బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఉదయం 10.30 గంటలకు నామినేషన్ వేసిన అనంతరం 11 గంటలకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అంబేదర్ విగ్రహం నుంచి నిర్వహించే రోడ్ షోలో పాల్గొని, ప్రసంగించనున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికుల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతలతో మంథనిలాంటి ప్రాంతంలోని చివరి ఆయకట్టు వరకు అందిన సాగునీరు, తద్వారా రైతులు పొందిన లబ్ధి, అలాగే చేసిన అభివృద్ధి గురించి వివరించనున్నారు.
ఇదే సమయంలో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ మోసం చేసిన తీరు, ఆ పార్టీకి ఓటు వేస్తే జరిగే నష్టాన్ని వివరించనున్నారు. అలాగే పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థులుండాల్సిన అవసరం వంటి విషయాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. బీజేపీ ద్వారా తెలంగాణకు జరిగిన అన్యాయం, ప్రస్తుతం నదుల అనుసంధానం పేరిట జలదోపిడీ ఇలా అనేక అంశాలను అర్థమయ్యేలా వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై రోడ్షోను విజయవంతం చేయాలని రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, పుట్ట మధూకర్ కోరారు. కేటీఆర్ రోడ్షో ద్వారా బీఆర్ఎస్లో నయా జోష్ నిండుతుందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. కొప్పుల ప్రచారానికి మరింత ఊపు తెస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.