మంథని, మార్చి 16: కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి మూడు పదవులు కల్పించడం ఎంత వరకు సమంజసమని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మూడోతరం రిజర్వేషన్ వారసులకు కూడా ఇంకా మనం ఓటు వేయాలా..? అనే విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ వ్యాపారాలు చేసే వ్యక్తి ప్రజల కష్టాలను ఏం తీరుస్తాడని, ఇక్కడి ప్రజల సమస్యలు పూర్తిగా తెలియని వ్యక్తి వంశీ కృష్ణ అని విమర్శించారు. సింగరేణి కార్మికుడిగా, ఉద్యమనేతగా ఈ ప్రాంతం.. ఈ మట్టితో ఎంతో అనుబంధం తనకు ఉన్నదని, ఓటుతో ఆశీర్వదిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్స్లో మంగళవారం జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాధ్యం కాని అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కేవలం నాలుగు నెలల్లోనే ఆ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు గమనించారని చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తున్నా ఆ సంస్థ మీదనే ఒడ్డెక్కిస్తున్నదని మండిపడ్డారు. గతంలో కాయిలాపడ్డ ఆర్టీసీ సంస్థను కేసీఆర్ సర్కారు అన్ని విధాలుగా ఆదుకున్నదని, కొత్త బస్సులను అందించడంతో పాటు బస్టాండ్లు, డిపోలు ఏర్పాటు చేయడం, అధికారులు, సిబ్బందికి జీతాలు పెంచడం వంటివి చేసిందని తెలిపారు. అలాంటి ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మళ్లీ పాత రోజులే వస్తాయన్నారు.
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 15వ తేదీ వరకు రైతు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రజలను మోసం చేసేలా ప్రకటిస్తోందని దుయ్యబట్టారు. పదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ సర్కారు పాలన కొనసాగిందని గుర్తు చేశారు. మీ కష్టాలు తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వచ్చానని, తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ నెల 19న తాను నామినేషన్ వేస్తున్నానని, ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు జక్కు రాకేశ్, తగరం సుమలత, రాచకొండ లక్ష్మి, ఎగోలపు శంకర్గౌడ్, ఆరెపల్లి కుమార్, రాజిరెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ గెలుపు ఖాయం
పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లిలో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయం. పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని ఒకే కుటుంబానికి రాసిచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ వారికే కేటాయిస్తున్నది. ఇప్పటికే వారింట్లో రెండు పదువులున్నా మళ్లీ ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించింది. ఈశ్వర్ను గెలిపించుకోవడం వల్ల బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు కొండంత అండ దొరుతుంది.
– పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్
ప్రజలే ఆలోచించాలి
పెద్దపల్లి ఎంపీ స్థానంలో గుణవంతుడు.. ధనవంతుడికి పోటీ జరుగుతున్నది. ధనవంతుడు కన్న తల్లిదండ్రులకు కూడా అన్నం పెట్టడు. అదే గుణవంతుడు సమాజం బాగు కోసం పోరాడుతడు. దీన్ని గమనించి ఎవరు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి. గడ్డం వివేక్ కుటుంబం కేవలం అధికారం, పదవుల కోసం మాత్రమే రిజర్వేషన్ను వాడుకుంటున్నది. వాళ్లెప్పుడూ ప్రజల కష్టాలను తీర్చలేదు. ఇప్పుడు మళ్లీ వాళ్ల కుటుంబం నుంచి మూడో వారసుడు ఎంపీగా పోటీ చేస్తున్నడు. ఈ ప్రాంతం నుంచి అవగాహన లేని వ్యక్తి కేవలం డబ్బు మాత్రమే ఆశ చూపి గెలువాలని చూస్తున్నడు. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి.
– తగరం శంకర్లాల్, బీఆర్ఎస్ నాయకుడు