కరీంనగర్కు ఎప్పుడొచ్చినా అద్భుతమైన ఎమోషనల్గా స్వాగతం పలికిన్రు. ఇప్పుడు కూడా అదే అభిమానం చూపిన్రు. నాయకుల ఆధ్వర్యంలో రోడ్షో అద్భుతంగా చేసిన్రు. ఇదే ఉత్సాహంతో ఎన్నికల దాకా పనిచేయాలి. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించుకోవాలి.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
కరీంనగర్, మే 9 (నమస్తే తెలంగాణ) : సర్వే ప్రకారం బోయినపల్లి వినోద్ కుమార్ ఎనిమిది శాతం ఓట్ల అధిక్యంతో ముందంజలో ఉన్నారని, కరీంనగర్లో ఆయన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పారు. మీరందరు కూడా ఈ నెల 13వ తేదీ దాకా ఇదే చైతన్యం చూపాలని, విద్యావంతుడైన వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి కరీంనగర్లో రోడ్షో నిర్వహించారు. రాంనగర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు బస్సుయాత్రగా వచ్చారు. అనంతరం అక్కడే ప్రజలనుద్దేశించి అధినేత ప్రసంగించారు. ఉద్యమం నుంచి నేటి వరకు బీఆర్ఎస్కు అండగా నిలిచిన కరీంనగర్ గడ్డ ప్రాముఖ్యతను కొనియాడారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయకుండా.. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ను.. అలాగే, ఎన్నికలొచ్చినప్పుడల్లా ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తూ ఓట్లు దండుకుంటున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
బండి సంజయ్ గెలువడం ద్వారా కరీంనగర్కు ఏమైనా లాభం జరిగిందా? అని ప్రశ్నించారు. సంజయ్ ఒక్కనాడైనా పార్లమెంట్లో మాట్లాడిండా.. గట్టిగ మాట్లాడితే హిందా, ఇంగ్లిషా, తెలుగా అనేది మనకే అర్థం కాదని, ఇక పార్లమెంట్లో ఎవరికి అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. అదే విద్యావంతుడు, న్యాయవాది అయిన వినోద్కుమార్ను గెలిపించుకుంటే పార్లమెంట్లో స్థానిక సమస్యలను ప్రస్తావించగలుగుతాడని, కరీంనగర్ ప్రజలకు, తెలంగాణ రాష్ర్టానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇక్కడ జరిగిన స్మార్ట్ సిటీ పనులను వినోద్కుమారే సాధించారని, ప్రతి రోజు తనతో గొడవపడి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిధులు తెచ్చాడని చెప్పారు. కరీంనగర్ను తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని, ఈ అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నదని అన్నారు. కరీంనగర్ చుట్టూ నాలుగు జలధారలు ఆవిష్కరించామని, నాలుగు నెలల పాలనలో అవి మాయమయ్యాయని ఆవేదన చెందారు. తొమ్మిదేండ్లపాటు రెప్పపాటు పోకుండా కరెంటిచ్చామని, అది ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. కరీంనగరంలో రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చామని, నిత్యం నీటి సరఫరా చేశామని, కానీ, ఇప్పుడు నీళ్ల కోసం మళ్లీ బిందెలు పట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు.
ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్సేనని మండిపడ్డారు. నోటికొచ్చిన వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రధానంగా ఆరు గ్యారంటీల్లో 13 అంశాలున్నాయని, అందులో ఏమైనా మీకు అందాయా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తెలంగాణలోని ప్రతి మహిళకు 2500 ఇచ్చినట్లు చెబుతున్నారని చెప్పిన కేసీఆర్.. మీకు ఎవరికైనా 2500 వచ్చాయా? అంటూ అడిగారు. దీంతో ఏమీ రాలేదంటూ సమాధానం ఇచ్చారు. రైతుబంధు, రైతు రుణ మాఫీ, 500 బోనస్ గురించి కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. చొప్పదండిలో ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతు చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే, దళితబంధు పథకం నిలిపివేశారని, ఆటోకార్మికులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. నిత్యం అబద్ధాలు చెబుతూ.. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, అలాగే ఎన్నికలు రాగానే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న బీజేపీని ఓడించి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్ షోలో పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ ముస్లిం సోదరులను ఇప్పటికే అనేక రకాలుగా మోసం చేసినయి. ముస్లిం సోదరుల్లారా.. జాగ్రత్తా! మీరు కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. దీంతో బండి సంజయ్ లాంటి మనిషి గెలుస్తాడు. సంజయ్ గెలిస్తే కరీంనగర్ గానీ, తెలంగాణకు గానీ ఏమీ పాయిదా ఉండదు. అదే వినోద్కుమార్ సెక్యులర్ మనిషి. ఆయనను గెలిపించాలి.
కరీంనగర్ అంటే మామూలు గడ్డ కాదు. ఇది చైతన్యమైన గడ్డ. ఇక్కడి మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు ఎంతో విజ్ఞులు. నేను గులాబీ జెండాను ఎత్తినప్పుడు ఇదే గడ్డలోని ఎస్సారార్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదమిచ్చిన. కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఆ నినాదం, ఆ జెండా ఆకాశమంత ఎత్తుకు ఎగిరింది. కరీంనగర్ దీవెనలతోనే తెలంగాణ సాధించిన. ఒకనాడు తెలంగాణ వాదం బలహీనపడిందని కాంగ్రెస్ నాయకులు అన్నప్పుడు తెలంగాణ పౌరుషం చూపాలని నా పదవులకు రాజీనామా చేసిన. 2006లో జరిగిన ఉప ఎన్నికలో 2.50 లక్షల మెజార్టీ ఇచ్చి నన్ను గుండెల్లో పెట్టుకున్న గడ్డ ఇది.
వినోద్ కుమార్ మేధావి. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన విద్యావంతుడు. న్యాయ వాది. ఉద్యమ సమయం నుంచి నాతోపాటు కలిసి నడిచిన నాయకుడు. ఈ ప్రాంత సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి. స్మార్ట్ సిటీ సాధించడానికి.. నాపై ఒత్తిడి తెచ్చిన నాయకుడు. అంతేకాదు, పార్లమెంట్లో అంశం ఏదైనా అనర్గళంగా మాట్లాడే సత్తా సామర్థ్యం ఉన్న వినోద్కుమార్ను గెలిపించడం వల్ల ఈ ప్రాంతానికే కాదు.. తెలంగాణకు న్యాయం జరుగుతుంది. అందుకే చైతన్యం మూర్తీభవించిన గడ్డ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ముఖ్యంగా యువత అన్ని రకాలుగా ఆలోచించాలి. మంచి వాళ్లకు ఓటేస్తే మంచి జరుగుతది. ఆషామాషీగా తీసుకోవద్దు. అడ్డిగుడ్డిగా ఓటేస్తే దెబ్బతింటం.
మోడీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదు. 150 హామీలు ఇచ్చిండు. ఏ ఒక్కటైనా అమలు చేసిండా? సబ్కా సాత్.. సబ్కా వికాస్ జరిగిందా? సబ్ కా సత్తెనాస్ జరిగింది. డీజిల్, పెట్రోల్ ధర పెరిగింది. ధరలు పెరిగినయి. అచ్చేదిన్ కాదు.. ప్రజలు సచ్చేదిన్ వచ్చింది. వికసిత్ భారత్, విఫల భారత్ అయింది. పదేళ్ల క్రితం ఎన్నికలప్పుడు మోడీ ఒక మాట చెప్పిండు. మీరు నన్ను, బీజేపీని గెలిపిస్తే విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తా అన్నడు. మరీ కరీంనగర్లో రూ.30 లక్షలు వచ్చాయటా! వచ్చినయా? బండి సంజయ్ తెచ్చిచ్చిండట కదా! 15 లక్షలు లేదు, 30 లక్షలు లేదు. అంతా గ్యాస్.. ట్రాష్! ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదు. బీజేపీ ఎజెండా లో పేదల మాట ఉండదు. కార్పొరేట్ల కోసం రూ.15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసిండు గానీ, రైతులకు రూపాయి ఇవ్వలేదు. ఎవరికీ కూడా మేలు జరగలేదు. మోడీ చేసే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ను నమ్మద్దు. యువకులు, విద్యార్థులు, మేధావులు, రచయితలు ఆలోచించాలి.