ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతి కార్యకర్తకూ చేరువవుతున్న గులాబీ జెండా, మరోసారి ప్రతి గుండెనూ తట్టబోతున్నది. ఈ నెల 27న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకొని.. రెండు రోజుల ముందే బీఆర్ఎస్ పండుగకు సిద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 25వ తేదీనే పల్లె, పట్నం అన్న తేడా లేకుండా జెండా ఎగురవేసేందుకు అంతా రెడీ అయింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయాన్నే జెండా కార్యక్రమాలు నిర్వహించి, ఆ తర్వాత ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మూడువేల మంది శ్రేణులతో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పండుగ ద్వారా శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతోపాటు సబ్బండవర్గాలకు చేరువకానున్నారు.
– కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణప్రతినిధి)
కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణప్రతినిధి) : స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆనాడు ఉద్యమనేతగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భానికి నాంది పలికారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం సబ్బండవర్గాలను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా, గమ్యాన్ని ముద్దాడే వరకు కేసీఆర్ కొట్లాడారు. చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్ పాత్ర వెలకట్టలేనిది. నాటి స్వరాష్ట్ర సాధన ఉద్యమం నుంచి నేటి వరకు అండగా నిలుస్తున్నది కరీంనగర్ గడ్డ. అంతేకాదు, పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ఆనాడు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కేసీఆర్, ఈ గడ్డపై నుంచి శ్రీకారం చుట్టిని విషయం కూడా తెలిసిందే. సింహగర్జన సభ నుంచి సకల జనుల సమ్మె వరకు.. చివరకు ఆమరణ నిరాహార దీక్ష వంటి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు వేదికగా నిలిచింది మన ఉమ్మడి జిల్లానే.
ఈనెల 25నే పండుగ
ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. పార్టీ ఆవిర్భావానికి రెండు రోజుల ముందుగానే అంటే ఈ నెల 25న జెండా పండుగ నిర్వహించాలని, ప్రతి పల్లె, పట్టణంలోని ప్రతి వార్డు, డివిజన్లోనూ గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా అవసరమైన చోట జెండా గద్దెలను నిర్మించాలని సూచించారు. ఆరోజు ఉదయమే అన్ని గ్రామాల్లో ముందుగా జెండాలు ఎగురవేయాలని, ఆ తదుపరి నియోజకవర్గ స్థాయి సమావేశాలకు హాజరుకావాలని పార్టీ శ్రేణులకు నిర్దేశం చేశారు. వీటిని సమన్వయం చేయాల్సిన బాధ్యతలను జిల్లా అధ్యక్షులకు అప్పగించారు.
ప్రతి గుండెనూ తట్టేలా..
ఇప్పటికే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నది. ప్రతి పది గ్రామాలకు ఒకటి చొప్పున నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాల పరిశీలనకు నియోజకవర్గానికో పరిశీలకుడిని నియమించిన విషయం తెలిసిందే. వారి ద్వారా ఆయా ఆత్మీయ సమ్మేళనాల్లో జరుగుతున్న చర్చలు, కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు, అభివృద్ధిపై చర్చ జరుగుతున్న తీరు, హాజరవుతున్న నాయకులు, ప్రధాన నాయకుల తీరుతెన్నుల వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అధిష్టానం వివరాలు సేకరిస్తున్నది. కాగా, ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో దాదాపు 70 శాతం వరకు ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి కావచ్చాయి. మిగిలిన గ్రామాల్లోనూ వీటిని పూర్తి చేస్తున్నారు. ప్రతి ఆత్మీయ సమ్మేళానికి మంచి స్పందన వస్తున్నది. పార్టీ శ్రేణుల్లో అనుకున్నదానికంటే ఎక్కువ ఉత్సాహం కనిపిస్తున్నది. తద్వారా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణుల్లో మంచి జోష్ నిండుతున్నది. ఇక ఈ నెల 25న జరిగే జెండా పండుగ మరింత ఊపునిస్తుందని నాయకత్వం పేర్కొంటున్నది.
అట్టహాసంగా ఏర్పాట్లు
నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు.. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల పరిధిలో వచ్చే మంగళవారం అట్టహాసంగా గులాబీ జెండాను ఎగురవేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అవసరమైన చోట జెండా గద్దెలను నిర్మిస్తున్నారు. ఈ బాధ్యతలను ఏ గ్రామానికి ఆ గ్రామ కమిటీ తీసుకుంటున్నది. దీనిపై ఎమ్మెల్యేలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. గ్రామం, వార్డు, డివిజన్లలో 25న ఉదయమే జెండా ఎగురవేసి.. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలు దేరి నియోజకవర్గ కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో మూడు వేలకు తగ్గకుండా.. శ్రేణులతో సభ నిర్వహించేందుకు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని చోట్లా ఫంక్షన్హాల్స్ మాట్లాడారు. ఇటు 25న జరిగే కార్యక్రమాలపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నది. అంతేకాదు, ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు, కసరత్తు వంటి అంశాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నది.
అభివృద్ధే ఎజెండా
25న జరిగే నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రగతిని కూలంకుంశంగా వివరించనున్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కకు మించి అభివృద్ధి పనులు చేసింది. ఇంకా చేస్తూనే ఉన్నది. చెరువు నిండితే ఊరు బాగుంటుందన్న లక్ష్యంతో మిషన్ కాకతీయ కింద ప్రతి గ్రామంలోని చెరువులకు పూర్వవైభవం తెచ్చింది. తద్వారా వ్యవసాయం పండుగలా మారడమే కాదు, అనేక వృత్తులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. కాళేశ్వరం జలాలు ఉమ్మడి జిల్లాలోని 85 శాతం గ్రామాలకు వెళ్తున్నాయి. గతంలో వేసవి వచ్చిందంటే.. ఆనాడు ఉన్న పూర్వ జిల్లాలోని 56 మండలాల్లో దాదాపు 38కి పైగా కరువు మండలాలుగా ఉండేవి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. భూగర్భ జలాలు పైపైకి వస్తున్నాయి. అలాగే, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ భరోసానిస్తున్నాయి.
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్కు దీటుగా సేవలందుతున్నాయి. మన ఊరు-మన బడి, కొత్త సంక్షేమ వసతి గృహాలు, ఆంగ్ల మీడియంతో ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య అందుతున్నది. కులవృత్తులకు ప్రోత్సాహంతో మత్స్యకారులు, గొల్లకుర్మలు, రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. పల్లె ప్రగతితో గ్రామాలు ఆదర్శంగా మారాయి. జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి. ఇంకా ఎన్నో పథకాలతో బడుగు బలహీనవర్గాల్లో వెలుగులు నిండుతున్నాయి. సబ్బండవర్గాలకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. వీటన్నింటిపై నియోజకవర్గాల సమావేశాల్లో సమగ్రంగా చర్చించనున్నారు. ఆ విషయాలను ప్రతి గడపనూ తట్టి అర్థం చేయించనున్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న అర్థంలేని ఆరోపణలు తిప్పికొట్టేలా చైతన్యం చేయనున్నారు. మొత్తంగా చూస్తే ఈ నెల 25న జరిగే సమావేశాల్లో బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశమున్నది.