కార్పొరేషన్, ఏప్రిల్ 7: ఎన్నికల్లో తనను గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవకుడిలా పని చేస్తానని, ఇక్కడి సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక 9వ డివిజన్లోని కోతిరాంపూర్లో మార్నింగ్ వాక్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. స్థానికంగా ఉన్న పోచమ్మ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. దీనికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి హాజరైన వినోద్కుమార్ మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో ఎంపీగా ఓటమి చెందినా కరీంనగర్లోనే ఉంటూ ప్రజలకు సేవకుడిలా పని చేస్తున్నానని గుర్తు చేశారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానన్నారు.
కానీ, బండి సంజయ్ ఎంపీగా గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు. అలాగే ఏ రోజు కూడా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని, కేవలం వారి పార్టీ కోసమే పని చేశారని ఆరోపించారు. 3లక్షల జనాభా ఉన్న కరీంనగర్ను స్మార్ట్ సిటీ చేయడం కష్టమని కేంద్ర పెద్దలు చెప్పినప్పటికీ పట్టుబట్టి అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు దగ్గరకు వెళ్లి, స్మార్ట్ సిటీ పథకం కింద రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంతో పోటీ పడేలా కరీంనగర్ను అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపామన్నారు.
ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి నయాపైసా నిధులు తేలేదని, కరీంనగర్కు మంజూరైన ట్రిపుల్ ఐటీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయినా చేతులు ముడుచుకుని ఉన్నారని విమర్శించారు. పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ ఒక గుడికి కూడా నిధులు తేలేదన్నారు. కరీంనగర్ ఎంపీగా 2014 నుంచి 2019 వరకు రైల్వేలైన్ తీసుకురావడంతో పాటు, జాతీయ రహదారులను మంజూరు చేయించానని తెలిపారు. కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.25 కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు. ఈ సారి ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరీంనగర్లో అభివృద్ధి కొనసాగాలంటే వినోద్కుమార్ ఎంపీగా ఉండాలన్నారు. అప్పుడే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. నగర అభివృద్ధిలో వినోద్కుమార్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఇతర పార్టీలు చెప్పే అబద్ధాలను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ ఐలేందర్యాదవ్, బండారి వేణు, నాయకులు గందె మహేశ్, ప్రభావతి, కలర్ సత్తన్న, బండ వేణు, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఏప్రిల్ 7 : భారతదేశం ఒక గొప్ప సెక్యూలర్ భావాలు ఉన్న దేశమని, ఇంత గొప్ప రాజ్యాంగంలో బతకడం తనకు గర్వంగా ఉందని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. చింతకుంట గ్రామంలో ఆదివారం ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
హిందూ, ముస్లింలు సోదరభావంతో ఉండి పండుగలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్లో యువత కోసం సిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయించి విదేశాలకు వెళ్లినా అక్కడ ఉద్యోగాలు సాధించేలా వారిని తీర్చిదిద్దుతామన్నారు. ఇఫ్తార్ విందులో మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు జమీలుద్దీన్, వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతినాయక్, మైనార్టీ మండలాధ్యక్షుడు చాంద్ పాషా, మాజీ వార్డు సభ్యులు నజీమా, మైనారిటీ నాయకులు సలీం, అన్వర్, నఫీజా, సిద్దిక్ పాల్గొన్నారు.