‘తెలంగాణను అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిపాం. ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఏ రంగంలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినా సహించే ప్రశ్నేలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు నిలదీడయమేకాదు, అవసరమైతే పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలుస్తాం’ అంటూ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల హక్కులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు ధారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ‘చలో నల్లగొండ’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో గర్జించారు. జరుగుతున్న అన్యాయంపై చైతన్యం చేయడమే కాదు, పోరాటాలు చేద్దాం.. వైఫల్యాలు ఎండగడుదామంటూ మరో సమరానికి సన్నద్ధం చేశారు.
కరీంనగర్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో న్యాయమైన హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం నిర్వహించిన ‘చలో నల్లగొండ’ భారీ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదిలారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి సభ కావడం, అధినేత హాజరవుతుండడంతో 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సభ సాయంత్రం నాలుగు గంటలకు కాగా, ఉదయం నుంచే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. గులాబీ జెండాలు చేతబూని.. జై కేసీఆర్ నినాదాలు చేస్తూ కదిలారు. అధినేత కేసీఆర్ చేసిన దిశానిర్దేశంతో నూతనోత్సాహం నింపుకున్నారు.
చలో నల్లగొండ సభ సాక్షిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగం అటు ప్రజలను.. ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్నికల తర్వాత తొలి బహిరంగ సభ కావడం, అందులో అధినేత కేసీఆర్ రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయంతో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఐదు జిల్లాలకు జరిగే అన్యాయాన్ని ఎండగడుతూనే, మరోవైపు కాంగ్రెస్ హామీల అంశాలను ప్రస్తావిస్తూ, ప్రశ్నిస్తూ చేసిన ప్రసంగం అందరిలో జోష్ నింపింది. ముఖ్యంగా ప్రజలను ఆలోచింపచేయడమేకాదు పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేసినట్లు కనిపించింది. ముందుగా కేఆర్ఎంబీకి ధారాదత్తంచేసిన హక్కుల వల్లే జరిగే అన్యాయాన్ని వివరించిన కేసీఆర్, దానికి పరిష్కార మార్గాలు కూడా చూపెట్టారు.
తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి పోరాటం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచనలు చేశారు. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి, మంత్రులు రైతు బంధు విషయంలో మాట్లాడుతున్న మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇకనైనా మాట తీరు మార్చుకోవాలని సూచించారు. కరెంటు, రైతు బంధు ఇతర అంశాల విషయంలోనూ ప్రశ్నలు సంధించారు. మొత్తంగా ఏ విషయంలో అన్యాయం జరిగినా సహించే ప్రశ్నేలేదని చెప్పారు. హామీల అమలుకోసం తెలంగాణ హక్కుల కోసం, పోరాటం చేయాల్సిన అవసరం వస్తే అందరూ కదిలిరావాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే.. ఎక్కడికక్కడే నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పోరాటాలు చేయడానికి వెనుకాడొద్దని చెబుతూ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపారు. ఇన్నాళ్లూ కొంత ఊగిసలాటలో ఉన్న పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన దిశానిర్దేశం కొత్తజోష్ నింపినట్లయిందని నాయకులు చెబుతున్నారు.