మల్యాల, నవంబర్ 2 : రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. ఈ సందర్భంగా మల్యాల మార్కెట్ కేంద్రంతోపాటు లంబాడిపల్లి, తక్కళ్లపల్లి, మ్యాడంపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారన్నారు. సాగునీరు ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తూ, పంటలకు మద్దతు కల్పిస్తూ రైతులకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం రైతులకు ఇన్ని చేస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేకిగా పనిచేస్తున్నదన్నారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని, అధికార యంత్రాంగం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొరండ్ల నరేందర్ రెడ్డి, సర్పంచులు మిట్టపల్లి సుదర్శన్, కరుణాకర్ రెడ్డి, గొడుగు కుమారస్వామి, రౌతు గంగామహేశ్వరి సహకార సంఘాల అధ్యక్షుడు మధూకర్రెడ్డి, ఎంపీటీసీ కట్కూరి నవత, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్రెడ్డి, టీ(బీ)ఆర్ఎస్ పార్టీ నాయకులు జనగం శ్రీనివాస్, సహకార సంఘ సీఈవోలు మనోజ్, మిట్టపల్లి గోవర్దన్, ఐకేపీ ఏపీఎం చిన్న రాజయ్య, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.