కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బోయినపల్లి వినోద్కుమార్ గెలిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. పార్లమెంట్లో ప్రశ్నించే ఆ గొంతుకకు పట్టం కడుదాం. ఆయన విజయం సాధిస్తేనే కరీంనగర్ మరింత అభివృద్ధి చెందుతుంది. కేంద్రంలో ఏప్రభుత్వమున్నా కొట్లాడి నిధులు తెస్తడు. ఒక్కసారి ఎంపీగా ఉన్నప్పుడే అనేక నిధులు తెచ్చిండు. మరోసారి గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తడు. కరీంనగర్లో వినోద్కుమార్ గెలవకుండా చేసేందుకు కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఇప్పటి వరకు ఈ సీటుకు అభ్యర్థిని డిక్లేర్ చేయలేదు. అనేక స్థానాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా బీజేపీని గెలిపించే ప్రయత్నాల్లో ఉన్నది.
– కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు
కరీంనగర్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ)/ కార్పొరేషన్ : ప్రశ్నించే గొంతు వినోద్కుమార్ను గెలిపించుకుంటేనే కరీంనగర్ మరింత అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. మరోసారి ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో ఆయన, అసెంబ్లీలో గంగుల కమలాకర్ కరీంనగర్ వాణిని వినిపించి నిధులు సాధిస్తారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై కరీంనగర్లో వినోద్కుమార్ను ఓడించాలని చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంలో తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్లోని మంకమ్మతోటలో భారీ ర్యాలీ తీసి, రాంనగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, మేయర్ వై సునీల్రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్తో కలిసి ఆయన మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నగర ప్రజలు బ్రహ్మరథం పట్టగా, మంకమ్మతోట నుంచి రాంనగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. దారిపొడవునా నినాదాలు, నృత్యం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా హరీశ్రావు ప్రసంగించారు. వినోద్కుమార్ మొదటిసారి గెలిచినప్పుడు పార్లమెంట్లో తెలంగాణ కోసం పోరాడి అన్ని పార్టీల మద్దతు కూడగట్టారని హరీశ్రావు గుర్తు చేశారు. రెండోసారి కరీంనగర్ నుంచి గెలిచినప్పుడు ఒక్క కరీంనగర్ కోసమే కాకుండా తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో గళమెత్తారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు సాధించారని చెప్పారు.
2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచినప్పుడు కొత్తపల్లి -మనోహరాబాద్ రైల్వే లైన్ సాధించారని, పలు జాతీయ రహదారులకు నిధులు తెచ్చారని వివరించారు. అర్హత లేకున్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కరీంనగర్కు స్మార్ట్ సిటీలో స్థానం కల్పించారని, రూ.వెయ్యి కోట్లు సాధించి రాష్ట్రంలోనే కరీంనగర్ను రెండో నగరంగా అభివృద్ధి చేశారని తెలిపారు. తాను చిన్నతనంలో ఇక్కడే ఉండి చదువుకున్నానని, అప్పటి కరీంనగర్కు ఇప్పటికి ఎంతో వ్యత్యాసం ఉన్నదని అన్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద అనేక పనులను ప్రతిపాదించారని, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ వాటిని సాధించలేక పోయారన్నారు. ఇప్పుడు వినోద్కుమార్ను గెలిపించుకుంటే ఈ పనులన్నీ సాధించి పెడతారని హామీ ఇచ్చారు.
పేదల కోసం పథకాలు తేవాలని కోరితే ఇక్కడి ఎంపీ బండి సంజయ్ మాత్రం ఇంటింటికీ చిత్ర పటాలు పంపిణీ చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం, కరీంనగర్ అభివృద్ధి కోసం వినోద్కుమార్ 106 సార్లు పార్లమెంట్లో తన గొంతు వినిపించి అనేక నిధులు సాధించారని, ఇప్పటి ఎంపీ సంజయ్ ఎన్నడన్నా ఆయన హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడారా? అని ప్రశ్నించారు. అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో జై తెలంగాణ అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడా? అని ప్రశ్నించిన హరీశ్రావు ఉద్యమ సమయంలో తుపాకీ పట్టుకుని కరీంనగర్ మీటింగ్కు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎవడురా తెలంగాణ అనేదని తొడగొట్టిన వ్యక్తి దురదృష్టవశాత్తు సీఎం అయ్యారని తెలిపారు. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసినప్పుడే అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు చురకలు పెట్టాలని, లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకున్నా తమకు ప్రజలు ఓటు వేశారని, వాటిని అమలు చేయకుండానే కాలం గడిపేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ మేయర్ రవీందర్సింగ్, వీర్ల వెంకటేశ్వర్రావు, నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, నగర కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నేను ఎంపీగా తెలంగాణ ఉద్యమంలో నావంతు పాత్ర పోషించా. అర్హత లేకున్నా కొట్లాడి కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా తీసుకువచ్చి వెయ్యి కోట్లు మంజూరు చేయించా. ఇప్పటికే 700 కోట్ల మేరకు పనులు సాగుతున్నాయి. ఇంకా పనులు జరగాల్సి ఉన్నది. నేను కరీంనగర్కు ట్రిపుల్ ఐటీ తెచ్చేందుకు ఎంతో కృషి చేస్తే.. ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పూర్తిగా మరిచిపోయారు. మేమెప్పుడూ కరీంనగర్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని ఆలోచనలు చేశాం. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తీసుకువచ్చాం. సంజయ్ కరీంనగర్ అభివృద్ధి కోసం ఆరాటపడ్డారా..? ఉంటే నిరూపించాలి.
చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి చూపాలి. కానీ, ఆయనకు కరీంనగర్ అభివృద్ధిపై సంజయ్కి ఇసుమంత కూడా ఆలోచన లేదు. కేవలం రాజ్యాధికారం ఆలోచనే ఉన్నది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే పునరావాస కేంద్రంగా ఎంపీగా పోటీ చేస్తారా..? సంజయ్ ఒక బడి, గుడి తీసుకురాలేదు. కానీ, నేను ఓడిపోయినా నగరానికి టీటీడీ నుంచి 50 కోట్లతో వేంకటేశ్వర, ఇస్కాన్ దేవాలయాలను తీసుకువచ్చా. కొండగట్టు కోసం 333 ఎకరాలను ప్రభుత్వం నుంచి కేటాయించే విధంగా కృషి చేశాం.
బీజేపీ నాయకులు ఎంత సేపూ పచ్చి అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. తీగలగుట్టపల్లి వద్ద ఆర్వోబీని మంజూరు చేసేందుకు మేమే కృషి చేశాం. పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపించండి. కరీంనగర్కు అంతర్జాతీయ సిల్క్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకువచ్చేందుకు కృషి చేస్తా.
– బోయినపల్లి వినోద్కుమార్, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆగమాగం చేస్తున్నది. కేసీఆర్ పాలనలో కరీంనగర్ను రాష్ట్రంలోనే రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశాం. అర్హత లేకున్నా కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా తీసుకువచ్చిన ఘనత వినోద్కుమార్దే. రూ.వేల కోట్లతో నగరంలో చేపట్టిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తున్నది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే గొంతుక ఉంటేనే నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. పదేళ్లలో నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా వినోద్కుమార్ సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ కోసం ప్రశ్నించే అవకాశం లేదు.
తెలంగాణ సంక్షేమం కోసం ప్రశ్నించేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. కేసీఆర్ పాలనలో ఏ రోజైనా మహిళలు నీళ్ల కోసం రోడ్లపైకి వచ్చిన దాఖలాలు ఉన్నాయా..? కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలోనే సాగు, తాగునీటి కోసం రోడ్లెక్కే దుస్థితి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్కు ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు లేదు. వినోద్కుమార్ను గెలిపిస్తే నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కనిపిస్తున్నది.
– గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే