రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) గంభీరావుపేట : రంజాన్ వేళ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ముస్లిం సోదరులకు ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని, అన్ని మతాల పండుగలు ఘనంగా జరుపుకునేలా నిధులు కేటాయించారని గుర్తు చేశారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరెలు పంపిణీ చేశామని, రంజాన్ పండుగకు ముస్లింలకు తోఫాలను అందించామని చెప్పారు. గురువారం ఆయన కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
సిరిసిల్ల పట్టణంలో పలు శుభకార్యాలకు హాజరయ్యారు. సిరిసిల్ల అర్బన్ మండలం సర్దాపూర్లో ఎల్లమ్మ సిద్దోగం, వీర్నపల్లి మండలం రంగంపేట, బంజేరులోని భక్తాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ గెలిస్తే బంజేరు భక్తాంజనేయ ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటానన్నారు.
అనంతరం గంభీరావుపేట మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మొదటి ప్రభుత్వం కేసీఆర్దేనన్నారు. మైనార్టీల పిల్లల కోసం గురుకులాలు ఏర్పాటు చేసిందని, ప్రతి విద్యార్థికీ 1.25 లక్షలు ఖర్చు పెట్టిందని చెప్పారు.
వినోద్కుమార్ను ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో హిందూ, ముస్లింలందరం గంగా జమున వలె కలిసి ఉన్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను గౌరవించిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ముస్లింలు ప్రార్థనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పాల్గొన్నారు.