గోదావరిఖని/ పెద్దపల్లి, ఆగస్టు 23 : ఆదివ్యాంగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ను 3016 నుంచి 4016 పెంచి ఇవ్వడంపై సంబురపడుతున్నారు. అందుకు సంబంధించి బుధవారం ప్రొసీడింగ్స్ అందజేయడంతో ఆనందంలో మునిగిపోయారు. అలాగే బీడీ టేకేదారులకు 2016 పింఛన్ పత్రాలను అందించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.
సరా పథకంతో మానవీయతకు నిలువెత్తు నిదర్శనంగా సీఎం కేసీఆర్ నిలిచారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ సొమ్మును 500 నుంచి ఏకంగా 1,500కు పెంచారు. రెండోసారి అధికారం చేపట్టాక దానిని రెట్టింపు చేసి 3,016 చొప్పున ఇస్తూ వచ్చారు. దానికి అదనంగా వెయ్యి రూపాయలను పెంచి 4,016 చొప్పున ఇవ్వాలని జూన్ 9న మంచిర్యాల సభలో సీఎం ప్రకటించారు. అతికొద్దికాలంలోనే ఇచ్చిన హామీని మెదక్ వేదికగా బుధవారం శ్రీకారం చుట్టారు. అలాగే దేశ చరిత్రలోనే తొలిసారిగా టేకేదారులకు, ప్యాకర్లకు 2,016 చొప్పున పింఛన్ను ఇచ్చే పథకానికీ శ్రీకారం చుట్టగా, ఉమ్మడి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రొసీడింగ్స్ అందజేశారు. ధర్మపురి పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో దివ్యాంగులు పెరిగిన పింఛన్, బీడీ టేకేదారులకు ఆసరా సాయం ప్రొసీడింగ్ కాపీలను మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలోని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అందించారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, గోదావరిఖనిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంథనిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, గంగాధర మండలం మంగపేటలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. దీంతో లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నడు
4016 రూపాయలు ఇత్తనని చెప్పిన కేసీఆర్ సారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నడు. కూలీ పనులు చేసుకుంట జీవించే నాకు పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన. నా భార్య లక్ష్మి ఊర్లో గాజులు అమ్మి వచ్చిన సంపాదనతోనే రోజులు గడిపే వాళ్లం. ఇతర ఆధారం ఏదీ మాకు లేదు. కేసీఆర్ సారు రూ.3016 పెన్షన్ ఇత్తున్నప్పటి నుంచి మంచిగా అనిపిస్తున్నది. కడుపు నిండా అన్నం తింటున్నం. ఎన్నటికైనా కేసీఆర్ సారే మాకు దేవుడు.
– ముద్రకోల వెంకటస్వామి, మల్లాపూర్ (గంగాధర)
తిన్నరేవును మరవను
తిన్న రేవును ఎన్నటికీ మరువద్దు. రూ.4016 పింఛన్ ఇత్తున్న కేసీఆర్ సారును ఎన్నటికీ మరచిపోను. ఇంట్ల జారిపడి రెండు కాళ్లు విరిగినయి. ఒక కన్ను పూర్తిగా కనిపించడం లేదు. పని చేసుడు శాతగాదు. నోట్లోకి నాలుగు వెళ్లు పోవాలంటే పైసలు కా వాలే. కొడుకులే తిండిపెట్టని రోజులివి. అసొంటిది కేసీఆర్ సారే రూ.4016 ఇచ్చుకుంట నాకు పెద్దకొడుకైండు. పెన్షన్ ఇచ్చుకుంట నన్ను కాపాడుతున్న సారును ఎట్ల మరచిపోత. సారుకే జైకొడుత.
– తూడి పోచవ్వ, మల్లాపూర్ (గంగాధర)
కేసీఆర్ సారే మళ్లీ రావాలె..
కేసీఆర్ ఉంటేనే మా దివ్యాంగుల బతుకులు బాగుంటయి. అందుకే మళ్ల కేసీఆర్ సారే రావాలని కోరుకుంటున్న. ఉమ్మడి రాష్ట్రంలో 200 పెన్షన్ వచ్చేది. ఈ పైసలు ఏడికి సరిపొయ్యేవి కావు. కేసీఆర్ సారు వచ్చినంకనే మా వికలాంగుల బతుకుల్లో మారు వచ్చింది. నిన్నటిదాక రూ.3016 పెన్షన్ వచ్చింది. ఎవ్వల ముందు చెయ్యిచాపకుంట తలెత్తుకుని జీవించేలా కేసీఆర్ చేసిండు. ఎన్నటికీ సార్ను మరచిపోం.
– నిమ్మల లింగయ్య, ఆచంపల్లి (గంగాధర)