JAGITHYAL | జగిత్యాల, మార్చి 28 : బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆరెస్ పార్టీ కార్యాలయం లో బీఆరెస్ సీనియర్ నాయకులతో కలిసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా గొంతుకగా, ప్రజల పక్షాన సభలో ప్రభుత్వంను నిలాదీశారన్నారు. పోరాట పటిమ కలిగిన పార్టీ బీఆరెస్ కాబట్టే అధికారం ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని గుర్తు చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఓ వైపు కేటీఆర్, హరీష్ లు ప్రభుత్వ వైఫల్యలపై ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తే, మండలిలో బీఆరెస్ ప్రజాప్రతినిధులు కవితక్క ఆధ్వర్యంలో వినూత్న రీతిలో హామీలపై ప్రదర్శనలు చేస్తూనే, హామీల అమలుపై ప్రశ్నించి ప్రభుత్వం ను ఉక్కిరిబిక్కిరి చేశారన్నారు. అధికార పక్షం, ప్రతి పక్షం అంటే ఏంటో, అది ఎలా ఉండాలో ఎం పని చెయ్యాలో చేసి చూపిస్తున్న ఘనత బీఆరెస్ పార్టీదేన్నారు. నీళ్లు లేక ఎండిన పొలాలు, అకాల వర్షాలతో నష్టపోయినా పంటలు, ప్రకటించిన గ్యారంటీలు, ఇచ్చిన హామీల అమలుల అంశంలో వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంను నీలదీయడంతో పాటు, పసుపు, మిర్చి పంటలకు మద్దతు ధర, నష్టపోయినా రైతులకు రూ.25 వేలు, మహిళలకు ఇస్తామన్నా మహాలక్ష్మి పథకం, స్కూటీ ఏమయ్యాయని ప్రశ్నించారు.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో అమలు చేసినవే తప్ప, కొత్త పథకాలు ప్రారంభించదని నిండు సభలో ఒప్పుకున్నారన్నారు. కాళేశ్వరంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, పెండింగ్ రియాంబర్స్ విషయంలో కూడా బీఆరెస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నించిన విషయాన్నీ గుర్తు చేశారు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ మారిన ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎక్కడ కనిపించలేదని ఆఖరికి ఆయన మాట కూడా వినిపించిన దాఖలాలు లేవన్నారు.
గ్రోక్ సంస్థ సర్వేలో సీఎం కేసీఆర్ ఉత్తమ సీఎంగా పేరు రావడం శుభపరిణామన్నారు. జగిత్యాల జిల్లాలో సమస్యలపై ఎమ్మెల్సీ లు కవిత, ఎల్ రమణలు బీర్పూర్ మండలంలోని రోళ్ళావాగు ప్రాజెక్టుకు షటర్లు బిగించాలని, కొండగట్టు అంజన్న అభివృద్ధి కి నిధులు కేటాయించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనందరావు, ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, రైతు సమన్వయ సమితి బాధ్యులు అల్లాల దామోదర్ రావు, వెంకటేశ్వర్ రావు, నాయకులు రిజ్వాన్, గంగిపెల్లి వేణు, గాజుల శ్రీనివాస్, గంగిపెల్లి శేఖర్, కోటగిరి మోహన్, అజుమ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.