రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : “అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షాన ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలి.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేవరకు, పథకాలు ప్రజలకు చేరే వరకు పోరాడుదాం. నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. అభివృద్ధిలో సిరిసిల్లను రాష్ర్టానికే ఆదర్శంగా నిలిపా. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సిరిసిల్లలో విస్తృతంగా పర్యటించారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సిరిసిల్లకు చేరుకున్న ఆయన, సంజీవయ్యనగర్లో ఓ ప్రైవేట్ దవాఖానను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో కలిసి ప్రారంభించారు. సాయినగర్లో కౌన్సిలర్ వేముల రవి గృహ ప్రవేశానికి హాజరయ్యారు.
తర్వాత రగుడు వద్ద గల తెలంగాణ భవన్కు చేరుకుని సమావేశ మందిరంలో మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. అనంతరం విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. బీవైనగర్లోని బీఆర్ఎస్ కార్యకర్త సాయి వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పార్టీ సీనియర్ నాయకుడు దార అశోక్ తండ్రి మరణించగా ఆయన కుటుంబ సభ్యులను, అలాగే శాంతినగర్లో మున్సిపల్ రెండో వార్డు కౌన్సిలర్ రాపెల్లి దినేశ్, వార్డు కమిటీ అధ్యక్షుడు పత్తిపాక రఘు నందన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలనలో అర్హులందరితో అన్ని పథకాలకు దరఖాస్తు చేయించాల ని నాయకులకు సూచించారు. పట్టణ ప్రజలకు ఏ సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా చేసేందుకు మున్సిపల్లో తీర్మా నం చేయాలని చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్లను ఆదేశించారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు చెప్పాలన్నారు. స్వయంగా తానే వచ్చి పరిష్కరిస్తానన్నారు. ఆయన వెంట మున్సిపల్ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు గూడూరి ప్రవీణ్, బొల్లి రాంమోహన్, కౌన్సిలర్ దార్నం అరుణ ఉన్నారు.
విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో వోపా క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం వోపా నేతలతో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణానికి గతంలో రూ.పది లక్షలు ఇచ్చిన విషయాన్ని వోపా నేత సజ్జనం శ్రీనివాస్ గుర్తు చేస్తూ.. ‘మీ సహకారం వల్లనే భవన నిర్మాణ పనులు ప్రారంభించాం’ అని చెప్పడంతో అందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. పనులు వెంటనే పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఇక్కడ వోపా అధ్యక్షుడు తిప్పర్తి రమేశ్, ప్రధాన కార్యదర్శి సజ్జనం శ్రీనివాస్, ఉపాధ్యాక్షులు సజ్జనం శ్రీనివాస్, సాంస్కృతిక కార్యదర్శి చొప్పదండి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు చొప్పదండి వెంకటస్వామి, విశ్వజ్ఞచారి పాల్గొన్నారు.