ఆదివారం ఉదయం కరీంనగర్లో కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అతి వేగంగా వెళ్లిన కారు రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు ప్రమాదం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కారు యజమాని రాజేంద్రప్రసాద్తో పాటు.. మరో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ వెల్లడించారు. బాలుడు కారు నడిపి ప్రమాదానికి కారణమైనట్టు నిర్ధారణ అయింది. కారు యజమాని కొడుకే(మైనర్) డ్రైవింగ్ చేశాడు. ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి కారు నడిపాడు. కారు తానే నడిపినట్టు రాజేంద్రప్రసాద్ నమ్మించే ప్రయత్నం చేశాడు. తర్వాత విచారణలో మైనర్ అయిన కొడుకు నడిపినట్టు తేలింది.
బ్రేక్ బదులు, యాక్సిలేటర్ తొక్కడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. మైనర్లు ప్రతిరోజు ఉదయం కారు బయటికి తీస్తున్నారు. అంబేడ్కర్ స్టేడియంలో వాకింగ్ కోసం కారులో వెళ్తుంటారు. కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు ఇప్పటికే చాలా ఉన్నాయి. మైనర్లకు కారును యజమాని అందుబాటులో ఉంచడంతో అతడిపై కూడా కేసు నమోదు చేశాం. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు కారు నడిపాడు. ప్రమాద స్థలం నుంచి బాలురు వెంటనే పారిపోయారు. తండ్రి, మైనర్ల నిర్లక్ష్యం నలుగురు అమాయకుల ప్రాణాలు తీసింది. ఘటనపై యాక్సిడెంట్ కేసు కాకుండా హత్య కేసు నమోదు చేశాం. నలుగురు చనిపోయినందున హత్య కేసు నమోదు చేస్తున్నాం.
స్మార్ట్ సిటీ పనుల కోసం వారం క్రితమే రోడ్డు పక్కన గుడిసెలు తొలగించాం. తొలగించినప్పటికీ కొందరు మళ్లీ గుడిసెలు వేస్తున్నారు. రోడ్ల పక్కన అక్రమంగా గుడిసెలు వేసుకోవద్దు. రోడ్డు పక్కన గుడిసెల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.. అని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.