కరీంనగర్ రూరల్: ఏప్రిల్ 13: వైద్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆధునాతన చికిత్స పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని వైద్యులకు త్రిదండి చిన్నజీయర్స్వామి సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లోని చల్మెడ అనందరావు వైద్య విజ్ఞాన సంస్థలో శనివారం స్కిల్ అండ్ మెడికల్ సిములేషన్ సెంటర్తోపాటు చిల్డ్రన్స్ కేర్, నియోనాటల్, గైనకాలజీ తదితర ల్యాబ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల తీరును జీయర్ స్వామికి వైద్యులు వివరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యవిద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. చల్మెడ ఆనందరావు వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన బోధన అందించడం అభినందనీయమన్నారు. సమాజంలో మంచి వైద్యులుగా స్థిరపడాలంటే, వైద్య విద్యపై సంపూర్ణ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. నాణ్యమైన సేవలందించడం ద్వారానే పేషెంట్ల మన్ననలు లభిస్తాయన్నారు. కరోనా సమయంలో చల్మెడ దవాఖానలో అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లి భవిష్యత్లోనూ మెరుగైన వైద్యసేవలందించాలని అభిలషించారు.
చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ చల్మెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ, స్కిల్ అండ్ మెడికల్ సిమ్యులేషన్ సెంటర్లు బెంగళూర్, పూణే లాంటి నగరాల్లో మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు మన రాష్ట్రంలో తొలిసారిగా చల్మెడ ఆనందరావు వైద్యశాలలో ప్రారంభించుకున్నామని తెలిపారు. గతంలో కేన్సర్ వైద్యశాలను, ఇప్పుడు స్కిల్ అండ్ మెడికల్ సిములేషన్ సెంటర్ను చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఆనందంగా ఉన్నదన్నారు.
మూడోసారి ఆయన వైద్యశాలకు రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. స్వామివారి ఆశీస్సులతో వైద్య రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన వైద్యమందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ డాక్టర్ వీ సూర్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ అసీమ్ అలీ, వైస్ ప్రిన్సిపాల్ టీ అనిత, వైద్యకళాశాల ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.