ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంగనర్ గడ్డపై నుంచి బీఆర్ఎస్ కదనభేరి మోగించింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించింది. ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. కరీంనగర్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అశేషంగా తరలిరాగా, సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభ ఆలస్యంగా ప్రారంభమైనా జనం ఉత్సాహంగా ఎదరుచూశారు. అధినేత కేసీఆర్ వేదికపైకి చేరుకోగానే చప్పట్లు, ఈలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ అరగంటకుపైగా ప్రసంగించి, నాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, ప్రత్యేక రా్రష్ట్ర సాధన కోసం సాగిన పోరాటం, స్వరాష్ట్రంలో పాలన సాగించిన తీరును వివరిస్తూనే.. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాల్సిన ఆవశ్యకతను అర్థమయ్యేలా వివరించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిజాయితీపరుడని, కరుడుగట్టిన తెలంగాణ వాది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపిస్తేనే లాభం జరుగుతుందని చెప్పారు.
కరీంనగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించా రు. పార్టీ ఆవిర్భావం నుంచి మొదలు కొని సకల జనుల సమ్మె వరకు ఎన్నో ముఖ్య ఘట్టాలకు వేదికైన ఎస్సారార్ కళాశాల మైదానం నుంచే మరోసారి కదనభేరి మోగించారు. మంగళవారం నిర్వహించిన బహిరంగ సభకు కరీంనగర్ లోక్సభ పరిధిలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల ఏ మార్గంలో చూసినా పెద్ద సంఖ్యలో వాహనాల్లో చేరుకున్నారు. దారిపొడవునా గులాబీ జెం డాలు ప్రదర్శిస్తూ.. జై కేసీఆర్ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.
యువజన, విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో బైక్లపై కదం తొక్కారు. సాయంత్రం 4 గంటలకు ప్రారం భం కావాల్సిన సభ మూడు గంటలకు పైగా ఆలస్యమైనా ఓపికతో ఎదురు చూశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గంటకుపైగా ఆటాపాటలతో ఉర్రూతలూగించ గా.. వేదిక కింద యువకులు, మహిళలు నృత్యాలతో హోరెత్తించారు. సాయంత్రం 6.40 గంటలకు అధినేత కేసీఆర్ వేదికపైకి చేరుకోగానే సభికులు చప్పుట్లు, హర్షధ్వానాలతో స్వాగతించారు. దాదాపు అరగంటకు పైగా కేసీఆర్ ప్రసంగించగా.. ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ప్రసంగాలకు జేజేలు పలికారు. తాము బీఆర్ఎస్ వెంటే ఉన్నామని మరోసారి నిరూపించారు.
కరీంనగర్ గడ్డపై నుంచి కదనభేరి మోగించిన అధినేత కేసీఆర్, ఆద్యంతం తన ప్రసంగంతో ఆలోచింపజేశారు. రాత్రి 7.05 గంటల నుంచి 7.40 గంటల వరకు ప్రసంగించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటం, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు, తెలంగాణను సాధించుకున్న తీరును వివరిస్తూనే.. నాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ చేసిన దగాను ఎండగట్టారు. ఈరోజు దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణను తిరిగి వెనక్కి తీసుకెళ్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజలను మోసం చేసిందని, హామీలు నెరవేర్చకుండా అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతామంటున్నారని, ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడితే తొక్కుతా.. సంపుతామంటున్నారని, ఇదేనా ప్రజలకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు.
ఇలాంటి నాయకుల గురించి ఆలోచన చేయాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంట్, సాగునీటి కష్టాలు లేకుండా చేశామని, రైతుబంధు, రైతుబీమా ఇచ్చామని, ఇంటింటికీ భగీరథ నీళ్లిచ్చామని, ఇలా అన్ని వర్గాలకు అండగా నిలిచామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కరెంట్, సాగునీటి కష్టాలు మొదలయ్యాయని, సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. తాను ఈసారి సీఎం అయ్యి ఉంటే ఒక్క ఎకరా కూడా ఎండకుండా చూసేవాడినని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలువాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బ్రహ్మాండం గా ముందుకుపోతామని చెప్పారు. మనం మళ్లీ మోసపోదామా..? బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకొని ముందుకు పోదామా..? అని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
తనకు కలిసొచ్చిన గడ్డపై నుంచి అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కనిపించింది. ఆది నుంచి బీఆర్ఎస్ వెంటే ఉంటున్న ప్రజలు, కదనభేరికి పెద్ద సంఖ్యలో కదిలారు. లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మంది వరకు తరలివచ్చారు. ఎస్సారార్ కళాశాల మైదానంతోపాటు సభకు వచ్చే దారుల వెంట ఎక్కడ చూసినా జనమే కనిపించారు. అధినేత కేసీఆర్ తన ప్రసంగంతో ఆలోచింపజేయగా, నూతనోత్సాహం నింపుకున్నారు.
మొత్తంగా సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నాయకులు నయాజోష్లో మునిగిపోయారు. ముందు నుంచీ అనుకున్నట్టుగానే భారీ సమీరణలో సక్సెస్ అయ్యారు. తాము ప్రజల పక్షమని చెప్పేందుకు వచ్చిన అశేష జనమే రుజువని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు కే విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్, జడ్పీ అధ్యక్షులు కనుమల్ల విజయ, పుట్ట మధూకర్, దావ వసంత, పార్టీ జిల్లాల అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదే గడ్డ నుంచి దళితబంధు, చేనేత బంధు, రైతుబంధు తెచ్చిన. కులం మతం చూడలె. తెలంగాణ జాతిగా నిలబడాలె. కలబడాలె. ఒక మెస్సేజ్తో వచ్చిన. ఇది లక్ష్మీ గడ్డ. ఈ నేల నుంచే తెలంగాణ సాధించినం.
కాంగ్రెస్ మూడు నెలల పాలనపై ప్రజల్లో చర్చ పెట్టాలి. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ప్రభుత్వానికి అంకుశంలా ఉండాలి. మెడలు వంచి పనులు చేయించాలి. పోలీసులకు భయపడ కూడదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ల మీద కేసులు పెడుతున్నరు ఎందుకు?. మేం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి పెట్టాం. కాంగ్రెస్ వాళ్లపై దౌర్జన్యం చేస్తే ఒక్కరు కూడా మిగిలే వారు కాదు. – అధినేత కేసీఆర్
తెలంగాణ అనే మాటే అసెంబ్లీలో వినిపించ కూడదనే రోజుల్లో కరీంనగర్ గడ్డ నాకు అండగా నిలబడింది. నాకున్న పదవులను విసిరి వాళ్ల మొఖాన కొట్టిన. నిలబడాలె. కలబడాలె. సొంత రాష్ర్టాన్ని సాధించాలని నాతో పాటు పిడికెడు మనుషులతో ఇక్కడికి వచ్చి జై తెలంగాణ అని నినదించిన.
– అధినేత కేసీఆర్
వినోద్ కుమార్ తెలంగాణ సోయి నింపుకున్న నాయకుడు. క్లీన్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఉద్యమంలో నా వెంట నిజాయితీగా నడిచిండు. మడమ తిప్పకుండా ముందుకు సాగిండు. కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు అనేక సార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. కరీంనగర్ స్మార్ట్సిటీ గానీ, జాతీయ రహదారులు గానీ, రైలు మార్గం గానీ, అనేక పనుల కోసం కేంద్రంతో పోరాటం చేసిండు. సీఎంగా నాతోగానీ, కేంద్రంతోనిగానీ కొట్లాడి ఈ ప్రాంతానికి నిధులు రాబట్టిన వ్యక్తి ఆయన. అలాంటి నాయకుకుడు ఎంపీ అయితే ప్రజలకు లాభమైతది. బండి సంజయ్ ఇక్కడ ఎంపీగా గెలిచి ఐదు రూపాయల పని చేసిండా..? దయచేసి ఆలోచన చేయాలి. సంజయ్కు, వినోద్కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఓటు వేసే ముందు ఆలోచించాలి. వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈరోజు కాంగ్రెసోళ్లు గానీ, బీజేపోళ్లు గాని గుండెల నిండా జై తెలంగాణ అంటరా.. మళ్లీ ఇదే గులాబీ జెండా, ఇదే వినోద్కుమార్ అనగలడు. తన ఉపన్యాసం మొదలు పెట్టినప్పుడు, ముగించేటప్పుడు గుండెలు పగిలిపోయే విధంగా జై తెలంగాణ అన్నడు. తెలంగాణ కోసం కొట్లాడెటోళ్లు ఎవరో తెలియాలంటే ఇది చాలు.
– అధినేత కేసీఆర్
నేను ఎంపీగా ఉన్నప్పుడు 106 సార్లు పార్లమెంట్లో గళమెత్తిన. అనేక సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి పనులు సాధించిన. బండి సంజయ్ ఈ ఐదేండ్లలో ఏం చేశావో చెప్పు? ఉపాధి హామీ పథకం కింద కోట్ల నిధులు తెచ్చానని చెప్పుకుంటున్నవ్. అవి కూడా నీ ఖాతాలో వేసుకుంటావా..? ఎంత సిగ్గు. నరేంద్ర మోడీ ప్రధానిగా పదేళ్ల పాలనలో నేనొక ఐదేళ్లు, బండి సంజయ్ ఒక ఐదేళ్లు ఎంపీలుగా ఉన్నం. నేను ఏమేం పనులు చేశానో చెబుత.. బండి సంజయ్ చెబుతడా..? చెప్పలేడు. కేసీఆర్ సహకారంతో నేను కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు సాధించిన. మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు పనులు పూర్తయినయి.
మరో ఏడాదిన్నరలో సిరిసిల్ల, వేములవాడ మీదుగా కొత్తపల్లి దాకా రైలు వస్తుంది. కరీంనగర్ చుట్టూ ఐదు జాతీయ రహదారులు తెచ్చిన. అర్హత లేకున్నా కరీంనగర్కు స్మార్ట్ సిటీని మంజూరుచేయించిన. వెయ్యి కోట్లతో నగరం అభివృద్ధి జరుగుతున్నది. ట్రిపుల్ ఐటీ కోసం 50 ఎకరాల భూమిని చూపించిన. కొత్త జిల్లాకో నవోదయ స్కూల్ ప్రతిపాదించిన. కరీంనగర్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తేవాలని తాపత్రయపడ్డ. దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో నేను ఓడిపోయిన. తర్వాత వీటిని సంజయ్ ఎందుకు సాధించలేక పోయాడో చెప్పాలి? ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోతే తిరిగి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నడు. కరీంనగర్ ఏమైనా పునరావాస కేంద్రమా..? ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు ఏం చేస్తాయో తెలియని పరిస్థితి ఉన్నది. ఇలాంటి సందర్భంలోనే తెలంగాణ స్పృహ ఉండి, ప్రజల కోసం ఆలోచించే బీఆర్ఎస్ పార్లమెంట్లో ఉండాల్సిన అవసరమున్నది. ఈ విషయాలన్నింటిపై కార్యకర్తలు గ్రామాల్లో చర్చ పెట్టాలి.
– బీ వినోద్కుమార్, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి
2001లో ఇదే ఎస్సారార్ కళాశాల వేదికగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి విజయం సాధించిండు. ఇపుడు ఇదే వేదికగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మరోసారి బీఆర్ఎస్ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నరు. కేసీఆర్ అడుగు పెట్టగానే ఈ నేల పులకరించింది. రాష్ట్రం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్, ఇక్కడి నుంచే అనేక పథకాలు ప్రారంభించి విజయవంతంగా అమలు చేసింది. ఈ విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. కరీంనగర్ ఎంపీగా బీ వినోద్కుమార్ అనేక అభివృద్ధి పనులు చేసిండు. బండి సంజయ్కు వినోద్కుమార్కు చాలా వ్యత్యాసం ఉంది. వినోద్కుమార్ను గెలిపించుకుంటేనే కరీంనగర్ అభివృద్ధి జరుగుతుంది.
– గంగుల కమలాకర్, ఎమ్మెల్యే (కరీంనగర్)
ఈ రోజు వినోద్కుమార్ కోసం నేను గొంగడి వేసుకున్న. ఆయన మంచి మనసున్న వ్యక్తి. మనకోసం తండ్లాడేటోడు. మనకోసం ఆలోచించేటోడు. మన కష్టసుఖాల్లో పాలుపంచుకునేటోడు. మళ్లీ ఆ గొంతు పార్లమెంట్లో వినపడాలె. ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఇది ఎన్నికల సభ కాదు, ఆత్మగౌరవ సభ. మన గోసలు, కన్నీళ్లకు ముగింపు సభ. కేసీఆర్ వచ్చిన తర్వాతనే దశాబ్దాల గోస పోయి ఎవుసం బంగారమైంది. మనకు ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఉంటే నీళ్ల కాలాన్ని సృష్టించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దే. తెలంగాణ ప్రజలను కన్నబిడ్డల్లా సాదుకున్నటువంటి మనిషిని ఇడిసిపెట్టి ఆరు అబద్ధాలను నమ్మి మోసపోయిన్రు. దయ చేసి నేను ఒకటే చెబుతున్న. ఆ గోదారి తల్లిని ఆగం చేసే ప్రయత్నం జరుగుతున్నది. మనం అప్రమత్తంగా ఉండాలె.
– రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే
కరీంనగర్ చైతన్యవంతమైన జిల్లా. ఇక్కడి ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించిన్రు. ఆనాడు 2001 మే 17న ఇదే రాత్రి పూట ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికపై మొదటి సభ నిర్వహించిన. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ కరీంనగర్. ఇదే గడ్డ మట్టిని బొట్టుగా పెట్టుకుని ఇక్కడి నుంచే పిడికిలెత్తి ఉద్యమం కోసం బయలుదేరిన. మీరే కథానాయకులై నన్ను ముందుకు నడిపిన్రు. ఆనాడు కేంద్ర మంత్రి పదవిని, ఎంపీ పదవిని తీసి నేలకేసి కొట్టిన. ‘రారా నా కొడుకుల్లారా’ అని కరీంనగర్ వచ్చి మళ్లీ ఎంపీగా పోటీ చేసిన. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాయలు చేసిందో, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిందో, ఎన్ని గింగిరాలు తిరిగిందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అయినా ఇది పదునైన గడ్డ అని తెలంగాణ అడ్డా అనే పద్ధతిలో మరోసారి నన్ను రెండున్నర లక్షల మెజార్టీతో ఎంపీగా గెలిపించారు. అందుకే ఇది చైతన్యంగల గడ్డ.
– అధినేత కేసీఆర్