పద్దెనిమిదేండ్ల కన్నీటి కథ సుఖాంతమైంది. జైలు పాలై చెదిరిపోయిన బంధం మళ్లీ ఒక్కటైంది. అసలే ఎడారి దేశం.. భాష తెలియని ప్రాంతంలో చేయని నేరానికి కటకటాలపాలైన సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు, జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరి విడుదల కోసం ఆ కుటుంబాలు పడ్డ నరకయాతన తీరింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన పదిహేడేండ్ల అలుపెరుగని పోరాటం ఫలించి, ఇటీవలే దుబాయ్ కోర్టు క్షమాభిక్ష ప్రసాదించగా, ఆ కుటుంబాల్లో ఆనందం నిండింది. ఇటీవలే ఇద్దరు స్వగ్రామాలకు రాగా, తాజాగా బుధవారం సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, రవి ఇల్లు చేరారు. తమవారిని ఒకరికొకరు కండ్లారా చూసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 21: కేటీఆర్ 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు బాధిత కుటుంబసభ్యులు కలిసి గోడు వెళ్లబోసుకోవడంతో ఆయన చలించిపోయారు. అప్పటి నుంచే ఆ ఐదుగురిని జైలు నుంచి విడిపించేందుకు తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. దుబాయ్ చట్టాల ప్రకారం.. హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించడంతోపాటు బాధిత కుటుంబం క్షమాభిక్ష పెడితే కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తారు. ఈ క్రమంలో 2013లో కేటీఆరే స్వయంగా నేపాల్ వెళ్లి దిల్బహదూర్ భార్యకు 15 లక్షలు అందజేసి క్షమాభిక్షకు మార్గం సుగమం చేశారు. కానీ, మారిన చట్టాలతో కోర్టు క్షమాభిక్ష సాధ్యం కాలేదు. దీంతో కేటీఆర్ దుబాయ్కు వెళ్లి, అక్కడి ఎంబీసీ అధికారులతో చర్చించారు. మరో 15లక్షల దాకా లాయర్, ఇతర ఖర్చులు భరించారు.
ఇలా పలు దఫాల ప్రయత్నాలతో దుబాయ్ కోర్టు ఇటీవలే ఐదుగురికీ క్షమాభిక్షకు ప్రసాదించింది. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా విడుదలవుతూ స్వదేశానికి వస్తున్నారు. నెల కిందట కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ ఇంటికి రాగా, నాలుగు రోజుల క్రితమే మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు చేరుకున్నాడు. రెండ్రోజుల క్రితమే పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, రవి విడుదలయ్యారు. మరో వ్యక్తి చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి విడుదల కావాల్సి ఉంది. అయితే మల్లేశం, రవి వద్ద టికెట్లకు డబ్బుల్లేక దుబాయ్లోనే ఆగిపోగా, విషయం తెలుసుకొని కేటీఆరే టికెట్లు సమకూర్చారు. దీంతో ఇద్దరూ బుధవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు.
అప్పటికే కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నాయకులు కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లి, ఆ ఇద్దరిని ఎయిర్పోర్టు తీసుకొచ్చారు. ఇంటికి చేరిన మల్లేశం, రవి తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. కొడుకులు, కూతుర్లు, మనుమలను సైతం చూసి పలకరిస్తూ.. ఆలింగనం చేసుకున్నారు. ఇటు తల్లిదండ్రులు ‘కొడుకులారా..? మిమ్మ ల్ని జన్మలో చూస్తామనుకోలేదు’ అంటూ కంటతడిపెట్టారు. తమ కొడుకులు కేటీఆర్సారు దయతోనే ఇంటికి చేరారని, ఆ సారు సల్లంగా ఉండాలని కోరుకున్నారు. కేటీఆర్కు కృతజ్ఞతగా గ్రామం లో కుటుంబ సభ్యులు, బంధువులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కోనరావుపేట మండలం దండుగుల లక్ష్మణ్(48), చందుర్తి మండలం రుద్రంగికి చెందిన నాంపెల్లి వెంకటి (48), పెద్దూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి(45), జగిత్యాల జిల్లా మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు (51) 2004లో ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లారు. అక్కడ పనిచేసే చోట వర్క్ ఎక్కువగా లేక కంపెనీ నుంచి బయటకు వచ్చారు. అడ్డమీది కూలీల్లా దొరికిన పనిచేస్తుండేవారు. ఈ క్రమంలో అక్కడ కంపెనీలో నేపాల్కు చెందిన దిల్బహదూర్ అనే సెక్యూరిటీ గార్డు 2005లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు 25 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అయితే తమ వారిని విడిపించాలని కుటుంబసభ్యులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.