ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పూర్తి వివక్ష కారణంగా వెనుకబడిన పెద్దపల్లి నియోజకవర్గం ఉద్యమ నేత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రంగా మారి స్వపరిపాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కృషి ఫలితంగా నియోకవర్గ వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులతో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంతో రవాణా సౌకర్యాలు ఎంతగానో మెరుగుపడ్డాయి. గతంలో తాగేందుకే గుక్కెడు నీళ్లు దొరకని పెద్దపల్లి నేడు జిల్లా కేంద్రం కావడంతో చారిత్రాత్మక అభివృద్ధికి వేదికైంది. ముఖ్యమంత్రి చొరవతో అభివృద్ధి, సకల సౌకర్యాలతో అగ్రభాగాన నిలుస్తున్నది.
– పెద్దపల్లి, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ)
సమైక్య పాలనలో గోసపడ్డ పెద్దపల్లి నియోకవర్గంలో ఈ తొమ్మిదిన్నరేండ్లలో చారిత్రాత్మక అభివృద్ధి జరిగింది. ఊరూరా బీటీ, సీసీ రోడ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగరథ, మన ఊరు-మన బడి, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందు నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం, స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో తన ముఖచిత్రాన్నే మార్చుకున్నది. ముఖ్యంగా సాగు, తాగు నీరు, విద్య, వైద్య, రోడ్లు భవనాల నిర్మాణాలలో విప్లవాత్మక మార్పులు సాధించింది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచన చేసి పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించగా, సరికొత్త హంగులతో, సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది.
అభివృద్ధి ప్రదాతకు అడుగడునా స్వాగతం పలుకుదాం
పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్కు అడుగడుగునా స్వాగతం పలుకుదామని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నా. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పెద్దపల్లిని సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంగా చేసి అగ్రగామిగా నిలిపారు. నియోజకవర్గ దశ, దిశను మార్చిన మంత్రి కేటీఆర్కు ఘనస్వాగతం పలుకుదాం. రూ.150 కోట్ల నిధులతో అభివృద్ధికి అంకురార్పణ చేస్తున్న కేటీఆర్ రుణం తీర్చుకుందాం. ప్రగతి నివేదన సభ ద్వారా కృతజ్ఞతలు తెలుపుదాం.
– దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్యే, పెద్దపల్లి