ఏ కాలమైనా పుష్కలంగా కాళేశ్వర జలాలు..
ఉచితంగా 24గంటల నాణ్యమైన విద్యుత్..
సకాలంలో విత్తనాలు, ఎరువులు..
అదనుకు ముందే పెట్టుబడికి రైతుబంధు..
పంట ఉత్పత్తుల విక్రయం కోసం కొనుగోలు కేంద్రాలు..
సీజన్లో సాగుపై చర్చల కోసం రైతు వేదికలు..
కుటుంబానికి ధీమానిచ్చే రైతుబీమా..
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే పరిహారం..
‘ఇంతకంటే ఏం గావాలె’ ఒక రైతు మాట! అందుకే రైతాంగం ‘కేసీఆరే మా ధైర్యం’ అని చెబుతున్నది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతును గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని రైతుబాంధవుడు చెప్పడంపై హర్షం వ్యక్తం చేస్తున్నది. గురువారం సీఎం కేసీఆర్ వడగండ్లతో దెబ్బతిన్న పంటలు పరిశీలించి, దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఎకరాకు 10వేల పరిహారం ప్రకటించడంపై సంబురపడుతున్నది. ‘మీ వెంట నేనున్నా’ అంటూ భుజం తట్టడంపై భరోసా పొందుతూనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నది. సీఎం చెప్పినట్టే వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, బంగారు పంటలు పండిస్తామని ధీమాగా చెబుతున్నది. కొండంత అండగా కేసీఆర్ ఉన్నాడని, తమకు ఎలాంటి ఇబ్బందులు రావనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నది.
కరీంనగర్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ రైతన్నకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఆయన, అనేక పథకాలతో రైతుబాంధవుడిలా మారారు. తాజాగా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసానిచ్చారు. గురువారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీనంగర్ జిల్లాల్లో పర్యటించిన ఆయన, కొండంత ధైర్యాన్నిచ్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎకరానికి 10 వేల పరిహారం ఇస్తానని ప్రకటించడంపై రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నుంచే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. శుక్రవారం రామడుగు మండలంతోపాటు ఓదెలలో పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’తో పలువురు రైతులు ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్న సందర్భాలు లేవని స్పష్టం చేస్తున్నారు. నాడు అసాధారణ రీతిలో పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వ అధికారులతో కూడిన బృందాలు సర్వేకు వచ్చి చేతులు దులుపుకోవడమే తప్ప ఇలా స్వయంగా రాష్ర్టాధినేత వచ్చి వెనువెంటనే పరిహారం ప్రకటించడం చూడలేదని స్పష్టం చేస్తున్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్, గుండి గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు తమలో ధైర్యాన్ని నింపాయని చెబుతున్నారు. రామడుగు రైతు వేదికగా పరిహారం ఇస్తానని చెప్పడమే కాదు, ఉత్తర్వులు చూపించడంపై పూర్తి విశ్వాసం ప్రకటిస్తున్నారు. ఉజ్వలమైన స్థితికి చేరుకున్న వ్యవసాయాన్ని వెనక్కి పోనిచ్చే ప్రసక్తి లేదని, ఎంత కష్టమైనా రైతులకు అండగా నిలిచి ఆదుకుంటామని సీఎం చెప్పిన మాటలు మరింత ఆత్మైస్థెర్యాన్ని పెంచాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వడగండ్ల ముప్పుపై ఆయన సూచించినట్టే మరింత జాగ్రత్తగా ఉంటామని చెబుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంట్, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇన్ని అందిస్తుండగా వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, బంగారు పంటలతో రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలుపుతామని స్పష్టం చేస్తున్నారు. కొండంత అండగా కేసీఆర్ ఉండగా తమకు ఎలాంటి ఇబ్బందులూ రావనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.
నాకు ఆరెకరాల పొలం ఉన్నది. పదిగేనేండ్ల కింద పరిస్థితి ఘోరంగా ఉండె. అప్పుడు వరి సాగు జేత్తే నీళ్లులేక పంటెండి వంద బస్తాలు కూడా రాలె. పెట్టుబడి ఎల్లక అప్పులు జేసినం. పిచ్చిమొక్కలు మొలిచి నీళ్లులేని చెరువులు ఎక్కిరిత్తుంటే యెవసమంటనే రోత పుట్టింది. ఎరువుల కోసం మబ్బుల పోయి లైను కట్టినం. కరెంటు అత్తదో రాదో తెలియదాయె. చేసుకుందామంటే చేతినిండా పనిలేకుండె. అప్పులు కట్టే దారిలేకుండె. సోపతాయిన చెప్పినట్లు దుబాయి పోయిన. అక్కడ పని అంతంతే ఉండె. భార్యాపిల్లలను ఇడిచిపెట్టి పోతే ఆరోగ్యం బాగ లేక వచ్చిన. జీతం పైసలు రోగానికే పెట్టిన. తెలంగాణ వచ్చినంక కొన్ని రోజులుందామని మా ఊరి కిష్టంపేటకు అచ్చిన. పంట పెట్టుబడి కోసం రైతుబంధు కింద అప్పుడు సీజన్కు ఎకరాన రూ.నాలుగు వేలు ఇచ్చిండు. మిషన్ కాకతీయ కింద చెరువుల్ల పూడిక తీయిస్తుంటె పండుగలా అనిపించింది. చెర్లలో నీళ్లు చూస్తే సంబురమనిపించింది. ఇక్కడే ఉండి మనం పొలం చేసుకుందామని నా భార్యా పిల్లలు పట్టుబట్టిన్రు. సర్కారు కొత్త సంబరం గిట్లనే ఉంటదని జెప్పి చూసిన. ఎవ్వరు వినలె. సరేనని ఆరెకరాల్లో వరేసిన. పంట మంచిగొచ్చింది. అప్పులు తీరినయ్. దుబాయికన్నా ఇక్కడే మంచిగున్నది. కరెంటు పోతదన్న ముచ్చటే లేదు. ఎరువుల గోస లేదు. గోదావరి నీళ్లొచ్చినయ్. కేసీఆర్ సార్ ఉన్నన్ని రోజులు రైతులకు రందిలేదు. ఎప్పుటూ సారే సీఎంగా ఉండాలని మా ఇంట్లోల్లందరం దేవుడిని మొక్కుతున్నం.
– బాణాల లక్ష్మారెడ్డి, రైతు, కిష్టంపేట (చందుర్తి మండలం)
నా పేరిట, నా భార్య పేరిట మెత్తం ఏడెకరాల భూమి ఉన్నది. అందులో మామిడి తోట పెట్టినం. దానిపైనే ఆధారపడి బతుకుతున్నం. ఈ యేడు వడగండ్ల వాన పడి మాకు కడగండ్లు మిగిల్చినయ్. కానీ, సీఎం కేసీఆర్ మాకు కొండంత ధైర్నమిచ్చిండు. దెబ్బతిన్న పంటలను గురువారం పరిశీలించి ఆదుకుంటా అని చెప్పిండు. ఎకరానికి పది వేల పరిహారం ఇస్తా అన్నడు. మొన్ననే మా గ్రామానికి సార్లు వచ్చి నష్టం వివరాలు రాసుకుపోయిన్రు. మాకు కూడా పరిహారం వస్తది. ఇంత ఆపదల ఇట్ల వెంటనే ఆదుకునుడు ఒక్క కేసీఆర్కే సాధ్యమైంది. ఎకరానికి 10 వేలు ఇచ్చుడు మామూలు విషయం కాదు. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది. ఒక రైతుగా నేను మాత్రం కేసీఆర్కే అండగా ఉంట.
– గుర్రం చంద్రశేఖర్ గౌడ్, గొర్రెగుండం (మల్యాల మండలం)
నాకు నాలుగెకురాలల్ల వరి ఉన్నది. ఇంకో రెండెకురాలు కౌలుకు తీసుకొని సాగు జేస్తున్న. వడగండ్ల వాన పాడుగాను మామీద బండ వడ్డైట్టెంది. ఈయేడు నష్టం జరిగింది. నష్టపోయిన పంటలను కేసీఆర్ సార్ జూసిండు. ఆయిన రైతే గాబట్టి ఆయినకు తెలుసు ఎట్ల నష్టమైతది? ఎంత నష్టమైతది? అని. సీఎం సార్ను ఎవ్వళ్లు అడుగుడు అక్కెరే లేదు. ఎకురానికి పది వేలు ఇస్తా అని జెప్పిండు. నిజంగా అది మాకెంతో మేలు. నాకు ఆరువై వేలదాకా అత్తయ్. కానీ, బాగనే నష్టమైంది. అదెవ్వలన్న కావాలని జేసిందా..? కాదుగదా! నాడు ఆమాత్రం సాయం చేసేటోళ్లు లేకుండె. కానీ, కేసీఆర్ సార్ మాత్రం జేస్తండు.
-పోలం పోచయ్య, రైతు (సుల్తానాబాద్)
నేను రెండెకరాల్లో వరి సాగు చేస్తున్న. వారం క్రితం కురిసిన అకాల వర్షాలు పంటలను బాగా దెబ్బతీసినయ్. బాగా నష్టం వచ్చింది. అయ్యో కాలం గిట్లజేసె అనుకున్న. వడగండ్ల వాన పంటలను నాశినం జేసిపాయె అని బాధ పడుతున్నం. నా లెక్కనే ఎంతో మంది రైతులు బాధవడినట్టున్రు. ఎట్లనో ఏమో అనుకున్న. కానీ, సీఎం సార్ అచ్చి మాకు ధైర్నమిచ్చిండు. ఎకరానికి పదివేలు ఇత్తనని చెప్పిండు. నిజంగా కేసీఆర్ సారు రైతులకు గొప్ప భరోసా. ఆయన అట్లున్నడు కావట్టె రైతు ఇట్ల పచ్చగున్నడు. చానా సంతోషంగా ఉన్నది.
-జాన కొమురయ్య, రైతు, గర్రెపల్లి (సుల్తానాబాద్ మండలం)
నేను నాలుగెకరాలల్ల వరి ఏసిన. వడగండ్ల వానలు మామూలుగా నష్టం జేయలె. మమ్ముల పూర్తిగా ముంచిపోయింది. పంటలు అక్కెరకు రాకుంటైనయ్. మంచి లాభాలస్తయని అనుకున్నం. ఫస్ట్ నుంచి మమ్ముల ఆదుకున్నది సీఎం సారే. ఇప్పుడు గూడా ఆదుకున్నది ఆయనే. రైతుకు ఏ ఇబ్బంది లేకుంట జూసుకునే సీఎం మనకు దొరుకుడు మన అదృష్టం. నాడు అట్టిగ జూసుడు.. ఫొటోలు దిగేటోళ్లే గానీ ఎవ్వరూ సాయం జేయలె. మాటలు జెప్పి చేతలు జేసేటోడే సీఎం కేసీఆర్. ఈంత ఇచ్చేటోడే లేడు. ఇట్ల సాయం జేస్తున్న సీఎం సారుకు నా కృతజ్ఞతలు.
-సుంకరి పోచయ్య, రైతు, గర్రెపల్లి (సుల్తానాబాద్ మండలం)
మాది రామడుగు. నేను ప్రతి సంవత్సరం మామిడి తోటలు కౌలుకు పట్టుకుంట. ఈసారి దత్తోజిపేటకు చెందిన గంట్ల జితేందర్రెడ్డి రైతు నుంచి కౌలుకు తీసుకున్న. కాయలు చేతికి వస్తున్నయనుకున్న సమయంల రాళ్లుపడి తోటంతా దెబ్బతిన్నది. ఇప్పుడు లక్ష సుతం వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ సార్ మా మండలం వచ్చి పంటలు దెబ్బతిన్న రైతులను కలిసి పోయిండు. కౌలు రైతులు దిగులు పడొద్దని చెప్పిండు. వాళ్లను కూడా ఆదుకుంటమన్నడు. చాలా సంతోషం. నా తోటకు కూడా నష్ట పరిహారం వస్తది. గతంల చాలా సార్లు ఇట్లనే రాళ్లువడి తోటలు దెబ్బతిన్నపుడు నాలుగు వేలకంటే మించి ఇవ్వకపోదురు. అదిగూడా ఏండ్లకేండ్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేటిది. ఇప్పుడు కేసీఆర్ సార్ ఎకరానికి పది వేలు ఇస్తమన్నడు. అదిగూడా వచ్చే నెల 15లోగా ఇస్తమన్నడు. నాకు చాలా సంతోషం వేసింది. కేసీఆర్ సార్ ఏదన్నా అంటే తప్పక చేస్తడు. మా కౌలుదారులకు న్యాయం జరుగుతదనే నమ్మకం కలిగింది.
– పెసరి రాజమౌళి, మామిడి కౌలుదారు (రామడుగు)
నాడు కాలం కాక ఏసిన పంటకు నీళ్లులేక ఎండి పోతుండే. పంట పెట్టుబెడి ఎల్లక అప్పుల పాలయినం. తీసుకున్న ఎరువులకు పైసలు కట్టేందుకు చిల్లిగవ్వలేక మిత్తీలు తెచ్చికట్టినం. తీసుకున్న అప్పులు కట్టమంటూ అంజిమానోళ్లు ఇండ్ల తలుపులు ఎత్తుకెళ్లిన్రు. పెండ్లాంమీది తాళి కుదవబెట్టి లోన్లు కట్టుకున్న రోజులు యాజ్జేసుకుంటే కళ్లపొంట నీళ్లత్తయ్. చెంబెడు నీళ్లు తాగి రోజులు ఎల్లదీసినం. అవ్వో నాడున్న రోజులకు తల్సుకుంటెనే మనసంత ఆగమైతది. సీఎం కేసీఆర్ సారును ఆ దేవుడే పంపించిండో ఏమో ఇయ్యాళ పంటలను జూత్తనే కడుపు నిండుతంది. కాలం మంచిగైంది. ఎక్కడో ఉన్న గోదారిని ఇక్కడికి తెచ్చిండు. చెరువులు నింపి కాలువలు పారిత్తుండు. 24 గంటల కరెంటిత్తండు. బ్యాంకుల్ల తీసుకున్న రుణాలు మాఫీ చేసిండు. పంటపెట్టుబడి ఎకరాన రైతుబంధు పది వేలిత్తండు. ఇంకేం గావాలె. చాలా సంతోషంగా ఉంది. మొన్న పాడు వానలు కొట్టి చానా మంది పంటలు నష్టపోయిన్రు. వాళ్లను కూడా కేసీఆర్ సారు ఆదుకుంటానని చెప్పిండు. ఎకరాన రూ.పది వేలు ఇత్తనని అన్నడు. సార్ కడుపులో ఏ దేవుడున్నడో గానీ మాలాంటి పేద రైతులకు అంతా మంచిగనే సేత్తుండు. నాకున్న మూడెకరాల్లో వరేసినా. రందేలేదు. పంట బాగొత్తంది.
– ఎడ్ల నర్సయ్య, రైతు (ముస్తాబాద్ మండలం)
వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలువడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రామడుగు మండలం గోపాల్రావుపేటతోపాటు ఓదెలలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చి ఆదుకుంటున్న రైతుబాంధవుడికి జీవితాంతం రుణపడి ఉంటామన చెబుతున్నారు.
సార్ వచ్చి దెబ్బతిన్న నా వరి చేను చూసిండు. బాధపడకు నేనున్న.. ప్రభుత్వమున్నది అని ధైర్నం చెప్పిండు. నాకు ఎంతో మంచిగ అనిపించింది. కేసీఆర్ వచ్చిండంటెనే పరిహారం వస్తదని నమ్మకమచ్చింది. తెలంగాణల కేసీఆర్ సార్ వచ్చినంకనే మా భూములల్ల ఇంత పంటలు పండుతున్నయ్. ఈ ఒక్కసారి లాసైనా మళ్లో ఏడాదిల పంటలు ఏసుకుంటమన్న నమ్మకమున్నది. రాళ్లు వడుడు పంటలు దెబ్బతినుడు అప్పట్ల ఏడాదికోసారి జరిగేటిది. నాలుగైదేండ్ల సంది కొంత తగ్గింది. మళ్ల ఇప్పుడు రాళ్లు వడ్డయ్. పొట్టకచ్చిన వరి మొత్తం దెబ్బతిన్నది. సార్ అచ్చి ధైర్నం చెప్పినంక నా మనుసు కుదుట పడ్డది. సార్ నా చేండ్లకచ్చి పోయిండు. నాకంతే సాలు. ఈసారి పంట దెబ్బతిన్నా అచ్చే ఏడు ఏసుకుంట. కేసీఆర్ అన్ని సౌలతులు చేసిపెట్టింటుగద. 24 గంటల కరెంట్ రావట్టె, పెట్టువడికి పైసలియ్యవట్టె, కాలువలల్ల నీళ్లు సుతం ఇయ్యవట్టె. తెలంగాణ రాక ముందు మా భూములు ఎట్టుండె. ఇప్పుడెట్టున్నయ్. ఇదంతా కేసీఆర్ సార్తోనే కదా.. ఇంకేం గావాలె.
– బండారి శంకర్ గౌడ్, వరి రైతు, గుండి (రామడుగు)
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో రైతులు ఎంతో ధైర్యంగా కనిపించారు. వడగండ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు లక్ష్మీపూర్కు వచ్చిన ముఖ్యమంత్రిని అడిగి మరీ చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు.