సిటీబ్యూరో: ఐటీ కారిడార్లోని ఓఆర్ఆర్ వెంట రూ. 93కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఖ్యాతి మసకబారుతోంది. ఏడాది కాలంగా నిర్వహణ లోపంతో ఈ ప్రపంచస్థాయి ట్రాక్ లోపభూయిష్టంగా మారుతున్నదని సైక్లిస్టులు, పర్యావరణవేత్తలు ఆవేదన చెందుతున్నారు. ట్రాక్లోని వట్టినాగుల పల్లి, కోకాపేట, నానక్రాంగూడ పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల పెద్ద ఎత్తున్న పగుళ్లు వస్తున్నాయి. ఇవి విస్తరించడంతో సైకిల్ సన్నని టైర్లు వాటిలో చిక్కుకుని సైక్లిస్టులు కిందపడి గాయపడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
దీనికి తోడు ట్రాక్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద భద్రత కోసం ఏర్పాటు చేసిన బొల్లార్డ్స్ విరిగిపోవడం, కొన్ని చోట్ల పూర్తిగా తొలగించారు. మరమ్మతుల నిర్లక్ష్యానికి తోడు, రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ నివారణ పేరిట అధికారులే ఈ ట్రాక్ నిర్మాణాలను కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద వాహనాల రాకపోకల కోసం కొత్తగా యూ టర్న్, అండర్ పాస్ నిర్మించేందుకు అధికారులు దాదాపు సోలార్ రూఫ్ షెడ్లను పిల్లర్లను తొలగించడంపై సైక్లిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.