క్రిస్మస్ వేడుకలను ఆదివారం క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. ఇందులో భాగంగా మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని చర్చిల్లో పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్లు కట్ చేసి, స్వీట్లు తినిపించుకున్నారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
-మానకొండూర్/ రూరల్/ శంకరపట్నం/ తిమ్మాపూర్రూరల్/ చిగురుమామిడి, డిసెంబర్ 25
మానకొండూర్ మండల కేంద్రంలోని క్రైస్ట్ చర్చిలో ఉదయం నుంచే ప్రార్థనలు ప్రారంభం కాగా, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు వొల్లాల ప్రసాద్, జయపాల్ మెర్రీ క్రిస్మస్ కేక్ కట్చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీస్తు బోధనలు చదివి వినిపించారు.
మానకొండూర్ మండలం పోచంపల్లి, కొండపల్కల, కొండపల్కల, వెల్ది, పచ్చునూర్, చెంజర్ల, ఊటూర్, పలు గ్రామాల్లోని చర్చిల్లో ఆదివారం ఆయా గ్రామాల పాస్టర్ల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పోచంపల్లిలో సర్పంచ్ పాస్టర్ వుండాటి అంజయ్య, గంగిపల్లిలో పాస్టర్ ఆదినారాయణ, కొండపల్కలలో పాస్టర్ జయరాజ్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. చర్చిల్లో మహిళలు, యువతులు, చిన్నారులు ప్రత్యేక గీతాలు ఆలపించారు. అనంతరం చర్చిల ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల్లోని క్రైస్తవులు పాల్గొన్నారు.
శంకరపట్నం మండలం కన్నాపూర్, కాచాపూర్, కేశవపట్నం, ఆముదాలపల్లి, ముత్తారం, ధర్మారం, తాడికల్ తదితర గ్రామాల్లోని చర్చిలను క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. మత పెద్దలు ఏసు ప్రభువు శాంతి సందేశాన్ని, సువార్తను వినిపించారు. పలు గ్రామాల్లో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో పాస్టర్లు, రాజకీయ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పిల్లలు, పెద్దలంతా కలిసి సంబురాలు జరుపుకొన్నారు. చర్చిల్లో సాయంత్రం పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. కేకులు కోసి, ఆటపాటలతో ఆనందంగా గడిపారు. నుస్తులాపూర్లో సర్పంచ్ రావుల రమేశ్ క్రిస్మస్ సంబురాలకు హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మక్తపల్లి గ్రామంలోని చర్చిలో బత్తుల అంకూస్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. కార్యక్రమాల్లో పాస్టర్లు, చర్చి సభ్యులు పాల్గొన్నారు.
చిగురుమామిడి మండలంలోని వివిధ గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. రేకొండలో జరిగిన వేడుకలకు జడ్పీటీసీ గీకురు రవీందర్ హాజరై మాట్లాడారు. ఏసు బోధనలు సమాజానికి ఆదర్శనీయమన్నారు. వేడుకల్లో సర్పంచ్ పిట్టల రజిత, సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పన్యాల శ్యాంసుందర్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్, పాస్టర్లు ప్రభుదాస్, నిరీక్షణ, రాజు, రాకం అనిల్, రాకం అంజవ్వ, రొడ్డ రవీందర్, బీస కనకయ్య, శ్యామ్, విక్టోరియా, డానియల్, చందు, నెల్సన్, పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.