నర్సన్న దీవెనతో పునర్నిర్మాణంవైపు
వేములవాడ రాజన్న క్షేత్రంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
ఇప్పటికే ప్రత్యేక చొరవతో ప్రగతివైపు అడుగులు
ఆలయంతోపాటు పట్టణ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు
రూ.వందల కోట్లతో పరుగులు పెడుతున్న పనులు
ముఖ్యమంత్రి చూపుతో భక్తుల్లో హర్షాతిరేకాలు
యాదాద్రికి మించి తీర్చిదిద్దుతారంటున్న అభిప్రాయాలు
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం దివ్యవైభవ క్షేత్రంగా రూపుదిద్దుకోబోతున్నది. భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ దివ్యధామం, అద్భుత క్షేత్రనగరిగా మారబోతున్నది. అత్యంత ప్రీతిపాత్రమైన రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, యాదాద్రి నర్సన్న దీవెనలతో స్వామి వారి సేవకు కదలబోతున్నారు. ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించగా, కోట్లాది రూపాయలతో పనులు పరుగులు పెడుతున్నాయి. ఆది నుంచీ రాజన్నపై అత్యంత భక్తిని చాటుతున్న సీఎం, యాదాద్రికి మించి వేములవాడను తీర్చిదిద్దుతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వేములవాడ/ వేములవాడ టౌన్, మార్చి 29: ఎములాడ రాజన్న అమితమైన ప్రేమ ఉన్న సీఎం కేసీఆర్, ఈ క్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని గతంలోనే సంకల్పించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మూడుసార్లు వేములవాడకు వచ్చారు. 2015 జూన్ 18న, డిసెంబర్ 28న, 2019 డిసెంబర్ 30న కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోడెను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు గుడిచెరువు, ఆలయ పరిసరాలు, పట్టణ పరిసరాల్లో ఆయన క్షేత్రస్థాయిలో తిరిగారు. అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. మొదటి సారి సందర్శించిన అనంతరం వేములవాడ పట్టణం, రాజన్న ఆలయాన్ని సమగ్రాభివృద్ధి చేసేవిధంగా వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ (వీటీడీఏ)ను ఏర్పాటుచేశారు. వీటీడీఏ ద్వారా ఇప్పటికే కోట్లాది రూపాయలను వెచ్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేశారు.
భూసేకరణ రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను రూపొందించారు. ఏడాదికి కోటిన్నరకు పైగా భక్తులు వస్తున్నందున వచ్చే వందేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ విస్తరణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. శృంగేరి పీఠాధిపతి అనుమతి పొంది ఆ తర్వాత ఆలయాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. స్వామివారి ప్రధాన అంతర్గత ఆలయ విస్తీర్ణం గతంలో 16 గుంటల్లోనే ఉండగా, 40 గుంటలకు పెంచేలా నివేదికలు తయారు చేశారు. రెండో ప్రాకారం నిర్మాణాలను చేపట్టేందుకు అంచనాలను రూపొందించారు. అలాగే గుడిచెరువు ఈశాన్య భాగాన్ని విస్తరించేందుకు 90.36కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శ్రీ సీతారామస్వామివారి, శివకల్యాణాలను వేలాది మంది వీక్షించేలా వేదికలు నిర్మించేందుకు అంచనాలు తయారు చేశారు. బ్రహ్మ పుష్కరిణి ఆధునీకరించడంతోపాటు మరో పుష్కరిణి నిర్మించేందుకు, అదనపు స్నానపుగదులను కూడా నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. శిథిలావస్థకు చేరుకున్న శంకరపురం, రాజేశ్వరపురం ధర్మశాలలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా 500 వరకు వసతి గదులు అందుబాటులో ఉండగా, మరో 300 వసతి గదులను నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ చేశారు.
అనుబంధ ఆలయాలు..
బద్దిపోచమ్మ ఆలయాన్ని 39గుంటల్లో విస్తరించేందుకు భూసేకరణ పూర్తి చేశారు. భీమేశ్వరాలయం ఎదుట ఖాళీస్థలంలో క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి, అలాగే స్వామివారి అనుబంధ దత్తత దేవాలయాలైన నాంపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కూడా అబివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కోట్లాది రూపాయలతో పనులు
వేములవాడలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పూర్తి కాగా, మిగిలిన వాటిని వేగవంతం చేశారు. 90.63కోట్లతో ఆలయ గుడిచెరువు మినీ ట్యాంక్బండ్, ఐలాండ్ ఏర్పాటు కోసం పనులు చేస్తున్నారు. 30కోట్లతో ఇప్పటికే గుడి చెరువుకు 37ఎకరాలను సేకరించారు. 45కోట్లతో గుడిచెరువు సుందరీకరణ సముదాయాల నిర్మాణాలకు అంచనాలు వేశారు. పట్టణానికి అనుసంధానంగా రహదారులు, వంతెన నిర్మాణానికి 101కోట్లు వెచ్చించి నిర్మాణాలు పూర్తి చేశారు. 20కోట్లు వెచ్చించి బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ కోసం 39 గుంటల స్థలాన్ని సేకరించారు. మంచినీటి అవసరాల కోసం 7.50కోట్లతో ప్రత్యేక పైపులైన్ నిర్మించారు. ఇక పట్టణాభివృద్ధిలో భాగంగా 42కోట్లతో మిషన్ భగీరథ పనులు పూర్తి చేశారు. కోటితో ఇప్పటికే ఫైర్స్టేషన్ భవనం నిర్మించి, సేవలందిస్తున్నారు. 2.50కోట్లతో మున్సిపల్ నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. 22.50కోట్లతో అత్యాధునిక వసతి సముదాయాలతో వంద పడకల దవాఖానను నిర్మించారు.
33కోట్లతో సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. 7కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. 1.70కోట్లతో వైకుంఠధామ నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. పట్టణంలో 20కోట్లతో మూలవాగుపై నాలుగు చెక్డ్యామ్లు నిర్మిస్తున్నారు. 42కోట్లతో 800 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించారు. 1.50లక్షలతో డంప్యార్డు నిర్మాణం తుదిదశకు చేరుకోగా, కోటితో పట్టణంలో చెత్తను సేకరించేందుకు వాహనాలను కొనుగోలు చేశారు.