కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్, (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు జనం నీరాజనం పట్టారు. శనివారం నిర్వహించిన మానకొండూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు అశేషంగా తరలివచ్చారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ సభకు, నియోజకవర్గంలోని మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల నుంచి తండోప తండాలుగా వచ్చి విజయవంతం చేశారు. ఎల్ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణం నుంచి సభా స్థలి వరకు.. ఇటు తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి సభా స్థలి వరకు.. ఎటు చూసినా రెండు కిలోమీటర్ల పొడవునా జనమే కనిపించారు. కేసీఆర్ అనుకున్న సమయానికే అంటే.. మధ్యాహ్నం 1.10 గంటల వరకు చేరుకున్నారు. అధినేత వేదికపైకి రాగానే సభికులు ఈలలు, చప్పట్లతో స్వాగతించారు.
అనంతరం కేసీఆర్ తన ప్రసంగంతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. అర్థమయ్యేలా రీతిలో చెప్పారు. ఇదే వేదికగా తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇల్లంతకుంట మండలంలో తనకు మిత్రులు ఉండేవారని, అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వేళ్లేవాడినని చెప్పారు. ఆనాడు ఇల్లంతకుంట అంతా దుబ్బలే ఉండేవని, గడ్డి కూడా మొలవక పోయేదని, రైతులు పశువులను సాదలేక అమ్ముకునే వాళ్లని, బెజ్జంకి మండలంలోనూ కరువు పరిస్థితులు ఉండేవని, అంజుమన్ అప్పు కట్టకపోతే తలుపు పీక్కోని పోతుండే వాళ్లని గత పరిస్థితులను కండ్లకు కట్టినట్లుగా వివరించారు. ఇప్పుడు ఆ మండలాలు ఎలా ఉన్నాయో..? మానకొండూర్ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందిందో చూడాలని సూచించారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని, ఈ నియోజకవర్గంలో రసమయి బాలకిషన్ గెలుపు ఎంత ముఖ్యమో వివరించారు. అన్ని సర్వేల్లోనూ మానకొండూర్లో రసమయే గెలుస్తారని తేలిందని చెప్పారు. ఇక్కడ ఆయన గెలిస్తే అక్కడ తనకు మద్దతు ఉంటుందనే విషయాన్ని స్పష్టీకరించారు.
బాలకిషన్ను 70వేల నుంచి 80వేల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయగా, సభికులంతా జైకొట్టడంతో రసమయి బాలకిషన్ ఇగ గెలిచినట్టేనని చెప్పారు. మానకొండూర్ నియోజకవర్గంలోని దళితులందరికీ హుజూరాబాద్ తరహాలో ఒకేసారి దళితబంధు అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే ఆటోరిక్షా వాళ్లు ఏడాది కోసారి కట్టే ఫిట్నెస్ చార్జీలను రద్దు చేస్తున్నానని ప్రకటించి శుభవార్త చెప్పారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీని తూర్పార పట్టి ఆలోచింపజేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపూ సభికులంతా ఆసక్తి విన్నారు. ఆయన అడిగిన ప్రతి దానికి సమాధానాలిస్తూ.. కరతాళ ధ్వనులతో మద్దతు తెలుపుతూ జైకొట్టారు. దీంతో శ్రేణులు నూతనోత్సాహంలో మునిగిపోయాయి. అశేషంగా జనం తరలిరావడం, సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రసమయి బాలకిషన్ మరోసారి ఎమ్మెల్యే అవుతారని, అందులో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నాయి.
ఇయాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి డబ్బులు వృథా చేస్తున్నదని, అలాగే 24 గంటల కరెంటు రైతులకు అవసరం లేదని, మూడు గంటలు ఇస్తే మూడు ఎకరాలు పారుతుందని చెబుతున్రు. అది ఎలా సాధ్యమంటే 10 హెచ్పీ పెట్టుకోవాలంటున్రు. అసలు రైతుల వద్ద 10 హెచ్పీ మోటారు ఉంటుందా..? కాంగ్రెసోళ్లు చెప్పినట్లుగా ఒకవేళ 10 హెచ్పీ మోటరు పెడితే.. రాష్ట్రంలో 30 లక్షల పంపుసెట్లు మార్చాల్సి ఉంటుంది. మరీ మోటర్లు ఎవరూ కొనిస్తరు? వాళ్ల మాటలు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయో.. ఆలోచన చేయాలి. ఇది రైతుల జీవన్మరణ సమస్య. ఓటు అంటే మాములు విషయం కాదు. అందుకే చెబుతున్న. ఓటు మన తలరాత రాస్తది. ఐదేండ్ల భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఇక ధరణి రద్దు చేసి భూమాత తెస్తమంటున్రు. అది భూ మాతనా..? లేక భూ మేతనా..? అర్థం కాదు. జాగ్రత్త
– ముఖ్యమంత్రి కేసీఆర్
మేం ఖుల్లం ఖుల్లా జెప్పినం. కరెంటు మూడు గంటలు ఇస్తమన్నం. ధరణి తీసివేస్తమన్నం. అయినా మాకే ఓట్లు గుద్దిన్రు. అందుకే వాటిని తీసివేద్దామని కాంగ్రెసోళ్లు చెప్పే ప్రమాదమున్నది. అప్పుడు ఎవరేం చేస్తరు? మళ్లీ మన బతుకు ఉద్యమమేనా..? ధర్నాలు, స్ట్రైకులు, బాలకిషన్ పాటలేనా..? అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఓటేసే ముందు ఆలోచించాలి. ఆగమై ఓటేస్తే ఆమోదం తెలిపినట్టే అవుతుంది.
– ముఖ్యమంత్రి కేసీఆర్
ఓట్లు అనగానే ఆగమాగం కావద్దు. ఎవరో చెప్పిన మాటలు వినద్దు. కేసీఆర్ ఈ మాట చెప్పి పోయిండు. ఇది నిజమా..? అబద్ధమా..? అని మీరంతా స్థిరంగా కూర్చొని ఆలోచించాలి. దయచేసి బీఆర్ఎస్ నాయకులను నేను కోరుతున్న. నా ఉపన్యాసమే కాపీ గొట్టి.. అవసరమైతే రికార్డు చేసుకొని మీరు మీ ఊళ్లలో చెప్పాలి. రసమయి బాలకిషన్ఎమ్మెల్యే కాక ముందు మానకొండూర్ నియోజకవర్గం ఎట్లుండేదని ప్రజలను అడగండి. బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల పరిస్థితి ఏంటని? ఇప్పుడెట్లున్నది? ఇంకా ముందుకెళ్దామా..? మళ్లీ వెనక్కి వెళ్దమా..? అన్న దానిపై చర్చ పెట్టండి. ఆలోచన చేయండి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
కాంగ్రెసోళ్లు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇందిరమ్మ రాజ్యంల ఏం జరిగిందో మనకు తెల్వదా.. తిన్నోడు తిన్నడు.. తిననోనికి అన్నమే దొరకలే. ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టవల్సి వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే రెండు రూపాయలకు కిలో బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది. గా బియ్యం ఇచ్చినంకనే కదా పేదోళ్లకు కడుపు నిండింది. అప్పటిదాక సగం తిని సగం కడుపుతోని పండుకునెటోళ్లు చాన మందే ఉండేది. ఇందిరమ్మ రాజ్యం సక్కదనం ఉండే మనోళ్లంతా బొంబై, భీమండి ఎందుకు బతకవోయిన్రు. ఎక్కడెక్కడికో పోయి కూలీ నాలి చేసుకునే గతెందుకు పట్టింది? ఇందిరమ్మ రాజ్యమంటే అందర్ని పట్టుకపోయి జైల్లేసుడు. ప్రభుత్వాలు కూల గొట్టుడు. గదేనా ఇందిరమ్మ రాజ్యమంటే? ఇప్పుడు మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నరు. ఎవలను గోల్మాల్ చెయ్యడానికి.
– ముఖ్యమంత్రి కేసీఆర్