కమాన్చౌరస్తా, జూలై 14: జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని, ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు. అలాగే, భగత్నగర్లోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో నిర్వహించిన అల్ఫోర్స్ బంగారు బోనం ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. దుర్గా మాత చిత్రపటానికి పూల మాల వేసి పూజలు చేశారు. బోనాల ఉత్సవాలు పల్లెల్లోనే కాకుండా, విదేశాల్లో సైతం వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సిద్ధార్థ పాఠశాలలో..
భగత్నగర్లోని సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణను రంగ వల్లులు, పూలతో అందంగా అలంకరించారు. విద్యార్థులు బోనం కుండలను ఇంటి వద్దనే అందంగా అలంకరించుకొని పాఠశాలకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి పోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పిల్లల్లో ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని పెంపొందించడానికి ఇలాంటి పండుగలు దోహదపడుతాయని తెలిపారు. పంచభూతాలను గ్రామదేవతలుగా భావించుకొని బోనాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ విషయాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో..
కరీంనగర్ రూరల్, జూలై 14: మండలంలోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కృష్ణవేణి పాఠశాలలో..
చొప్పదండి, జూలై 14: మండల కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి పాఠశాలలో తెలంగాణ మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకల్లో కరస్పాండెంట్ పద్మాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ లింగారావు, ప్రధానోపాధ్యాయుడు శంబయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.