గోదావరిఖని/ యైటింక్లయిన్ కాలనీ,సెప్టెంబర్ 26: సింగరేణి కార్మికులకు ముందస్తు దసరా కానుకగా సీఎం కేసీఆర్ లాభాల వాటా ఇవ్వాలని నిర్ణయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాలపై 32 శాతం వాటా ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 2022-23లో సంస్థ 2222కోట్ల రికార్డుస్థాయిలో లాభాలను ఆర్జించింది. అందులో 700 కోట్లను కార్మికులకు దసరా ముందుగా చెల్లిస్తామని సీఎం రెండు నెలల క్రితం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా చెప్పారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి గతంలోని 30 శాతానికి మించి కార్మికులకు 700 కోట్లకు పైగా లాభాల వాటా వచ్చేలా 32శాతం వాటాను 711కోట్లను ప్రకటించారు. ఇటీవలనే కార్మికులకు 11వ వేతన ఒప్పందానికి సంబంధించి 23 నెలల బకాయిలు దాదాపు 1450 కోట్లను చెల్లించారు. అక్టోబర్ 23న దసరా ఉండడంతో ముందుగానే లాభాల్లో వాటాను చెల్లించే విధంగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్నడూలేనివిధంగా లాభాల వాట రావడంతో కార్మికలోకం ఆనందంలో మునిగితేలింది.
బొగ్గు కార్మికులపై కేసీఆర్కు అమిత ప్రేమ
యైటింక్లయిన్ కాలనీ సెప్టెంబర్ 26 : సింగరేణి బొగ్గు కార్మికులపై కేసీఆర్కు వున్న అమిత ప్రేమను మరోసారి చాటుకున్నారని సింగరేణి గుర్తింపు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. 2022-23 వార్షిక సంవత్సరంలో ఆర్జించిన 2222 కోట్ల లాభాల నుంచి కార్మికులకు 32శాతం వాటా 711కోట్లను కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్జీ-2 ఏరియాలోని యూనియన్ కార్యాలయం ఎదుట కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కార్మికులకు 32శాతం లాభాల వాటా ప్రకటించి కార్మిక పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. కార్మికుల త్యాగాలను గుర్తించి గతంలో కంటే 2శాతాన్ని పెంచి అంటే 32శాతం లాభాల వాటాను ప్రకటించడం హర్షనీయమన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ బొగ్గు కార్మికులకు ఏలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నారని, అనేక హక్కులు అమలు చేస్తూ గుండెల్లో పెట్టుకున్నాడని కొనియాడారు. అలాంటి సీఎం కేసీఆర్కు ఎప్పడూ రుణపడి ఉంటారన్నారు.
లాభాల్లో 32శాతం వాటాకు కృషి చేసిన గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు అయిలీ శ్రీనివాస్, నాయకులు కొత్త సత్యనారాయణరెడ్డి, ప్రభాకర్రెడ్డి, కొంగర రవీందర్, ముస్కుల అనిల్రెడ్డి, మల్లికార్జున్, బేతి చంద్రయ్య, సతీష్, సంతోష్, శ్రీనివాస్, కుమార్, బిర్కి రమేశ్, రాజ్ కుమార్, కిరణ్, రమేశ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
– టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి
రుణపడి ఉంటం
32శాతం వాటా ప్రకటించడంతో కష్టానికి తగ్గ ఫలితం లభించింది. గతేడాది కంటే ఈ సారి 2శాతం అదనంగా పెంచి 32శాతం వాటా ప్రకటించడం హర్షనీయం. గతంలో ఏ ప్రభుత్వం కార్మికుల శ్రమను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కార్మికులను అక్కున చేర్చుకున్నారు. మేమం తా కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటం.
-ఎం అనిల్ రెడ్డి, పంప్ ఆపరేటర్
అడుగకుండానే వాటా
గత ప్రభుత్వాలు పోరాడితే తప్పితే లాభాలా వాటా ఇచ్చేవారు కాదు. అలాంటిది స్వరాష్ట్రంలో రాష్ట్ర సీఎం కేసీఆర్ అడుగకుండానే 32శాతం వాటా ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కార్మికులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకుంటున్నారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుతూ, సింగరేణిని కాపాడుతున్నారు.
-రుద్రవరం కిరణ్ కుమార్, జనరల్ మజ్దూర్
కేసీఆర్తోనే లాభాల వాటా
సీఎం కేసీఆర్తోనే కార్మికులకు 32శాతం వాటా సాధ్యమైంది. గడిచిన పదేళ్లుగా 16శాతం ఉన్న లాభాల వాటాను 32శాతానికి పెంచి ఇవ్వడం కేసీఆర్కు కార్మికులపై ఉన్న ప్రేమను తెలుపుతున్నది. ఉద్యమ సమయంలో కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన మాటను ఒక్కొక్కటి నెరవేరుస్తూ సంస్థ పురోభివృద్దికి ఎంతో కృషి చేస్తున్నారు. గత పాలకులు సింగరేణి సంస్థను మూసివేసేందుకు కుట్ర పన్ని వారసత్వ ఉద్యోగాలు రద్దు చేశారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారు.
-ఉడుగుల రవీందర్, టర్నర్