కరీంనగర్, మే 5 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ మళ్లీ మర్లవడ్డది. ఉద్యమం ఆగి పోలేదు. ఇది కేవలం సెట్ బ్యాక్ మాత్రమే.. తెలంగాణ పునర్మిర్మాణం చేయాల్సి ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది మనమే’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమేనని, రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలని గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని చెప్పారు. వీణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసంలో ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి వేలాది మంది ప్రజలతోపాటు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా.. కేసీఆర్ ఉద్వేగ భరితంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటలను గుర్తు చేశారు.
ఉద్యమ చివరి దశలో తాను ఢిల్లీ వెళ్తుండగా ఆంధ్రా పత్రికల వాళ్లు తనకు ఒక ప్రశ్న వేశారని, ఢిల్లీ వెళ్తున్న మీరు అక్కడ ఏం జరుగుతుందని అడిగారని గుర్తు చేశారు. దానికి తాను ఒకటే మాట చెప్పానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేను ఢిల్లీ వెళ్తున్నానని, తిరిగి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పానని, ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం, ఎంత నమ్మకం ఉండాలని అన్నారు. ఆ రోజు ప్రజల దీవెన, బలంతో అన్న ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెట్టినట్లు చెప్పారు. పదేళ్లలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో అంతా గాడి తప్పిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఇంత తొందరగా ట్రాక్ ఎలా తప్పిందని, ఇప్పుడున్న పాలకులకు ఒక పద్ధతీ పాడు లేదని విమర్శించారు.
వీళ్లకు ప్రజలపై ప్రేమ గానీ, వీళ్లకు రాష్ర్టాన్ని కాపాడాలనే ఆకాంక్ష అసలే లేదని మండిపడ్డారు. రాష్ర్టాన్ని తిరిగి బాగు చేయాల్సిన బాధ్యత మనదేనని, మళ్లీ మనం వచ్చేవరకు దీటుగా పనిచేసి రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకొని పోవాలని, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది చెప్పారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాకముందు నీళ్లు లేక, కరెంట్ లేక గందరగోళ పరిస్థితి ఉండేది. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పదేళ్లలో బ్రహ్మాండంగా చేసుకున్నాం. వ్యవసాయంపై దృష్టి సారించినం. రైతాంగానికి ధీమా కల్పించినం. చెరువులు బాగు చేసినం. 24 గంటల కరెంట్ ఇచ్చినం. సాగునీటి గోస తీర్చినం. రైతుబీమా కింద 5 లక్షలు ఇచ్చి కుటుంబాలు రోడ్డున పడకుండా చేసినం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం తెచ్చినం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎకరానికి మరో రూ.వెయ్యి పెంచుదామని అనుకున్నం. కానీ, అంతా తారుమారైంది. రైస్ మిల్లర్ల ఆగడాలు అరికట్టి పండించిన ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినం. దీంతో 54 లక్షల టన్నులు మాత్రమే పండించిన తెలంగాణ 3.5 కోట్ల టన్నులు పండించి పంజాబ్ను తలదన్నే స్థాయికి వచ్చింది.
రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆదుకున్నం. దళితబంధు తెచ్చి హుజూరాబాద్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసినం. ఇక్కడి దళితులు చాలా అదృష్టవంతులు. తెలంగాణలో ఆత్మగౌరవంతో ఉన్న దళితులు ఏ నియోజకవర్గంలో ఉన్నారంటే అది హుజూరాబాద్ అని చెప్పవచ్చు. ఈ గౌరవం కౌశిక్రెడ్డికే దక్కుతుంది. ఇప్పుడు 99 శాతం దళిత బిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతున్నరు. దీనిని ఇంకా పొడిగించాలనే ప్రయత్నం చేసినం. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినం. ఆసరా పెన్షన్లు రూ.200 నుంచి రూ.2 వేలు పెంచినం. చేనేత రంగానికి జీవం పోసినం.
మీ అందరి దయతోని కౌశిక్రెడ్డి గెలిచిండు. ఆయన పార్టీలో చేరిన రోజు ఒక విషయం చెప్పిన. నువ్వు యువకుడివి. నా కొడుకంత వయసు ఉన్నది. నీలాంటోళ్లు మంత్రులు కావాలి. కేంద్ర మంత్రులు కావాలి. మంచి భవిష్యత్తు ఉంటది. ఈరోజు బై ఎలక్షన్కు ఆరాట పడవద్దు అంటే నా మాట విని ఊరుకున్నడు. ఉద్యమ కారుడు, నాతో పాటు జైలుకు వచ్చిన గెల్లు శ్రీనివాస్ను అప్పటి ఉప ఎన్నికల్లో నిలిపినం. నేను చెప్పిన ప్రకారమే కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీ చేసినం. ఆ తర్వాత ప్రభుత్వ విప్ను చేసినం. మళ్లీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు నాకు కానుకగా ఇచ్చిన్రు.
‘తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన. 2001లో హుజూరాబాద్లో పెద్ద నాయకుడు లేకపోయినా ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకున్నరు. దాని ఫలితంగానే మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. ఇంకా ఉన్నది. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ముందున్నది. మన బాధ్యత అయిపోలేదు. పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొసముట్టేది కాదు. అసెంబ్లీ ఎన్నికలు మధ్యలో వచ్చినా, చివరలో వచ్చినా బ్రహ్మాండమైన మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది. నూటికి నూరు శాతం నాకు విశ్వాసం ఉన్నది. తెలంగాణకు ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. మనం చేయాల్సిన పనులు అనేకం ఉన్నయి.
వినోద్ కుమార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఈయన ఎంపీగా పని చేసిండు. ఇప్పుడున్న బండి సంజయ్కి అడ్డగోలుగ మాట్లాడుడు తప్ప ఇంకోటి తెలియదు. మనకు తిట్ల పురాణం ఎందుకు? ఆ పంచాయితీ ఎందుకు? విద్యావంతుడు, న్యాయవాది వినోద్ కుమార్ లాంటి వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడుతడు. మన గోదావరిని కాపాడుతడు. మన నిధుల కోసం కొట్లాడుతడు.
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి 60 వేల మందితో మీటింగ్ పెడతానని చెప్పిండు. నేను కూడా ఒప్పుకున్న. కానీ, మన బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ బదురుకొని నాపై ఫిర్యాదు చేసి 48 గంటలు ప్రచారం నిషేధించేలా చేసిన్రు. ఇదంతా ప్రజలు చూస్తున్నరు. న్యాయం గెలుస్తుంది. కౌశిక్రెడ్డి మాత్రం నన్ను వదల లేదు. మంచిర్యాల నుంచి నేరుగా నన్ను ఇక్కడికి రమ్మడంతో వచ్చిన. వినోద్కుమార్ ఎంపీగా గెలిచిన తర్వాత మరోసారి వచ్చి 24 గంటల పాటు ఇక్కడే ఉంట.
దావఖానలు బాగు చేయించినం. కేసీఆర్ కిట్లు పెట్టి నయాపైసా ఖర్చు లేకుండా ప్రసవాలు చేయించి ఇంటికాడ దించే కార్యక్రమాలను అమలు చేసినం. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఇచ్చి పంపినం. దీనివల్ల ప్రైవేట్ దవాఖానల దోపిడీ తగ్గి ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు బాగా పెరిగినయి. ఇప్పుడు ఐదు నెలల్లోనే పరిస్థితి తారుమారైంది. కేసీఆర్ కిట్లు లేవు, న్యూట్రిషన్ కిట్లు లేవు. వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితులున్నయి. ఎయిర్ కండిషన్స్ పనిచేయడం చేయక నవజాత శిశువులు ఎండకు అల్లాడుతున్నరు. అది చూసి తల్లులు గోస పడుతున్నార ని పత్రికల్లో వార్తలు వస్తున్నయి. ఆదిలాబాద్లోని రిమ్స్లో కూడా శవాల గది దుర్వాసన వస్తున్నది. అక్కడ పనిచేయాలంటే డాక్టర్లు భయపడుతున్నరు.