‘మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలు మినీ భారతదేశం.. అన్ని రాష్ర్టాలతో పాటు, మన రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలు ప్రతీ సంవత్సరం విస్తరిస్తుంటాయి. ఇందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక బడ్జెట్ను రూపొందిస్తాం’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ను ఆనుకుని ఉన్న మేడ్చల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పేదలకు లక్షల రూపాయలు విలువజేసే డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి పూర్తి ఉచితంగా అందజేస్తున్నామన్నారు. రూ.40 -50 లక్షలు విలువ జేసే ఇండ్లను ఒక్క రూపాయి తీసుకోకుండా అందజేశామని, ఈ కీర్తి ఒక్క తెలంగాణ రాష్ర్టానికే దక్కిందని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలోనే 26వేల ఇండ్లను నిర్మించి ఇచ్చామన్నారు. నగరంలో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టిస్తామన్నారు. ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలో రూ.350 కోట్లతో మంచినీటి వసతిని కల్పించామన్నారు. మంత్రి మల్లారెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. మేడ్చల్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.