‘హుస్నాబాద్ మీద నాకు సెంటిమెంట్ ఉన్నది. తొలి సభ ఇక్కడి నుంచే ప్రారంభించాం. ఇక్కడ అడుగుపెట్టి ఎక్కడ అడుగుపెట్టినా ఘన విజయమే తప్పా నాకు ఓటమి ఎదురు రాలేదు. అందుకే మీ ఆశీర్వాదం తీసుకుని నేను యుద్ధానికి బయలు దేరుతున్నా. తప్పకుండా మనమే గెలుస్తాం. బంగారు తెలంగాణ సాధిస్తాం’
– 2018 సెప్టెంబర్ 7న హుస్నాబాద్ గడ్డపై నిర్వహించిన మొదటి సభలోముఖ్యమంత్రి కేసీఆర్
తనకు కలిసొచ్చిన ఉద్యమాల గడ్డ హుస్నాబాద్ నుంచే బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. 2014, 2018 ఎలక్షన్లప్పుడు ఇక్కడి నుంచే ప్రచార సభలకు శ్రీకారం చుట్టి ఘన విజయం అందుకోగా, ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్తో హ్యాట్రిక్ సొంతం చేసుకునేందుకు సమరభేరి మోగించబోతున్నారు. నేడు ప్రజా ఆశీర్వాద సభ పేరిట ప్రచారం ప్రారంభించనుండగా, విజయవంతం కోసం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి భారీగా జన సమీకరణ చేయనున్నారు.
ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సభ నిర్వహించనుండగా, అందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు.
కరీంనగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాటి పూర్వపు కరీంనగర్ జిల్లా, నేటి సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ ఉద్యమాలు, మరెన్నో విప్లవ పోరాటాలకు ఊపిరిలూదిన గడ్డ. దీంతోపాటు బీఆర్ఎస్కు కలిసి వచ్చిన ప్రాంతం ఇది. పార్టీ ఆవిర్భావం నుంచి అడుగడుగునా అండగా నిలిచిన హుస్నాబాద్ ప్రజలు, ఆ తర్వాత కూడా గులాబీ పార్టీని గుండెల్లో నింపుకొని అపూర్వ విజయాలను అందిస్తున్నారు. అందుకే ఈ గడ్డపై నుంచే ప్రచారం మొదలు పెడితే విజయాలే తప్ప అపజయాలు ఉండవని కేసీఆర్ బాగా విశ్వసిస్తున్నారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ వేదికగా ప్రచారం ప్రారంభించి ఘన విజయం అందుకున్న, ఈ సారి కూడా ఇక్కడి నుంచే సమరభేరి మోగించబోతున్నారు. ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలో స్వయంగా కేసీఆర్ చెప్పారు. ‘హుస్నాబాద్లో అడుగుపెట్టి ఎక్కడ అడుగుపెట్టినా.. ఘన విజయమే తప్పా నాకు ఓటమి రాలేదు. అందుకే మీ ఆశీర్వాదం తీసుకుని నేను యుద్ధానికి బయలు దేరుతున్నా. తప్పకుండా మనమే గెలుస్తాం’ అని 2018లో జరిగిన మొదటి సభలో చెప్పినట్టుగానే, 88 స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ సారి వంద సీట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతూ.. మరోసారి ఇక్కడి నుంచే ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టింది.
నేడు హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తొలి విడతగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 9వరకు అంటే 17 రోజుల్లో 42 నియోజకవర్గాలను చుట్టిరానున్నారు. కాగా, వచ్చే నెల 7లోపు పూర్వ కరీంనగర్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభలకు హాజరుకానున్నారు. ఆదివారం హుస్నాబాద్, 17న సిరిసిల్ల, వచ్చేనెల 2న ధర్మపురి, 3న కోరుట్ల, 7న మంథని, పెద్దపల్లి నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
తెలంగాణ రాకముందు వేలాది టీఎంసీల కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయేవి. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టులను కట్టి తాగు, సాగునీటి గోసను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. ఆరున్నర దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని పదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు. గోదావరి నదిపై కేవలం పోచంపాడు ప్రాజెక్టు మాత్రమే ఉండేది. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే నదిపై ఆరు ప్రాజెక్టులను నిర్మించి పాతాళంలో ఉన్న గోదారమ్మను పైకి తెచ్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్. ఎడారి జిల్లాలను పచ్చని జిల్లాలుగా మార్చడం, పుష్కలంగా పంటలు పండించుకునే అవకాశం కల్పించారు. విద్య, వైద్య రంగాల్లోనూ రాష్ట్రం నంబర్వన్గా నిలిచింది. మూడోసారి కేసీఆర్ను సీఎంగా చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. హుస్నాబాద్లో జరగనున్న తొలి ప్రజా ఆశీర్వాదసభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. లక్ష మందితో సభను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థుల సమావేశంలో బీఫామ్లు అందజేసి అనంతరం సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటిస్తారు.
– బోయినపల్లి వినోద్కుమార్,
అధినేత కేసీఆర్ సభలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో నిర్వహించే మొదటి సభకు భారీ జన సమీకరణ చేయడం కోసం దిశానిర్దేశం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉండనుండగా, శనివారం స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే సతీశ్కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి లక్షకు పైగా జనాన్ని సభకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ నుంచి హుస్నాబాద్ వరకు వెయ్యి మంది పాదయాత్రగా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు.
స్వరాష్ట్రం సాధించిన తర్వాత 2014లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2014 ఏప్రిల్ 17న కేసీఆర్ తొలి ఎన్నికల ప్రచార సభను హుస్నాబాద్ గడ్డ నుంచే ప్రారంభించి, ఘన విజయం అందుకున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చినా ప్రజలు బీఆర్ఎస్వైపు నిలువడంతో అప్పటి ఎన్నికల్లో 63 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు విసిరిన సవాల్ను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ ముందుకొచ్చి 2018 సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 7న హుస్నాబాద్ గడ్డపై శంఖారావం పూరించారు. ప్రజా ఆశీర్వాద సభ పేరిట నిర్వహిచిన ఈ సభకు వేలాది మంది బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపగా, గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ స్ఫూర్తి ఆనాటి ప్రతి సభలోనూ కనిపించింది. దీంతో అప్పటి ఎన్నికల్లో 88 స్థానాలతో తన జైత్రయాత్రను కొనసాగించి, రెండోసారి అధికారంలోకి వచ్చింది.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ వేదికగా ప్రచారం ప్రారంభించి, ఘన విజయం అందుకున్న అధినేత కేసీఆర్, మూడోసారి కూడా ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా అన్ని పార్టీల కంటే ముందే ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దింపారు. ఈ సారి హ్యాట్రిక్ కొట్టడమే కాదు, వందకు పైగా సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే తనకు అన్ని విధాలా కలిసొచ్చిన హుస్నాబాద్ గడ్డ నుంచే మరోసారి సమరశంఖం పూరించబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రజా ఆశీర్వాద సభకు హాజరై, ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఇతర విషయాలపై సర్వాత్ర చర్చ జరుగుతోంది. కాగా 2018 హుస్నాబాద్లో జరిగిన సభలోనే.. ముఖ్యమంత్రి కాంగ్రెస్ తీరును అనాడే ఎండగట్టారు. నిజానికి అనాటికి ఈనాటికి కాంగ్రెస్లో ఏమార్పులేదన్న స్పష్టం.
1. హుస్నాబాద్, అక్కన్నపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేర్ మండలాల నుంచి వచ్చే వాహనదారులు కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో,సెయింట్ జోసెఫ్ స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో వాహనాలు పార్కింగ్ చేసుకొని సభాస్థలికి చేరుకోవాలి.
2. కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మండలాల నుంచి వచ్చే వాహనదారులు కరీంనగర్ రోడ్డు ఇండియన పెట్రోల్బంకు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేసుకోవాలి.
హుస్నాబాద్-కరీంనగర్, కరీంనగర్ -హుస్నాబాద్ వెళ్లే దారి ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. ప్రజలు, వాహనదారులు ఇట్టి విషయాన్ని గమనించాలి. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహన దారులు నాగారం, మహ్మదాపూర్, బొమ్మనపల్లి, సుందరగిరి నుంచి కరీంనగర్కు వెళ్లాలి. కరీంనగర్ నుంచి తిరిగి ఇదే దారిలో రావాల్సి ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుంది. పదేండ్ల పాటు ప్రజారంజక పాలన అందించిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను ప్రకటిస్తారు. హుస్నాబాద్లో మూడోసారి కూడా ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించడం హర్షణీయం. సభను విజయవంతం చేసేందుకు పార్టీ క్యాడర్ నిరంతరంగా పనిచేస్తున్నది. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇక్కడి అభివృద్ధి ఎలా కనబడుతుంది? ఇప్పటికే నియోజకవర్గంలో 68వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నాం. గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేశాం. హుస్నాబాద్ పట్టణాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే మూడోసారి గులాబీ జెండాను నిలబెడుతుంది.
– వొడితెల సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
కెప్టెన్ లక్ష్మీకాంతారావు నాకు స్వయంగా పెద్దన్నలాంటి వారు. మేం తెలంగాణ బిడ్డలుగా ఉద్యమం పొడవునా కలిసి పనిచేస్తున్నాం. తెలంగాణ బిడ్డలుగా మేం కలిసి పనిచేస్తున్నాం. ఆయన ఎలా పనిచేశారో మీ అందరికీ తెలుసు. ఆయన కొడుకు సతీశ్ నాకు సొంత తమ్ముడు లాంటి వాడు. ఆయనకు నా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటయ్. నిరంతరం అభివృద్ధిని కాంక్షిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనే ఆలోచనలో ఉన్న సతీశ్కుమార్ను గెలిపిస్తేనే ఇక్కడి ప్రజలకు మంచి జరుగుతుంది.
– 2018 సెప్టెంబర్ 7న హుస్నాబాద్ గడ్డపై నిర్వహించిన మొదటి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
కాంగ్రెసోళ్లు ఆవురావురుమీద ఉన్నరు. వాళ్లకు ఓటేస్తే పంటికి అంటకుండా గుటుక్కున మింగేస్తరు. మళ్ల అన్ని దుర్మార్గాలు మొదలైతయి. నియోజకవర్గం భ్రష్టుపడుతుంది. ఐదేళ్ల కింద ఎట్లున్నదో మళ్లీ అలాగే తయారైతది. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పింది విని మీరిక్కడనే వదిలి పెట్టద్దు. మీరు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ కేసీఆర్ అన్న మాట ఇది నిజమా..? అబద్ధమా..? అని విజ్ఞతతో మీరంతా ఆలోచన చెయ్యాలె. అన్ని అవకాశాలు సంపూర్ణంగా తేవడానికి, భారత దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి ముందుకు పోతున్నం.
– 2018 సెప్టెంబర్ 7న హుస్నాబాద్ గడ్డపై నిర్వహించిన మొదటి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈ రోజు మీరందరూ గుర్తించాల్సిన విషయం ఒకటున్నది. యాభై ఏండ్లలో ఏనాడూ సంక్షేమం గురించి ఆలోచించని వాళ్లు ఈ రోజు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నరు. ఎందుకంటే వాళ్లు అధికారంలో వచ్చేదా..? చచ్చేదా..? ఏది పడితే అది చెబుతున్నరు. ప్రేక్షక పాత్ర వహించిన్రు. ఢిల్లీకి గులాముల్లాగా బతికిన్రు. వీళ్లకు నోరెక్కడ వస్తది? ఆంధ్రా సీఎంలను, ఢిల్లీ నాయకులను చూస్తేనే లాగులు తడుస్తయ్. వీళ్లకు స్వాతంత్య్రం ఇక్కడ ఉన్నదా..? తెలంగాణ నిర్ణయాలు ఇక్కడ జరుగుతయా..? వీళ్లకు బాసులు ఢిల్లీలో ఉంటరు. కాంగ్రెస్ చక్రవర్తులు ఢిల్లీలో ఉంటరు. మనం సామంతులుగా ఉండాలంటున్రు. హుస్నాబాద్లో చైతన్యవంతులైన ప్రజానీకం ఉంది. మన రాజకీయ పెత్తనం, మన నిర్ణయాధికారం మన చేతుల్లో ఉండాలా..? ఢిల్లీకి గులాములుగా ఉండాలా..? అని మీరే ఆలోచన చేయాలే.
– 2018 సెప్టెంబర్ 7న హుస్నాబాద్ గడ్డపై నిర్వహించిన మొదటి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
గ్యారంటీగా నేనొక మాట చెబుతున్నా. కాంగ్రెస్ గెలిస్తే మొట్టమొదలు ఆగమయ్యేది, ఎటమటమయ్యేది కరెంటే. మళ్ల కోతలు మొదలవుతయ్. వీళ్లు సక్కగా ఇవ్వరు. ఇచ్చే తెలివి కూడా వీళ్లకు లేదు. ఆ తెలివే ఉంటే ఇన్నాళ్లు మనలను ఎందుకు ఏడిపించెటోళ్లు? ఎన్ని మోటర్లు కాలవెట్టిన్రు. ఎన్ని బాధలు వెట్టిన్రు. అందుకే ప్రజలు ఆలోచించాలి. ఈ రోజు మిమ్మల్నందరిని కోరేది ఒకటే! పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినం. ఈ రోజు కరెంటు బాధలు పోయినయ్. సంక్షేమం మంచిగున్నది. తెలంగాణ ప్రశాంతంగా నిద్రపోతున్నది. నా కల, నా లక్ష్యం కోటి ఎకరాలు సస్యశ్యామలం కావాలె. అన్ని వర్గాల ప్రజలు ఆత్మ గౌరవంతో బతికే పరిస్థితి ఉండాలె. మేము చేసిన కష్టం మీ కండ్ల ముందున్నది. కొన్ని ఫలితాలు వచ్చినయ్. కొన్ని రాబోతున్నయ్. కొన్ని సమస్యలు తీరినయ్. ఇంకా తీరాల్సినవి ఉన్నయ్. మరోసారి మీరు అవకాశమిస్తే బ్రహ్మండంగా కోటి ఎకరాల మాగాణి సాధిస్తాం. కనురెప్ప కొట్టినంత సేపు కరెంటు పోకుండా తెలంగాణను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దుతం.
– 2018 సెప్టెంబర్ 7న హుస్నాబాద్ గడ్డపై నిర్వహించిన మొదటి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్