ఎల్కతుర్తి, ఏప్రిల్ 19: కాంగ్రెస్ సర్కారు రుణమాఫీని ఎగ్గొట్టేందుకు సాకులు వెతుకుతున్నదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఆగస్టు 15లోగా రుణమాఫీ అంటున్నారని, ఆ తర్వాత జనవరి 26 అంటారని ఎద్దేవా చేశారు. వరి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేశారని విమర్శించారు. బీఆర్ఎస్తోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, పార్లమెంట్లో ప్రజల గొంతుక వినిపించేది గులాబీ పార్టీనేనని స్పష్టం చేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావుతో కలిసి ఎల్కతుర్తిలో రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను వినోద్ ఎండగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదులపై ఏర్పడ్డదని విమర్శించారు. మేడిగడ్డ కింద 5వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతుంటే చోద్యం చూస్తున్నదని నిలదీశారు. రైతులు బాగుపడడం కాంగ్రెస్కు ఇష్టం లేదని, అందుకే దేవాదుల నుంచి నీటిని పంపింగ్ చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ కేసులతో ప్రతిపక్షాలను లొంగదీసుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిన ప్రధాని మోదీ మాటలు నీటి మూటలయ్యాయన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే ఎల్కతుర్తి మీదుగా జాతీయ రహదారులను మంజూరు చేయించానని గుర్తు చేశారు.
నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేశానని చెప్పారు. కరీంనగర్ను స్మార్ట్సిటీ జాబితాలో చేర్పించి అభివృద్ధికి వెయ్యి కోట్లు తెచ్చానని చెప్పారు. 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అనుమతులు మంజూరు చేయించానని, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు రైలు మార్గం కోసం కృషి చేశానని తెలిపారు. 24ఏండ్ల నుంచి తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన నిలబడాలని ప్రజలను కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగునీరులేని, కరెంట్లేని మార్పును చూసి ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన చెందారు.
పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినిపించాలంటే తప్పకుండా ప్రజలంతా వినోద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, బండి సంజయ్ ప్రజల మనోభావాలతో రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. వినోద్కుమార్ను గెలిపిస్తే ప్రజల అభివృద్ధికి పాటుపడుతారని తెలిపారు. ఈ రోడ్ షోలో బీఆర్ఎస్ హుజూరాబాద్ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.