సైదాపూర్, మే 24 : కార్యకర్తలే పార్టీకి బలమని, కేసీఆరే దేశానికి శ్రీరామరక్ష అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ అన్నారు. మండలానికి చెందిన 13 గ్రామాల నాయకులు, కార్యకర్తలకు బుధవారం మొలంగూర్ క్రాస్రోడ్డులోని వీఎస్ఆర్ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ మాట్లాడుతూ, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో నాయకులు, కార్యకర్తల మధ్య అనుబంధం బలోపేతం అవుతుందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. నియోజకవర్గంలోని లక్షా 6 వేల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు.
కాళేశ్వరం జలాలను మండలానికి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడుస్తున్నదని, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మన గ్రామాలు దేశంలోని ఇతర గ్రామాలకు దీటుగా అభివృద్ధి చెంది జాతీయ అవార్డులు సైతం పొందడం అభినందనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పథకాల గురించి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలే శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు.
ఇంటర్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే
మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన మేడవేని రమేశ్ కూతురు నాగరాణి తిమ్మాపూర్ ఎంజేపీ కాలేజీలో చదివి ఇంటర్ ప్రథమ సంవత్సరం (హెచ్ఈసీ)లో 489 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచింది. ఎమ్మెల్యే విద్యార్థిని శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త తిరుపతి రెడ్డి, సింగిల్విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెల్మల్ల రాజేశ్వర్ రెడ్డి, సర్పంచులు కాయిత రాములు, అబ్బిడి పద్మారవీందర్ రెడ్డి, పైడిమల్ల సుశీలాతిరుపతిరెడ్డి, కొత్త రాజిరెడ్డి, తాటిపల్లి యుగేంధర్ రెడ్డి, కొండ గణేశ్, తొంట కాంతమ్మ, బొడిగ పద్మజకొంరయ్య, బత్తుల కొమురయ్య, ఐలయ్య, ఎంపీటీసీ తొంట ఓదెలు, సింగిల్ విండో డైరెక్టర్ల ఫోరం మండలాధ్యక్షుడు బొమ్మగాని రాజు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.
మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలి
హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మరోసారి వొడితల సతీశ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయనను ప్రజలు ఆదరించి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్నాబాద్ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వాన అభివృద్ధి చేశారు. రానున్న ఎన్నికల్లో వరుసగా మూడోసారి సతీశ్కుమార్ను గెలిపించి మన సత్తాచాటాలి.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలి
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది. ప్రభుత్వం చేసిన పనులను గ్రామగ్రామాన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలి. గ్రామానికి వచ్చిన నిధులు, సంక్షేమ పథకాలను వారికి తెలుపాలి. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రజల్ని చైతన్యపరచాలి.
– నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ