ఇల్లంతకుంట, మే 3 : కేంద్రంలో బీజేపీ పది సంవత్సరాలు పాలనలో చేసిందేమీలేదని, దేవుడి పేరు చెప్పుకుని ఓట్ల రాజకీయం చేస్తున్నదని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ని గెలిపిస్తే ఐదేళ్లు ఏ గ్రామానికి రాలేదని, ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా ఏ పనీ చేయలేదన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ర్టాన్ని గోదావరి జలాలతో సశ్యశ్యామలం చేస్తే రైతులు భూమికి బరువయ్యేలా పంటలు పండించుకుని సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన మరుసటి రోజు నుంచే కాళేశ్వరం నీటిని వదిలేసి ప్రాజెక్టులను పూర్తిగా నీరు లేకుండా చేసిందన్నారు. రైతులు పందేండ్లల్లో ఎంతో పంటలు పండించుకున్న వారు ఈ యాసంగిలో సాగునీరు లేక చేతికి అందే దశలో పంటలు ఎండి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారన్నారు. మరికొందరు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ ఎంపీలు తప్పకుండా కేంద్రంలో ఉండాలని బీఆర్ఎస్ అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ర్టానికే నీళ్లు ఇచ్చే ఇల్లంతకుంట మండలంలో ఉన్న రెండు ప్రాజెక్టులను నీళ్లు లేకుండా చేసి రైతులకు కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ కలిగించిందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లా డుతూ, వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ప్రశ్నించే గొంతును కాపాడుకోవాలన్నారు. మండలంలో రెండు ప్రాజెక్టులు ఉండి కూడా రైతుల పంటలు ఎండి పోతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ, మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అసమర్థత ఎంతుందో ప్రజలు గమనించాలన్నారు.
ప్రాజెక్టులు కాళేశ్వరం జలాలతో మళ్లీ నిండు కుండలా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలువాలన్నారు. మండలంలో జరిగే ప్రచార సభకు మండల ప్రజలు భారీగా తరలి వచ్చారు. కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణ, వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గడ్డం నాగరాజు, గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహా రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు తిరుపతి రెడ్డి, అనంతరెడ్డి, వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.