“పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లు ఒక్కటైనయ్. బీఆర్ఎస్ను ఓడించేందుకు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నయ్. అందుకే కొన్ని చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెడితే, మరికొన్ని సీట్లల్లో బీజేపీ డమ్మీలను పెట్టింది. ఈ ధైర్యంతోనే బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదంటూ రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని, పాలిచ్చే ఆవును విడిచి పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా ఉందని ఆలోచనలో పడ్డారన్న ఆయన, కరీంనగర్లో ఆ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి లేదని, అందుకే ఆ రెండు పార్టీలు ఒక్కటై డమ్మీ అభ్యర్థిని నిలబెట్టాయని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్, మానకొండూర్, వేములవాడలో బూత్ లెవల్ కమిటీల సమావేశానికి హాజరయ్యారు. చొప్పదండిలో భారీ రోడ్షో నిర్వహించి, ఆయాచోట్ల మాట్లాడారు.
కరీంనగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కార్పొరేషన్/ చొప్పదండి/ వేములవాడ: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై బీఆర్ఎస్ను ఓడించాలని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని, ఓటుతో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని, పాలిచ్చే ఆవును విడిచి పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా ఉందని ఆలోచనలో పడ్డారని కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్కు ఓట్లు వేసే పరిస్థితి లేదని, ఇక్కడ ఎట్లాగూ ఓట్లు పడవని కొత్త ఎత్తులు వేశారన్నారు.
ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు జీవన్రెడ్డి, ప్రవీణ్రెడ్డి పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారని, వారిని కాదని ఎవరూ గుర్తు పట్టని వ్యక్తిని అభ్యర్థిగా పోటీలో నిలబెట్టారని విమర్శించారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కావడం కాదా..? అని నిలదీశారు. కాంగ్రెస్ అభ్యర్థి మహామేధావిలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. కనీసం ఆయనను కరీంనగర్ ప్రజలైనా గుర్తిస్తారా..? అని ప్రశ్నించారు. ఈ డమ్మీ అభ్యర్థి గురించి ప్రతిచోటా చెప్పి డిపాజిట్ దక్కకుండా తీర్పు ఇవ్వాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ ప్రజల ఆలోచనను తక్కువ అంచనా వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మూతి మీది కొట్టినట్లు సమాధానం చెప్పాలని సూచించారు.
తెలంగాణ తెస్తారా? అని ఆనాడు ఎందరో హేళనగా మాట్లాడారని, కానీ ఐదుగురు ఎంపీలతోనే పార్లమెంట్లో కొట్లాడి, కేంద్రం మెడలు వంచి రాష్ర్టాన్ని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్దేనని కేటీఆర్ గుర్తు చేశారు. ఎక్కువ సీట్లు వస్తే ఇప్పుడు తోకలు జాడిస్తున్న పోలీసులు కూడా అప్పుడు మనకు సలాం కొడుతారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మో సం చేసి గెలిచి, ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టి న కాంగ్రెస్పై నాలుగు నెలల్లోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే హామీలు అమలుచేస్తామని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. కారులో లోడ్ ఫుల్గా ఉందని, ఏ ఊరిలో చూసినా మనమే ఉన్నామని, మీరంతా తలుచుకుంటే వినోద్కుమార్ గెలుపు కష్టంకాదన్నారు. వచ్చే పది రోజు లు ప్రజల్లోకి వెళ్లి చైతన్యవంతం చేసి ఎంపీగా వినోద్కుమార్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
బండి సంజయ్, రేవంత్రెడ్డి మంచి అవగాహనతో ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే కాంగ్రెస్తో పంచాయితీ లేదని బండి సంజయ్ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్కు అవగాహన ఉంటే కవితను ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. 2014, 2019 ఎన్నికల్లో దేశంలో మోదీ హవా ఉన్నా..? తెలంగాణలో అడ్డుకున్నది కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించారు. చోటా భాయ్ ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో ఉండరని బీజేపీలో చేరుతారని జోస్యం చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్లు ఏకమై బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించే కుట్రలు పన్నుతున్నారని, దీనిని బీఆర్ఎస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలని సూచించారు. శ్రీరాముడు అందరివాడని, దేవుడి పేరు చెప్పి బండి సంజయ్ ఓట్లు అడగడం సిగ్గుచేటని, శ్రీరాముడికి ఎవరిని గెలిపించాలో తెలుసునని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలపై బీఆర్ఎస్ శ్రేణులందరూ ఇంటింటికీ వెళ్లి చర్చ పెట్టి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సూచించారు. మే13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ గెలిపించాలని కోరారు.
కరీంనగర్ అభివృద్ధి కోసం ఎంపీగా వినోద్కుమార్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. వినోద్కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. కోట్లాది నిధులు తెచ్చారు. గ్రామ స్థాయి నుంచి ఎంపీ వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉంటేనే వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పి చైతన్యం తేవాలి. పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చే పది రోజులు చాలా కష్టపడాలి. అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో ఈ ఎన్నికల్లోనూ పనిచేస్తేనే విజయం సాధిస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్లో వినోద్కుమార్ గెలుపు ఖాయం. కాంగ్రెస్ అభ్యర్థి డమ్మీ వ్యక్తి. ఇక బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి ఏమీ తెలువదు. ఐదేండ్లలో చేసిందేమీ లేదు. వినోద్కుమార్ మంజూరు చేయించిన వరంగల్, నిజామాబాద్ జాతీయ రహదారిని అతను మంజూరు చేయించినట్లు బండి సంజయ్ చెప్పుకోవడం సిగ్గుచేటు. అసలు ఆ రహదారి రూట్ మ్యాప్ ఎట్లుంటదో సంజయ్కి తెలుసా. తెలిస్తే చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం ఎట్లున్నదో, ఇప్పుడు ఎట్లున్నదో ఆలోచించాలి. రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చినన్ని ఉద్యోగాలు దేశంలో ఇంకెవరైనా ఇచ్చినట్లు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నేను పార్టీ మారుతానని కొందరు ప్రచారం చేస్తున్నరు. అది పూర్తిగా అవాస్తవం. చచ్చేదాకా బీఆర్ఎస్లోనే కొనసాగుతా.
– పాడి కౌశిక్రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని, అవగాహన లేని వ్యక్తిని పోటీలోకి దించింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటనే విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసింది. నాలుగు నెలల్లోనే ప్రజలకు నరకం చూపుతున్నది. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్న చందంగా ప్రజలకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నరు. వినోద్కుమార్ 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తరు.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే
కరీంనగర్కు రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసిన నాకు మాత్రమే ఇక్కడి ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు ఉంది. దేశ సేవ చేస్తా అనే వ్యక్తి మళ్లీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారో చెప్పాలి. ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా..?. బండి సంజయ్ ఐదేళ్లల్లో జడ్పీ, మున్సిపాలిటీలకు చెందిన ఏ ఒక్క మీటింగ్కు అయినా హాజరయ్యాడా..?. ప్రజలపై, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి, అవగాహన లేని వ్యక్తి ఎంపీగా పోటీ చేయడం అవసరమా?. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కేవలం జాతీయ పార్టీలతోనే అవుతుందని విమర్శించి, హేలనగా మాట్లాడిండు. కానీ, బీఆర్ఎస్ ఐదుగురు ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేసి 32 పార్టీలను ఏకం చేసి రాష్ర్టాన్ని సాధించాం.
ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే పార్లమెంట్లో నిలదీసి తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ మతం, కులం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నది. ఇలాంటి రాజకీయాలు చేస్తారా..?. మేం ప్రజల కోసం, ప్రజల సేవ కోసం పని చేస్తాం. బండి సంజయ్ ఈ ఐదేండ్లలో ఒక్క గుడికి అయినా నిధులు తెచ్చారా..?. నేను ప్రభుత్వాన్ని ఒప్పించి కొండగట్టు దేవాలయానికి 334 ఎకరాల భూమిని ఇప్పించా. కాంగ్రెస్ పాలనలో ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ పని అయిపోయిందని ప్రజలే చెప్పుకొంటున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కరీంనగర్ను అభివృద్ధి చేసే బాధ్యత నాదే. నన్ను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజల పక్షాన సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతా.
నేను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చి రూ.1000 కోట్లతో అభివృద్ధి చేశా. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ను తీసుకువచ్చిన ఘనత మాకే దకుతుంది. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఆరు గ్యారంటీలతో మోసపోయాం. మళ్లీ మోసపోవద్దు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న చొప్పదండిని మునిసిపాలిటీగా మార్చి అభివృద్ధి చేశాం. రూ.33 కోట్లతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు చేపట్టాం. ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి పనులు ఆగిపోయాయి. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ దృష్టి పెట్టడం లేదు.
– బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్