జమ్మికుంట, అక్టోబర్26 : కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలని, రైతులు బాగుపడుతుంటే చూడలేని వాటికి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు ఇవ్వడం చేతకావడం లేదని, ఇక్కడి ప్రభుత్వం రైతులను ఆదుకుంటే రైతుబంధును ఆపేయాలని ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు.
సీజన్ సాగుకు సిద్ధమైన రైతులకు పెట్టబడి సాయం చేయడం నేరమా? అని ప్రశ్నించారు. రైతులు బాగుపడడం కాంగ్రెస్, బీజేపీకి అస్సలు ఇష్టం లేదని, రైతులను కన్నీళ్లు పెట్టించడమే ధ్యేయంగా ముందుకు వస్తున్న ఆ రెండు పార్టీల నాయకులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇష్టానుసారంగా రైతులకు వాగ్ధానాలు చేసి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆరు నెలల కాలంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. అక్కడ ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ర్టాల్లో రైతులను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నాయని అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోవడం లేదన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు ఎందుకు అందించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు చీకట్లలో గడిపారని, వ్యవసాయానికి విద్యుత్ అందించలేదని తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతలు శాంతియుతంగా నిరసన చేస్తే.. బీజేపీ ప్రభుత్వం రైతులపై చేసిన దాడులను గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజలు కాంగ్రెస్, బీజేపీ మోసాలను గమనించాలని, బీఆర్ఎస్కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
తనను గెలిపిస్తే నియోజవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదన్నారు. అంతకుముందు కాంగ్రెస్, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఇక్కడ సర్పంచ్ దేవేందర్రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సంపత్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాయినేని తిరుపతిరావు, తక్కళ్లపెల్లి సత్యనారాయణరావు, గ్రామశాఖ అధ్యక్షుడు రాజు, మాజీ జడ్పీటీసీ నవీన్కుమార్, నాయకులు ముజీబ్, హుస్సేన్, వాణీరావు, మొండయ్య, ఖాజాహుస్సేన్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.