జమ్మికుంట, జనవరి 25: ‘కాంగ్రెస్ అవిశ్వాసాల పేరిట ఇబ్బందులు పెట్టింది. కానీ దాన్ని మేం తిప్పికొట్టినం. మరోసారి జమ్మికుంట మున్సిపల్పై గులాబీ జెండా ఎగురవేసినం’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలుకుతూనే.. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించారని, సీఎంగా రాష్ర్టాన్ని గొప్పగా తీర్చిదిద్దారని, దేశంలోనే నంబర్వన్గా చేశారని, కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని కొనియాడారు. గురువారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిన తర్వాత జమ్మికుంట పట్టణానికి వచ్చారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు నివాసంలో స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్లు రాష్ర్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. 200 పింఛన్ను 3వేలకు పెంచారని, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్హౌస్ పేరులో కేసీఆర్ ఉందన్న సాకుతో గెస్ట్హౌస్ పేరు మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ అని, పేరు మార్చితే పోయేది కాదని స్పష్టం చేశారు. 200 యూనిట్లలోపు కరెంటు బిల్లులు చెల్లించవద్దని, కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ఆ పార్టీ, ఇప్పటి వరకు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. రైతుబంధుపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
రైతులను చెప్పుతో కొడుతానని మాట్లాడిన మంత్రి, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను అవమానించడం తగదని హితవు పలికారు. జమ్మికుంట మున్సిపల్లో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లాపడ్డదని, అవిశ్వాసంలో 28 మంది కౌన్సిలర్లు మా వెంటే ఉన్నారని చెప్పారు. కౌన్సిలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అవిశ్వాసం వీగిపోయేలా పాటుపడ్డ ప్రతి కౌన్సిలర్కు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదని, ప్రజలను ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వెంటే ప్రజలున్నారని చెప్పారు. సమావేశంలో నాయకులు రాజ్కుమార్, తిరుపతిరెడ్డి, భాస్కర్రెడ్డి, వెంకటేశ్, సత్యనారాయణరావు, సమ్మారావు, మనోహర్రావు, రమేశ్, లింగారావు, కుమారస్వామి, దిలీప్, జేకే, తదితరులున్నారు.