పొగచూరిన బతుకుల్లో వెలుగులు నింపుతున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)పై కేంద్రం కత్తిగట్టింది. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్యమే లక్ష్యంగా కొన్నేళ్లుగా అమలవుతున్న పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నది. మొన్నటిదాకా ఏడాదికి 12 సిలిండర్లను రాయితీపై అందజేయగా, ఆ తర్వాత కాలంలో వాటి సంఖ్యను తొమ్మిదికి కుదించింది. తాజాగా ఏడాదికి నాలుగు సిలిండర్లకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, లబ్ధిదారుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. సంవత్సరానికి నాలుగు ఎలా సరిపోతాయంటూ ప్రశ్నిస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 25: పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీపై అందజేసే వంట గ్యాస్ సిలిండర్లలో కేంద్రం కోతపెట్టింది. పథకంలో కీలక మార్పులు చేసింది. 2016లో స్కీం ప్రారంభించినప్పుడు ఏడాదికి 12 సిలిండర్లు అందించేది. అనంతరం ఈ సంఖ్యను తొమ్మిదికి కుదించింది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి నాలుగు సిలిండర్లను మాత్రమే అందిస్తామని ఉత్తర్వులు జారీచేయడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు ప్రకటనలు, హామీలకు విరుద్ధంగా తరచూ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గిస్తుండడం సరైన విధానమేనా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం పేర సిలిండర్ల సరఫరాలో కోత విధిస్తూ తమను ఏడిపిస్తున్నదని, ఏడాదికి నాలుగు ఎలా సరిపోతాయంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఉజ్వల సిలిండర్ల సరఫరా తగ్గడంతో పేద కుటుంబాలు మళ్లీ కట్టెల పొయ్యిలపై ఆధారపడే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలో 33,369 మంది ఉన్నారు. తాజా నిర్ణయం అమలుతో వీరందరిపై ప్రత్యక్ష ప్రభావం పడనుండగా లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు అవసరమైతే చేసే సాయం పెంచాలే గానీ, ఇలా తగ్గించడం ఏంటని మండిపడ్డారు. పేద కుటుంబాల అవసరాల దృష్ట్యా గతంలో మాదిరిగానే పూర్తిస్థాయిలో సబ్సిడీ సిలిండర్లు కొనసాగించాలని కోరుతున్నారు.