‘ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే ఓటేసి గెలిపించిన్రు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. నేను సిరిసిల్ల శాసన సభ్యుడిగా చెప్పుకోడానికి గర్వపడుతున్న. మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంట’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం కామన్ అని, పవర్ పాలిటిక్స్లో అధికారం రావడం పోవడం సహజమని, ఎవరూ నిరాశ చెందవద్దని సూచించారు.
సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారిగా ఆయన జిల్లాకేంద్రానికి వచ్చారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో బాబా సాహెబ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్నా.. ప్రజల కోసం పోరాటం చేస్తామని, మీ కోసం కొట్లాడే రామన్న ఉన్నాడన్న ధైర్యం కల్పిస్తానని భరోసానిచ్చారు. ఎట్టి పరిస్థితిలోనూ సిరిసిల్ల అభివృద్ధి ఆగదని, అందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
– రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, ప్రతిపక్ష పాత్రలో రాణిస్తూనే.. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టేలా ప్రజల గొంతుకై వినిపిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాలు, పవర్పాలిటిక్స్లో అధికారం రావడం పోవడం కామన్ అని, దాని గురించి నిరాశపడి బాధపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా అందరినీ కలుపుకొని ముందుకుపోతామని, సిరిసిల్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. తమ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి అని, పోరాటాలు తమకేం కొత్త కాదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడుతాం అని చెప్పారు.
పెద్దపెద్ద హామీలు ఇచ్చారని, రుణమాఫీ, అందరికీ ఇల్లు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పిన మాటలన్నీ ప్రజలు రాసి పెట్టుకున్నారని చెప్పారు. వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా గమనించి జాగ్రత్తగా ఆలోచిస్తారన్నారు. ప్రభుత్వం ఎలా ఉన్నా తమ పని తాము చేసుకుంటామని చెప్పారు. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం మొదటిసారిగా బుధవారం సిరిసిల్లకు ఆయన వచ్చారు. తెలంగాణ భవన్ వద్ద రామన్నకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ భవన్లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలు తమకిచ్చిన కొత్త పాత్రలో క్రియాశీలకంగా వ్యవహరిస్తామన్నారు. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతుక కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ వదులుకోలేరన్న విశ్వాసం ఉందన్నారు. ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రావడం సహజమేనన్నారు. వచ్చిన ఫలితాలను చూసి నిరాశ చెందవద్దని, ప్రత్యేక పరిస్థితిలో ఇలాంటి ఫలితాలు వచ్చాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఉద్యమంలో నుంచి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. పోరాట పంథాను పుణికి పుచ్చుకుని, కేసీఆర్ నాయకత్వంలో మొదటి నుంచి పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినా పోరాటం తమకు కొత్త కాదన్నారు. కేసీఆర్ సీఎం గా లేడా..? ప్రభు త్వం పోయిందా..? అంటూ కాంగ్రెస్కు ఓటేసిన వాళ్లు సైతం ఆవేదనతో చాలామంది తమకు మెసేజ్లు, వీడియోలు పెడుతున్నట్లు తెలిపా రు. ఆశించిన ఫలితా లు రాలేనందున నిరాశగా ఉండడం సహజమేనన్నారు. రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పారు. 39మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజల విశ్వాస్వాన్ని తాము నిలబెట్టుకుంటామన్నారు.
దురదృష్టవశాత్తు వేములవాడలో స్వల్ప మెజార్టీతో ఓ సీటును కోల్పోయామన్నారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ బాధ్యత గల ప్రతిపక్షంగా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీ చైర్పర్సన్ న్యాల కొండ అరుణ, నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రామ్మోహన్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో ఓటుకు రూపాయి ఇవ్వను.. ఓటుకు మందు పంచను.. అని చెప్పిన మాటను నిలబెట్టుకున్న. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా సిరిసిల్ల ప్రజలు లొంగలేదు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటేసి గెలిపించిన్రు. నా విశ్వాసాన్ని నిలబెట్టిన ప్రతి అన్నకు.. తమ్ముడికి.. చెల్లెకు.. ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న. నా గెలుపు కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గ్రామీణ స్థాయి నుంచి మొదలుకుని పట్టణం వరకు కార్యకర్తల నిర్విరామ కృషి వల్లే గెలుపు సాధ్యమైంది.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్