Robbery | జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 16: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకు ముందు సినీ ఫక్కీలో చోరీ జరిగింది. బైక్ సైడ్ డిక్కీ తెరిచి రూ.3.40 లక్షల నగదును కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు. బాధితుడు, జగిత్యాల టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయికల్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన సోమ వెంకటేశ్ జగిత్యాలలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేద్దామని రూ.3.40 లక్షలు తన బైక్ సైడ్ డిక్కీలో పెట్టుకుని శనివారం వచ్చాడు.
జగిత్యాల బైపాస్ రోడ్డులో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎదుట బైక్ను నిలిపి పక్కనే ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లి తిరిగి వచ్చి చూడగా, బైక్ డిక్కీ తెరిచి ఉన్నట్లు కనపడింది. డిక్కీలోని డబ్బులు కపడకపోవడంతో లబోదిబోమంటూ వెంకటేశ్ జగిత్యాల పోలీసులను ఆశ్రయించాడు. బ్యాంకు వద్దకు వచ్చిన పోలీసులు బ్యాంకు, ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ పుటేజీని చూడగా, ఓ బైక్పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెంకటేశ్ను అనుసరించడం, బైక్ నిలిపిన తర్వాత డిక్కీ ఓపెన్ చేసి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు రికార్డయింది. బాధితుడు వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రహీం తెలిపాడు.