కార్పొరేషన్, మార్చి 14: బీఆర్ఎస్ కదనభేరి సభ సక్సెస్తో ఎంపీ బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకున్నదని, జన ప్రభంజనాన్ని చూసి గుండెల్లో దడ మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత బండి సంజయ్కి లేదని ఎద్దేవా చేశారు. సభలో వినోద్కుమార్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏదేదో మాట్లాడుతున్నాడని, బీఆర్ఎస్పై అవాకులు, చెవాకులు పేలుతున్నాడని దుయ్యబట్టారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో గురువారం ఆయన జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మెడికల్ కళాశాలకు అనుమతులెవరు ఇస్తారో కూడా తెలియని అజ్ఞాని సంజయ్ అని విమర్శించారు. మెడికల్ కళాశాలకు ఎంసీఐ పర్మిషన్ ఇస్తుందని, అందులో కేంద్రం చేసిందేమిటని ప్రశ్నించారు. కళాశాలల కోసం ఒక్క రూపాయి అయినా తీసుకువచ్చావా..? అని ప్రశ్నించారు.
బండి సంజయ్ అబద్ధాల పుట్ట అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇక నుంచి కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. ఈ ఐదేండ్లలో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. హిందుత్వం పేరిట ఓట్లు దండుకోవడం తప్ప కొండగట్టు, వేములవాడ ఆలయాలు, హిందువుల అభ్యున్నతికి ఆయన చేసిందేమి లేదని మండిపడ్డారు. అవినీతితో వేల కోట్లు సంపాదించడంతోనే సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారని ఆరోపించారు.
సంజయ్ ఈ ఐదేండ్లలో చేసిందేమీ లేదని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ విమర్శించారు. ఇంటింటికీ రామాలయ ఫొటోలు పంచుతున్న సంజయ్, కరీంనగర్ జిల్లాలోని ఏకైక రామాలయం ఇల్లందకుంటకు ఎప్పుడైనా వచ్చావా..? ఏమైనా నిధులు ఇచ్చావా..? అని ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ని నమ్మే పరిస్థితిలో లేరని, ఆయన ఓటమి ఎప్పుడో ఖాయమైపోయిందన్నారు.
ఎంపీగా ఉన్న బండి సంజయ్ నగరానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మేయర్ యాదగిరి సునీల్రావు సవాల్ చేశారు. స్మార్ట్సిటీ సాధన, నిధులు మంజూరులో సంజయ్కి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నగరపాలక సంస్థకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చావా..? అని నిలదీశారు. వినోద్కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి 70 కోట్లు, రాష్ట్రం నుంచి 69 కోట్లు మంజూరు చేయించడం వల్లే నగరంలో రోజూ మంచినీటి సరఫరా జరుగుతున్నదని వివరించారు.
అభివృద్ధి, ప్రజల సమస్యలను బండి ఏనాడో గాలికొదిలేశారని, ఎంత సేపు విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఆయన చేసిందేమీ లేదు కాబట్టే.. తాము అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వినోద్కుమార్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, నాయకులు దూలం సంపత్, చేతి చంద్రశేఖర్, రవి పాల్గొన్నారు.