కలెక్టరేట్, మార్చి 22: ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇక్కడి వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతానికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసేవారు. ప్రతి గ్రామంలో వంద మందిలోపు మాత్రమే పింఛన్లు వచ్చేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అర్హులందరికీ పింఛన్ మంజూరు చేస్తున్నారు. 2014కు ముందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 40 నుంచి 50 వేల మంది మాత్రమే పింఛన్ పొందేవారు. స్వరాష్ట్రంలో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 1,41,956 మంది పింఛన్ పొందుతున్నారు. ప్రతి నెలా 2వ తేదీలోగా వీరందరి బ్యాంక్ ఖాతాల్లో రూ.31 కోట్ల పైచిలుకు జమ అవుతున్నాయి.
జిల్లాల విభజన అనంతరం తగ్గిన జనాభాలో పాత పింఛన్దారుల కంటే అదనంగా మూడింతల మంది ‘ఆసరా’ ద్వారా లబ్ధి పొందుతుండడం గమనార్హం. గతంలో పింఛన్ డబ్బులు తీసుకునేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. వేలి ముద్ర రాకపోయినా, ప్రకటించిన తేదీల్లో గ్రామ పంచాయతీలకు లబ్ధిదారులు వెళ్లకున్నా ఆనెల పింఛన్ హుళక్కే. అయితే, తెలంగాణ ఉద్యమ సమయంలో వీరి బాధలను ప్రత్యక్షంగా గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త విధానాలు అమల్లోకి తెచ్చారు. వారికి అందజేసిన గుర్తింపు కార్డు వెనుకభాగంలో ఉండే బార్ కోడ్ ఆధారంగా పింఛన్ డబ్బులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులు పింఛన్ పొందుతున్నారు.
గత డిసెంబర్ నాటికి జిల్లాలో 57,208 మందికి వృద్ధాప్య పింఛన్ల కింద రూ.11 కోట్ల 53 లక్షల 31 వేలు, 38,225 మంది వితంతువులకు రూ.7 కోట్ల 70 లక్షల 62 వేలు, 23,826 మందికి దివ్యాంగులకు రూ.7 కోట్ల 18 లక్షల 59 వేలు, 2,891 మంది నేత కార్మికులకు రూ.58 లక్షల 28 వేలు, 3,960 మంది గీత కార్మికులకు రూ.79 లక్షల 83 వేలు, 9,592 మంది బీడీ కార్మికులకు రూ. కోటి 93 లక్షల 37 వేలు, 3,488 మంది ఒంటరి మహిళలకు రూ.70 లక్షల 32 వేలు, అలాగే, 2064 ఏఆర్టీ రోగులకు రూ. 41 లక్షల 61 వేలు, 588 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులకు రూ. 11 లక్షల 85 వేలు, 114 మంది డయాలసిస్ బాధితులకు రూ. 2 లక్షల 30 వేలు ఆసరా పథకం కింద వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈమొత్తాన్ని వారి అవసరాల కోసం వినియోగించుకుంటూ, నిశ్చింతగా కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ప్రతి నెల ఇస్తున్న పింఛన్ పైసలు రూ.2,016తోనే నేను, నా భార్య బతుకుతున్నం. నాకు ఇద్దరు కొడుకులుండగా బతుకుదెరువు కోసం వేరే ఊర్లకు పోయి, వారి కుటుంబాలను పోషించుకుంటున్నరు. ప్రతినెల మొదటి వారంలోనే పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతుండగా, తెచ్చుకొని ఇంట్లకు కిరాణ సామనుతో పాటు మందులు, గోలీలు కొనుక్కచ్చుకుంటున్నం. మేము బతికున్నన్ని రోజులు ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్చిపోము.
-సురేందర్, లక్ష్మీనగర్, కరీంనగర్