గోదావరిఖని, ఆగస్టు 28: రామగుండం నియోజకవర్గంపై మొదటి నుంచి ప్రత్యేక దృష్టిసారిస్తున్న సీఎం కేసీఆర్, మరోసారి తన మమకారాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో పలు నిర్మాణాలు, అభివృద్ధి పనుల కోసం 54.10 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగా, ఎమ్మెల్యే చందర్ కృషి ఫలించింది.
ఇటీవల సీఎం కేసీఆర్ను కలిసి నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్, నిర్మాణాలు తదితర అభివృద్ధి పనుల కోసం డీఎంఎఫ్టీ నిధులు కేటాయించాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే చందర్ ఏదీ కోరినా సీఎం సానుకూలంగా స్పందిస్తూనే ఉన్నారు. ఇటీవలే మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సీనియర్ సివిల్ కోర్టు, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు కేటాయించిన తాజాగా అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చారు.