రైతన్నలూ మీరు అధైర్య పడొద్దు. మీకు అండగా కేసీఆర్, మేమున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ఎండిన పంటలకు నష్టపరిహారం అందించేలా పోరాటం చేద్దాం. మేడిగడ్డ కుంగిందని సీఎం రేవంత్రెడ్డి మూడు నెలలుగా కాలయాపన చేస్తున్నడు. కేసీఆర్పై కోపంతో కాళేశ్వర జలాలు రాకుండా అడ్డుకుని దాదాపు 20 లక్షల ఎకరాలను ఎండబెట్టిండు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి పంటలకు నీరందిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిందే. వడగండ్ల వాన, నీళ్లు లేక ఎండి నష్టపోయిన పంటలకు ఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, బోనస్ అందించాలి.
– రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా
సిరిసిల్ల/సిరిసిల్ల రూరల్/సిరిసిల్ల టౌన్, మార్చి 28 : కాంగ్రెస్ సర్కారు వచ్చిన మూడు నెలల్లోనే సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. అన్నదాతలు అధైర్యపడొద్దని, రైతుల తరఫున కొట్లాడేందుకు ప్రతి గ్రామంలోని పార్టీ నా యకులు వస్తారని ధైర్యంగా ఉండాలని సూచించారు. గురువారం ఆయన జిల్లాలో పర్యటించా రు. ముందుగా తంగళ్లపల్లి మండలం సారంపల్లికి మధ్యాహ్నం 12:20 గంటలకు చేరుకున్న ఆయన, ఇటీవల వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతుల్లో భరోసా నింపా రు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి డిసెంబర్లో అధికారంలోకి వస్తున్నామని, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడేమో రుణాలు చెల్లించాలని బ్యాంకుల ద్వారా నోటీసులు ఇస్తున్నారని, అన్నదాతల మెడపై కత్తి పెడుతున్నారని మండిపడ్డారు. రైతుబంధు కోసం తమ ప్రభుత్వం 7 వేల కోట్లు పంపిణీకి సిద్ధం చేస్తే సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చి చిల్లర వ్యవహారాలకు తెరలేపారని ఆగ్రహించారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి చూస్తే గోస అనిపిస్తున్నదని ఆవేదన చెందారు. సారంపల్లి రైతు పరశురాములు పదెకరాలు కౌలు కు తీసుకొని సాగుచేస్తే నీళ్లు లేక వేసిన పంట ఎండిపోయి పశువుల మేతకు మాత్రమే పనికి వస్తున్నదన్నారు.
కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రికి కనీసం రైతులను పరామర్శించడానికి తీరికలేదని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, అవసరమైతే ఎన్నికల కమిషన్కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎకరాకు 15 వేలు, కౌలు రైతులకు రైతు భరోసా, కూలీలకు అందించే 12 వేలు ఇచ్చి హామిని నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లెల్లలోని మహిళలు కేటీఆర్ను కలిసి తమ భూసమస్యలు విన్నవించగా, ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కారించాలని సూచించారు.
– ఇఫ్తార్ విందులో కేటీఆర్
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ విశేష కృషి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. మైనార్టీల అభ్యున్నతి కోసం రానున్న కాలంలో బీఆర్ఎస్కు అండగా నిలువాలని కోరా రు. సిరిసిల్ల పట్టణంలోని షాదీఖానలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. పేద ముస్లిం యువతుల వివాహాలకు షాదీముబారక్ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. కేసీఆర్ ఏనాడూ మతం పేరుమీద రాజకీయం చేయలేదని, పేదవాడు ఏ మతస్తుడైనా కావాల్సిన వసతులు కల్పించారని తెలిపారు. గత పదేండ్లలో దేశవ్యాప్తంగా మత కల్లోలాలు, అల్ల ర్లు జరిగినా తెలంగాణలో కేసీఆర్ పాలనలో మా త్రం అన్ని మతాల వారు గంగా జమునా తహజీబ్లా కలిసే ఉన్నారని చెప్పారు.
దేశంలో అభివృద్ధి, శాంతి కావాలంటే కేసీఆర్ వంటి నేత అవసరమని చెప్పారు. కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా చోట్ల ఆయన వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ పడిగెల మానస, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, మాజీ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మండలాధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న, ఎంపీటీసీ గుగ్గిల్ల లావణ్య, నాయకులు ఉన్నారు.