మల్యాల, నవంబర్ 10: ‘ప్రజలారా..? జాగ్రత్తగా ఉండండి. మనల్ని 60ఏండ్లు గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తంది. దొంగహామీలు ఇస్తూ, అసత్య ప్రచారం చేస్తూ మిమ్మల్ని మభ్య పెడుతోంది. ఆ పార్టీ వస్తే మళ్లీ కష్టాలే. పాత కథే అవుతుంది. మన పథకాలన్నీ బందైపోతయి. కరెంట్ కష్టాలు మళ్లీ మొదలైతయి. రైతు బంధు ఆగిపోతది. వాళ్లను నమ్మొద్దు’ అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ సూచించారు. ‘రైతన్నను ఆదుకునేందుకు ఇస్తున్న రైతుబంధును దండుగ అని అని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అంటున్నడు. ఇంకా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటే చాలంటున్నడు.. వీళ్లంత దుర్మార్గులు ఎక్కడైనా ఉన్నరా..? రైతులు సంతోషంగా ఉంటే కండ్లుమండించుకుంటున్నరు. నేనొక్కొటే చెబుతున్నా.. కష్టాలు పెట్టే కాంగ్రెస్ కావాలా..? 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి, పంటకు పెట్టుబడి సాయం ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? మీరే ఆలోచించుకోవాలని’ సూచించారు. ‘
నేను మీ బిడ్డను. ఇక్కడే ఉంటా. మీ కష్టాల్లో తోడుంటా. మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని’ కోరారు. శుక్రవారం మల్యాల మండలం నూకపల్లి, రామన్నపేట, మద్టుట్ల, గొర్రెగుండం, గొల్లపల్లె గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పదేండ్ల క్రితం తెలంగాణలోని పరిస్థితులకి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఘననీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. నాడు కరవు మండలాల జాబితాలో మల్యాల, కొడిమ్యాల, గంగధర మండలాలే ముందు వరుసలో ఉండేవని, కానీ నేడు ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు నీటి పంపింగ్, ఎస్సారెస్పీ పునర్జీవ పంప్హౌస్ నిర్మాణం, వరుదకాలువకు తూములు పెట్టి చెరువులను నింపడం ద్వారా చొప్పదండి నియోజకవర్గమే కోనసీమలా మారిందని సంతోషం వ్యక్తం చేశారు.
సబ్బండవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ కావాలో.. ఢిల్లీ గులాంలు అయిన కాంగ్రెస్, బీజేపీలు కావాలో.. ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగం శ్రీనివాస్, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, జడ్పీ కోఆప్షన్ సుభాన్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు మిట్టపల్లి సుదర్శన్, సహకార సంఘాల అధ్యక్షులు ముత్యాల రాంలింగారెడ్డి, అయిల్నేని సాగర్రావు, బోయినిపల్లి మధుసూదన్రావు, వైస్ ఎంపీపీ పోతాని రవి, సర్పంచ్లు బద్దం తిరుపతిరెడ్డి, గడ్డం జలజ-మల్లారెడ్డి, సుంకె లచ్చయ్య, మొత్కు యాదమ్మ-కొమురయ్య, బద్దం తిరుపతి, నాయకులు మారంపల్లి నారాయణ, జోగినిపల్లి శ్రీనివాస్గౌడ్, బొంకూరి వేణురావు, కమఠం గంగారాజం, క్యాతం భూపతిరెడ్డి, పోచమ్మల ప్రవీన్కుమార్, వరున్రావు, మహ్మద్ అజహర్, రియాజ్ అహ్మద్, కేతిరెడ్డి తిరుపతిరెడ్డి, తీపిరెడ్డి తిరుపతి, అన్నపు తిరుపతి, శేఖర్, కర్భూజ చంద్రశేఖర్, చాప మహేశ్ పాల్గొన్నారు.
రామన్నపేటలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పోచమ్మల సాత్విక్ అనే ఇంటర్ విద్యార్థి తాను పోగు చేసుకున్న కిడ్డీ బ్యాంక్ డబ్బు రూ.40 వేలను ఎమ్మెల్యేకు ఎన్నికల ఖర్చు కింద అందజేశారు. ఈ సందర్భంగా తనకు ఆర్థికంగా విరాళం అందజేసిన యువకుడిని రవిశంకర్ అభినందించారు.