ధాన్యం ఆరబోత కల్లాలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రైతన్న కన్నెర్రజేసింది. కల్లాల బిల్లులను తిరిగి చెల్లించాలని అంటున్నందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రైతులకు అండగా కదం తొక్కాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదురుగా ధర్నా నిర్వహించాయి.
కేంద్రానికి వ్యతిరేకం నినాదాలతో హోరెత్తించాయి. ‘కల్లాలు కట్టుకుంటే.. కడుపుమంట ఎందుకురా..’, ‘రైతుల ఐక్యత వర్ధిల్లాలి.. జై భారత్.. జైజై భారత్.. దేశ్కీ నేత కేసీఆర్’ అంటూ ప్లకార్డులు చేతపట్టుకుని నినదించాయి. పెద్దపల్లిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించగా, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు.
పెద్దపల్లి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : పంట ఆరబోత కల్లాల బిల్లులు తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట చేపట్టిన మహా ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి శ్రేణులు తరలివచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆది నుంచి తెలంగాణ రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండి పడ్డారు. కేంద్రంలోని రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలని, బీజేపీ, ప్రధాని మోదీ డౌన్ డౌన్ అనే నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడ లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ తమ కోసం చేపడుతున్న పథకాలకు పూర్తి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండి పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నదని, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంటే, కేంద్రం రైతుల కోసం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. కల్లాల నిర్మాణం బిల్లుల విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోనట్లయితే రాబోయే ఎన్నిల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పెద్దపల్లిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించగా, ఇక్కడ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పాల్గొన్నారు. దాదాపుగా గంట పాటు జరిగిన ధర్నాలో వక్తలు ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధూకర్, నాయకులు
తెలంగాణ రైతులపై కోపమెందుకు?
ప్రధాన మంత్రి మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతులంటే కోపమెందుకు?. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా చేయడంతో కత్తి కట్టిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను, రైతాంగాన్ని నిలువునా ముంచే కుట్రలకు దిగుతున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కేటాయించిన నిధులకు ఆంక్షలు పెడుతున్నాడు. రైతులు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే పనులకు కేటాయించిన నిధులు వాపస్ ఇవ్వాలని కేంద్రం అనడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. గతంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయబోమని రైతులను ఆగం చేసిన కేంద్ర ప్రభుత్వం మరో మారు రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నది. సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి నుంచి దేశస్థాయి నాయకుడిగా ఎదుగుతున్నారని కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాలపై దాడి చేసే విధంగా నిర్ణయాలు ఉండడం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనవి. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కేంద్రం తీసుకుంటున్న నీచమైన నిర్ణయాలను మోదీ సరారు వెంటనే వాపస్ తీసుకోవాలి.
– పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్రం
గతంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, రైతు కూలీలకు ప్రయోజనం కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని రూపొందిస్తే కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. గ్రామం, రైతులు, వ్యవసాయం ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి. వాటికి ప్రయోజనం కలిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉపాధిహామీ పథకాన్ని రాష్ట్రంలో కొత్త పంథాలో నడిపిస్తున్నారు. ఉపాధి పథకం ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బుషెస్ కటింగ్, పూడిక తీత, రైతులకు అవసరమైన కల్లాల నిర్మాణం చేపట్టడం కోసం కార్యక్రమాన్ని తీసుకున్నారు. రైతులు ఏర్పాటు చేసుకున్న కల్లాలకు కేటాయించి నిర్మించిన నిధులను తిరిగి ఇవ్వాలనడం సిగ్గు చేటు. ఇది పూర్తిగా రైతుల వ్యతిరేక చర్య. ఆలోచనా రహితమైనది.
– దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్యే పెద్దపల్లి
రైతులను ముంచుతున్న కేంద్రం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతులు సిరుల పంటను పండిస్తున్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనునిత్యం రైతుల పుట్ట ముంచే నిర్ణయాలను తీసుకుంటున్నది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సాగు నీటి వనరులు సమృద్ధిగా పెరిగి సాగు విస్తీర్ణం పుష్కలంగా పెరిగింది. రైతులంతా ఆనందంలో ఉంటే చూడలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పి వెనక్కి తగ్గింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లు చేస్తామని ముందుకు వచ్చి రైతులకు భరోసా ఇచ్చారు. తాజాగా మరో సారి కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్షకట్టినట్లుగా నిర్ణయాన్ని తీసుకున్నది. ఇది అన్యాయం.
– కాసర్ల అనంతరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి
వివక్ష చూపుతుంటే ఏం చేస్తున్నవ్ బండి..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికి ఒక నీతి, తెలంగాణ రాష్ర్టానికో నీతిని అనుసరిస్తున్నది. మోదీ ప్రభుత్వానిది ఇదేం ద్వంద్వ వైఖరో అర్థం కావడం లేదు. బీజేపీ అంటేనే దొంగల పార్టీ, దోపిడీ పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో మొదలైన బీఆర్ఎస్ పార్టీని చూస్తే బీజేపీ నాయకుల లాగులు తడుస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నది. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి, ఇక్కడి రైతులు సాధిస్తున్న ప్రగతిని చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కళ్లు మండుతున్నయ్. ఇపుడు రైతులు నిర్మించుకున్న కల్లాల బిల్లులు తిరిగి చెల్లించాలని చెబుతున్నది. తమిళనాడు, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో చేపలు ఆరబెట్టుకునే కల్లాలకు అనుమతిచ్చిన కేంద్రం ఇక్కడ కల్లాలకు ఎందుకు అనుమతులు ఇవ్వదు. రాష్ట్ర రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏం చేస్తున్నాడు. తెలంగాణ రైతులకు అండగా నిలబడి కేంద్రం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించాలి.
– చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
అడుగడుగునా వంచిస్తున్నది..
బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రైతు సమితి. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసుకోవడం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతులు కల్లాలు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇది గిట్టని కేంద్ర ప్రభుత్వం రైతులు కల్లాలు నిర్మించుకునేందుకు వీలు లేదని, నిర్మించుకున్న వాటి నిధులు తిరిగి చెల్లించాలని నోటీసులు ఇవ్వడం అత్యంత దారుణం. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తే కేంద్ర ప్రభుత్వం రైతులను అడుగడుగునా వంచించాలని చూస్తుంది. రాష్ట్రంలో రైతురాజ్యం నడుస్తుంటే, కేంద్రంలో అంబానీ, అదానీ షావుకారుల రాజ్యం నడుస్తున్నది. పసుపుబోర్డు, చెక్కర ఫ్యాక్టరీలు అంటూ దొంగ బాండ్పేపర్లు రాసి ఇచ్చిన ఎంపీ అర్వింద్ ఇప్పుడు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి రైతులు గట్టిగా బుద్ధి చెబుతారు.
– జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత
కేంద్రానిది నియంతృత్వ వైఖరి
రైతులపై కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని అవలంబిస్తున్నది. తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి దేశం దృష్టిని ఆకర్శిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ చాపకింద నీరులా దేశమంతటా విస్తరిస్తుందనే భయంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నది. దేశానికో నీతి, తెలంగాణ రాష్ర్టానికి ఒక నీతి ఉంటుందా?. ఇదెక్కడి నీతి?. తెలంగాణ రైతుల పట్ల తీవ్ర వివక్షను చూపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఉద్యమించాలి.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
రైతులను వంచించే యత్నం
ఉపాధి హామీ పనులను వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉండకుండా కేంద్రం కుట్ర చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా తెలంగాణలో రైతులు వ్యవసాయ కల్లాలను నిర్మించుకుంటుంటే దీనిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. చేపలు ఆరబెట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్న కల్లాలకు అభ్యంతరం చెప్పని మోడీ సరారు తెలంగాణ రైతులు కట్టుకున్న కల్లాలకు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధించాలని తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ తరఫున ఎన్నో ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. అలాంటిది మనం సలహాలు సూచనలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మనల్ని బద్నాం చేస్తున్నది. రైతులకు మేం సాయం చెయ్యం.. చెయ్యనీయం అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్నది. పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను రైతులందరికి గ్రామాల్లో వివరించి చెప్పాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉంది.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
రైతుల నడ్డి విరిచే కుట్రలు
అత్యధిక ఆదాయం వచ్చే వ్యవసాయంపై ఆధారపడిన దేశం మనది. ఇలాంటి వ్యవసాయాభివృద్ధికి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పది రకాల పథకాలను అమలు చేస్తున్నారు. వాటితో వ్యవసాయం విస్తరించి సమగ్రాభివృద్ధి సాధిస్తుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. జాతికి అన్నం పెట్టే రైతుల నడ్డి విరిచేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నది. తెలంగాణలో రైతులకు విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కుట్రలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్రం మాత్రం కార్పొరేట్ల ఆదాయాన్ని పెంచాలని చూస్తున్నది.
– మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు
రైతు వ్యతిరేక ప్రభుత్వం
రైతు వ్యతిరేక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కోటిన్నర ఎకరాల తెలంగాణగా రాష్ట్రం మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం సీఎం కేసీఆర్కు భిన్నంగా రైతులను ఇబ్బంది పెట్టే పనులు చేపడుతున్నది. రైతులకు అత్యంత అవసరమైన ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలను పెంచివేసింది. ఇప్పటికే అనేక దుర్మార్గమైన చర్యలతో రైతుల నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన రైతుల కల్లాలను సైతం అడ్డుకునేలా చర్యలు తీసుకోవడం సిగ్గుచేటు. ఉపాధి హామీ పథకం పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వినియోగించి రాష్ర్టాన్ని సర్వాంగ సుందరంగా మార్చివేస్తే, కేంద్రం భరించలేకపోతున్నది.
– జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్