటి బైపాస్ రోడ్డులో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, మానేరు సజీవ జలధారగా మారిన తీరు, నేతన్న, రైతన్న సంక్షేమానికి చేసిన కృషిని వివరించారు. ఆయన మాటల్లోనే..
మానేరును సజీవ జలధారగా మార్చుకున్నాం
“డబ్బు ఏండ్ల నా జీవితంలో కనీసం ఒక వంద డబ్బు సార్లు సిరిసిల్లలో తిరిగిన. ఇక్కడ బంధాలు, బంధుత్వాలు, ఆత్మీయతలు, ఎంతో మంది క్లాస్మేట్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ సిరిసిల్ల. నేను హెలీకాప్టర్ నుంచి వస్తా ఉంటే అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు మానేరు జలధారగా మారడం చూసి చాలా సంతోషమనిపించింది. నేను చిన్నప్పుడు ఆ గూడెంలో మోటర్ బైక్పై గానీ, సైకిల్పై గానీ ముస్తాబాద్ నుంచి వస్తే.. 50 ఏండ్ల కింద మానేరు నదిలో బ్రహ్మాండంగా నీళ్లు కనిపించేటియి. కానీ, సమైక్య పాలనలో మొత్తం నాశనమైపోయింది. నేనే నా కండ్లార చూసిన. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో మా అక్కను ఇచ్చినం. అక్కడ అప్పర్ మానేరు కాలువలో ఈతలు కొట్టిన. నా కండ్ల ముందే పోతుగల్ గ్రామంలో పదిహేను ఇరువై రైస్మిల్లులు వచ్చినయ్. కానీ, సమైక్య పాలకుల దౌర్జన్యం, దోపిడీ ఎట్లెట్ల పెరిగిందో.. అట్లనే అవన్నీ మాయమైనయ్. అప్పర్ మానేరు అడుగంటి పోయింది. దుమ్ము రేగింది. ఉద్యమ కాలంలో అప్పర్ మానేరు ప్రాజెక్టులో సభ పెట్టుకున్నం. నెర్రలు పెట్టిన భూములతో అన్నదాతలు ఆందోళన చెందిన్రు. అప్పుడే అనుకున్నం. ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రం రావాలె. మళ్లీ సజీవ జలధారగా మారాలె అని ఎట్లయితే కలగన్నమో.. ఇవాళ నెరవేర్చుకున్నం. ఎండకాలంలో దుంకుతా ఉంటే చాలా ఆత్మ సంతృప్తి కలుగుతున్నది.
నేతన్నలను కాపాడుకున్నం
ఉద్యమ సమయంలో నేను, ప్రొఫెసర్ జయaశంకర్ కలిసి తిరిగిటోళ్లం. ఒక రి మధ్యరాత్రి సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు కారులో వెళ్తున్నం. ఆనాడు గోడలపై ఆత్మహత్మలు వద్దంటూ రాసిన రాతలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నం. ఈ బాధలు ఎందుకని ఆనాడు బాధపడ్డం. ఆ తర్వాత మీరందరూ ఆదరిస్తే నేను ఎంపీగా అయిన. ఓ రోజు ఉదయాన హైదరాబాద్లో పేపర్ తిరగేస్తే ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్నట్టు కనిపించింది. ఆ వార్త చదివి చలించిపోయిన. ఆరోజు ప్రభుత్వం లేదు. కానీ, పార్టీ డబ్బులు ఒక 50 లక్షలు తెచ్చి ఇచ్చిన. మీకు దండం పెడుత సచ్చిపోకండి, మీ అందరినీ కాపాడుకుంట.. అని చెప్పిన. ఈనాడు మీ మంత్రి కేటీఆర్ చేనేత జౌళీ శాఖ మంత్రిగా ఉన్నరు. మీ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మాతో కొట్లాడి అమలు చేస్తున్నరు. అందులో భాగమే బతుకమ్మ చీరలు. అయితే, వాటిని కూడా కొంతమంది దుర్మార్గులు కాలపెడుతున్రు. ఆ చీరలను కట్టుకొమ్మని బలవంతం పెట్టడం లేదు కదా..? ఎందుకు కాలపెడుతున్రు? ఎందుకు రాజకీయాలు చేస్తున్రు? ఆ చీరల ఆర్డర్ల వెనుక ఉన్న అంతర్యమేమిటన్నది అర్థం చేసుకోలేరా..? చేనేత కార్మికుల జీవనోపాధి కోసం బతుకమ్మ చీరలు నేయించి ఇస్తుంటే దానిని రాజకీయం చేస్తున్నరు. ఇటువంటి వారిని ఏమనాలో ఒక్కసారి ఆలోచించాలి.
కేటీఆర్ మంత్రిగా మీ ఉండడం అదృష్టం
సిరిసిల్లలో ఏమేం జరిగిందో రామారావు ఇప్పుడే చెప్పిండు. రామారావు గొప్పోడు అని పొగిడితే అది నన్ను నేను పొగుడుకున్నట్లు ఉంటది. కాబట్టి రామారావు గుణమేందో.. గణమేందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు ఆయన కలిసి పనిచేస్తున్నరు కాబట్టి, నేను రామారావును పొగిడే అవసరం లేదు. ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే ఉండడం మీ అందరి అదృష్టం. ఆయన, చేనేత మంత్రిగా ఉండడం వల్ల ప్రతీసారి ఏ మీటింగ్ పెట్టినా ఇక్కడ చేనేత కార్మికులకు కావాల్సిన మరమగ్గాలు, సాంచాల ఆధునీకరణకు కావాల్సిన డబ్బులు తెచ్చిండు. సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితి మార్చిండు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు చల్లగా బతికేటట్లు చేసినందుకు రామారావును హృదయపూర్వకంగా అభినందిస్తున్న.”
పాల్గొన్నది వీరే..
ప్రజా ఆశార్వాద సభకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షత వహించగా.. రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదరరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ స్వీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టెక్స్టైల్ కార్పొరేషన్ ఛైర్మన్ గూడూరి ప్రవీణ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గ్రంథాల య చైర్మన్ అకునూరి శంకరయ్య, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మో హన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, రాఘవరెడ్డి, సిరిసిల్ల, వేములవాడ ము న్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మా ధవి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఉద్యమ నేత వెన్నంటి నిలిచిన జిల్లా ప్రజలు
రాష్ట్ర సాధన కోసం డిప్యూటీ స్పీకర్ పదవిని తృ ణప్రాయంగా వదిలిపెట్టిన ఉద్యమ నేత వెంట రాజన్న సిరిసిల్ల ప్రజలు నిలిచి ఉద్యమించారు. 2001లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ ప్రాంతంలో ప్రజలు గులాబీ జెండానే ఎగుర వేశారు. 2004లో కేసీఆర్ను కరీనంనగర్ పార్లమెంటు సభ్యుడిగా భారీ మెజార్టీతో గెలిపించారు. 2006లో రాజీనామా చేసిన సమయంలోనూ, 2008లోనూ ఆయన వెంటే నడిచారు. సీఎం ఆదేశాల మేరకు 2009లో కేటీఆర్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఉద్యమం, రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్షకు బయలుదేరినప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు కేసీఆర్ వెంట నడిచి రాష్ట్ర సాధనలో జిల్లా ప్రజలు పోరాటం చేశారు. సబ్బండ వర్ణాలు, కులాలు, మతాలకతీతంగా రోడ్డుమీదికొచ్చి ఉద్యమాలు చేశారు. సీఎం నాయకత్వంలో దేశంలోనే గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమంలో సిరిసిల్లను ఆదర్శంగా నిలిపిన మంత్రి కేటీఆర్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరుతున్నా. సిరిసిల్ల అభ్యర్థిగా రామన్నకు టిక్కెట్ ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజల పక్షాన అధినేతకు కృతజ్ఞతలు.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు