జగిత్యాల అర్బన్, నవంబర్ 1: ‘బడాయి మాట లు మాట్లాడే ఎంపీ అర్వింద్ తన పార్లమెంట్ పరిధిలోని ప్రజలను మోసం చేసిండు. పైసా అ భివృద్ధి చేయలే. ఆయనకు పనిచేతకాదు.. అసలు మర్యాదనే తెలువదు. ప్రెస్మీట్లు పెట్టి వాళ్లను.. వీళ్లను తిట్టుడు.. పోవుడు తప్ప ఏమైనా చేసిం డా.. గెలిచిన తర్వాత ఒక్క గ్రామాన్నైనా సందర్శించిండా..? ఆయన మాటలు ఇంకా నమ్ముతారా..? మేల్కోండి’ అంటూ జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ ప్రజలకు సూచించారు. ఇప్పుడు ఆయన కొత్త ట్రెండ్ తెచ్చాడని, నిజామాబాద్ నుంచి ఆయన డైరెక్షన్ చేస్తే ఇక్కడ యాక్షన్ నడుస్తున్నదని మండిపడ్డారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని 39వ వార్డులో తన సతీమణి రాధికతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగిత్యాల పట్టణంలో బీట్ బజార్లో అత్యాధునిక హంగులతో సమీకృత నాన్వెజ్ మార్కెట్ను నిర్మించి రైతులు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. బీట్ బజార్లో ఏరియాలో 328 మందికి ఇప్పటిదాకా పింఛన్ల రూపంలో రూ.5కోట్ల సాయం చేశామని, బీడీ కార్మికులకు సైతం రూ.5 కోట్ల జీవనభృతి అందించినట్లు వివరించారు. అలాగే 100 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చామని, రాని వారికి త్వరలోనే ఇండ్లు ఇస్తామన్నారు. ఇంకా 61 మందికి కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేశామని చెప్పారు.
మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా కల్పిస్తామని, మధ్యాహ్న భోజనం మాదిరిగానే ఇంటింటికీ రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందజేస్తామని స్పష్టం చేశారు. జగిత్యాల చుట్టూ ఉన్న ప్రతి చెరువును అభివృద్ధి చేశామని, ప్రధాన రహదార్లపై డివైడర్లు కట్టించి సెంట్రల్ లైటింగ్ అమర్చినట్లు చెప్పారు. ఎల్ఎల్ గార్డెన్ నుంచి ధన్వంతరి ఆలయానికి వెళ్లే దారికి నిధులు కేటాయించామని, త్వరలోనే రోడ్డు పూర్తవుతుందన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయలేదని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని, ముఖ్యంగా జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. మరోసారి దీవించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని వివరించారు. ప్రచార కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సమిండ్ల వాణి తదితరులు పాల్గొన్నారు.