వీణవంక, మే 4 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు చేరుకున్నారు. మంచిర్యాల రోడ్ షో ముగించుకొని.. రోడ్డు మార్గాన రాత్రి 11గంటల తర్వాత మండలకేంద్రానికి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసంలో బస చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోనే 20 వేల మంది పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
అందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణులతో మాట్లాడిన అనంతరం వీణవంకలో అట్టహాసంగా రోడ్షో నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడి నుంచి బయలు దేరి.. జగిత్యాలకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే రోడ్షోలో పాల్గొంటారు. నిజానికి ఈ నెల 2న జమ్మికుంటలో కేసీఆర్ రోడ్ షో జరగాలి. కానీ ఎన్నికల కమిషన్ 48 గంటలపాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించడంతో అది వాయిదా పడిన విషయం తెలిసిందే.
దీంతో జమ్మికుంటలో కాకుండా.. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోనే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. అంతేకాకుండా, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు కేసీఆర్ వస్తుండగా, యావత్ పార్టీ శ్రేణులందరినీ ఒక దగ్గరికి చేర్చి అధినేతతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు తెస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.