RS Praveen Kumar | మెట్పల్లి, జూలై10 : మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తేనే తప్ప రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడదని బీఆర్ఎస్ నాయకులు, గురుకులాల సొసైటీ రాష్ట్ర మాజీ కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం మెట్పల్లి పట్టణ శివారులోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థినుల సంఖ్య, వసతులు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడి సమస తెలుసుకున్నారు. చదువుతోనే మంచి భవిష్యత్ ఉంటుందని ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి అనవసరమైన వాటితో కాలయాపన చేస్తూ పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రధానంగా విద్యావ్యవస్థ కుదేలైపోయిందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు నిర్మూలించే కార్యక్రమాల్లో భాగంగానే విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. అణగారిన వర్గాలకు చెందిన పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప ఆలోచనతో దేశం గర్వించే విధంగా కేసీఆర్ 660 గురుకులాలను ఏర్పాటు కొనియాడారు. అదే విధంగా రెండు దఫాలుగా 17వేల ఉద్యోగాలను గురుకులాల్లో నియమించడం జరిగిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అనేక చోట్ల గురుకులాలకు సొంత భవనాలు లేవని, స్థలాలు ఉన్నా భవనాలు నిర్మించడం లేదు, వసతులు కల్పించడం లేదన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూళ్లను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ అందుకు అవసరమైన కార్యచరణ లేదని, సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో 2560 మంది విద్యార్థులను ఒకే చోట స్కూల్లో ఏర్పాటు చేసి చదివిస్తానన్న మాట ఆరు నెలలు అవుతున్నా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. ఇంజినీరింగ్ తదితర విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల చదువు పూర్తైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు.